15, మార్చి 2014, శనివారం

భారతదేశంలో మతద్వేష రాజకీయాలు చెల్లవ్ - మరోసారి నిరూపణ

కాంగ్రెస్ పార్టీ హడావిడిగా దొడ్డి దారిన పని పూర్తి చేయాలనుకున్న వ్యూహం బెడిసికొట్టింది. మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హిందువులను మైనార్టీలకంటే అధ్వాన్నంగా చూపే కుయుక్తులకు గండి పడింది. అడ్డగోలుగా రూపొందించిన మతహింస నిరోధక బిల్లు అటకెక్కింది. 
ఫిబ్రవరి 5వ తేదీన రాజ్యసభ మొదలైన రోజే మతహింస నిరోధక బిల్లును సభలో ప్రవేశపెట్టాలనుకున్న యుపిఎ ప్రభత్వ ప్రయత్నాలకు విపక్షాలు అడ్డుకట్ట వేశాయి. నిరసనలు, ఆందోళనల మధ్య కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే మతహింస నిరోధక బిల్లును ఎగువ సభలో ప్రవేశపెట్టారు. అయితే సభలో రాద్ధాంతం చెలరేగింది. ఏకపక్షంగా బిల్లును ఎలా ప్రవేశపెడతారంటూ బిజెపి సహా విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. 
ఆంధ్రపదేశ్ విభజన ప్రక్రియ పార్లమెంటును కుదిపేస్తున్న సంకేతాలు, సమాచారం ఉండటంతో మతహింస నిరోధక బిల్లును మమ అనిపించాలని యుపిఎ సర్కారు భావించింది. ఈ బిల్లును వ్యతిరేకించిన బిజెపి సభ్యుడు అరుణ్ జైట్లీ పలు అభ్యంతరాలు లేవనెత్తారు. శాంతి భద్రతల అంశం రాష్ట్రాల పరిధిలో ఉంటుందని, కేంద్రం పరిధిలోకి రాదని చెప్పారు. ఇది రాష్ట్రాల హక్కులను ఉల్లంఘించడమేనన్నారు. సభకు ఇలాంటి బిల్లు తెచ్చే అర్హత లేదన్నారు. మతహింస నిరోధక బిల్లును రాజ్యసభలో బిజెపితో సహా ఏ.ఐ.ఏ.డి.ఎం.కె., తృణమూల్ కాంగ్రెస్, సి.పి.ఐ., సి.పి.ఎం. తదితర పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. 
మతహింస నిరోధక బిల్లుపై ఇటు ప్రజల్లోనూ, అటు రాజకీయ నాయకులలోనూ భయాందోళనలు ఎందుకు నెలకొన్నాయో ఓసారి చూద్దాం ! 
2011లో రూపొందించిన ఈ బిల్లు హిందువులపై అకారణంగా ప్రయోగించేందుకు ముస్లింలకు ఒక అస్త్రంలా పరిణమించే ప్రమాదం ఉంది. 2011లోనే ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు యుపిఎ ప్రభుత్వం విపలయత్నం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు, హిందూ సమాజం తీవ్రంగా వ్యతిరేకించడంతో వెనక్కు తగ్గింది. మైనార్టీలపై దాడులు జరిగితే మాత్రమే వర్తించే ఈ చట్టం హిందువులపై దాడులు జరిగితే మాత్రం వర్తించదు.  
హిందువులు అల్పసంఖ్యాకులుగా ఉన్న కాశ్మీరు, ఈశాన్య రాష్ట్రాల్లోనూ హిందువులు మైనార్టీలే అయినా ఈ బిల్లు వర్తించదు.  
ఈ బిల్లు అమల్లోకి వస్తే హిందువులు అసత్య ఆరోపణలకు, చేయని తప్పులకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఏ కారణం లేకుండా హిందూ మతానికి చెందిన ఓ వ్యాపారిపై ముస్లిం వ్యాపారి కేసు పెట్టవచ్చు. ఒక్కసారి కేసు పెట్టారంటే విచారణ లేకుండానే అరెస్టు చేసే అవకాశముంది. బెయిల్ కూడా లభించని కఠిన సెక్షన్ల కింద కేసు పెట్టొచ్చు.  
మైనార్టీలను మానసికంగా వేధిస్తున్నారన్న చిన్నా చితకా కారణాలతోనూ హిందువులపై కేసులు పెట్టడానికి ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది. ఎవరైనా ఓ కార్యకర్త తప్పు చేస్తే ఆ సంస్థ అధినాయకులపై వాళ్లకు తెలియకుండానే కేసులు పెట్టొచ్చు. ఆ సంస్థలను నిషేధించవచ్చు కూడా. మతహింస నిరోధక బిల్లు వెనుక దాగి ఉన్న అంశాల్లో ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇలాంటి చాలా వివాదాస్పద అంశాలను హిందువులను ఇబ్బందులకు గురి చేయడమే లక్ష్యంగా ఈ బిల్లులో పొందుపరిచారు.
- హంసినీ సహస్ర 

7, మార్చి 2014, శుక్రవారం

రాష్ట్రంలో ఎన్నికల జాతర

 

         రాష్ట్రంలో ఎన్నికల జాతర మొదలైంది. ఒకటి కాదు.. రెండు కాదు... ఇప్పటికే మూడు ఎన్నికలు ఖరారు కాగా... మరో ఎన్నికల షెడ్యూల్‌కు రంగం సిద్ధమైంది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు తోడు.. సుప్రీంకోర్టు ఆదేశాలతో మున్సిపాలిటీలకు కూడా ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఇప్పుడు తాజాగా జిల్లాపరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికలపైనా సుప్రీంకోర్టు కన్నెర్ర జేయడంతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. యేళ్లకు యేళ్లు ప్రత్యేక అధికారుల పాలన విధించడంపై ప్రభుత్వానికి సుప్రీం మొట్టికాయ వేసింది. దీంతో.. ప్రభుత్వం హడావిడిగా స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. దీంతో... సోమవారం మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానుంది.

4, మార్చి 2014, మంగళవారం

విలీనం తెచ్చిన గందరగోళం

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు షాక్‌ తగిలింది. గులాబీ ముల్లు గుచ్చుకుంటోంది. తెలంగాణ ఇచ్చేసినందున.. ఇక టీఆర్‌ఎస్‌ తమ పార్టీలో విలీనం అవుతుందనుకున్న కాంగ్రెస్‌పార్టీ ఆశలు అడియాసలయ్యాయి. విలీనం ప్రసక్తే లేదని కేసీఆర్‌ స్వయంగా ప్రకటించడంతో సరికొత్త యుద్ధం మొదలైంది. ఇంతకాలం వేర్వేరుగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఇరు పార్టీల నేతలు ఇప్పుడు ముఖాముఖి తలపడుతున్నారు. మాటల యుద్ధానికి తెరలేపారు. టీఆర్‌ఎస్‌, టీ-కాంగ్రెస్‌ నేతల మధ్య నువ్వా.. నేనా అన్నంతగా మాటల తూటాలు పేలుతున్నాయి. ఫలితంగా తెలంగాణలో రాజకీయ పరిణామాలు రంజుగా మారాయి. మరోవైపు.. సార్వత్రిక ఎన్నికలూ ముంచుకొస్తుండటంతో.. పరిస్థితి ఆసక్తికరంగా మారింది.

2, మార్చి 2014, ఆదివారం

మోగనున్న ఎన్నికల నగారా



               సాధారణ ఎన్నికలకు రేపు నగారా మోగనుంది.  రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఎన్నికల కమిషన్‌ సాధారణ ఎన్నికల నోటిఫికేషన్‌ను వెలువరించనుంది. దీంతో పాటే రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువరిచేందుకు ఎన్నికల కమిషన్‌ కసరత్తు చేస్తోందని సమాచారం. దేశవ్యాప్తంగా ఐదు విడతలుగా ఎన్నికలు జరపాలని ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది. విశ్వసనీయ సమాచారం మేరకు  ఏప్రిల్‌ 16న మొదటి విడత ఎన్నికలు జరుగుతాయి.  మొదటి విడతలో 124 సీట్లకు పోలింగ్‌ జరగనుంది.  ఏప్రిల్‌  22, లేదా 23న 141 సీట్లకు,  ఏప్రిల్‌ 30న 107 సీట్లకు, మే 7న 85 సీట్లకు,  మే 13వ తేదీ 86 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయని సమాచారం. మే 16వ తేదీ ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశముంది.  ఏప్రిల్‌ మూడు, నాలుగు తేదీల నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్‌ 23, 30 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశముంది.  ఉమ్మడి రాష్ట్రంలోనే 294 అసెంబ్లీ సీట్లకు  ఎన్నికలు నిర్వహించనున్నట్టు సమాచారం.

1, మార్చి 2014, శనివారం

మున్సిపాలిటీల రిజర్వేషన్లు ఖరారు : ఎట్టకేలకు మున్సిపోల్స్‌


రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు 19 మున్సిపల్ కార్పోరేషన్లు, 158 మున్సిపాల్టీలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రిజర్వేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అందజేయనున్నారు. అనంతరం మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది.


మున్సిపాలిటీల రిజర్వేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.

మొత్తం మున్సిపాలిటీలు-158

రిజర్వేషన్లు
ఎస్టీ జనరల్                2
ఎస్టీ ఉమెన్                 2
ఎస్సీ జనరల్             10
ఎస్సీ ఉమెన్              10
బీసీ జనరల్               27
బీసీ ఉమెన్                26
మహిళా రిజర్వేషన్లు   41
జనరల్                     40

మొత్తం మున్సిపల్ కార్పోరేషన్లు -19

రిజర్వేషన్లు
ఖమ్మం                                                                      -ఎస్టీ జనరల్
ఒంగోలు                                                                     -ఎస్సీ ఉమెన్
రామగుండం                                                                -ఎస్సీ జనరల్
ఏలూరు, చిత్తూరు, కర్నూలు                                           -బీసీ ఉమెన్
కడప, నెల్లూరు, గ్రేటర్ హైదరాబాద్                                   - బీసీ జనరల్
కాకినాడ, రాజమండ్రి ,నిజామాబాద్, అనంతపురం, తిరుపతి  -ఉమెన్ జనరల్
గుంటూరు, వరంగల్, విజయవాడ,గ్రేటర్ విశాఖ, కరీంనగర్    - జనరల్ కేటగిరి
....................

20, ఫిబ్రవరి 2014, గురువారం

దశాబ్దాల తెలంగాణ కల సాకారం

 ఆంధ్రప్రదేశ్‌ విభజన బిల్లుకు పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదం

          ఎన్నోయేళ్లపాటు ఎదురుచూసిన కల ఎట్టకేలకు సాకారమైంది. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడనుంది. కొత్త రాష్ట్రం ఏర్పాటుకు ఉభయసభల్లోనూ ఆమోదం లభించింది. చారిత్రాత్మక ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదప్రక్రియ పూర్తయ్యింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సభాపరంగా సంపూర్ణమైంది. మూజువాణి ఓటుతో పెద్దల సభ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇక రాష్ట్రపతి సంతకం ఒక్కటే మిగిలింది. నోటిఫికేషన్‌ వెలువడటమే ఆలస్యం. అప్పాయింట్‌మెంట్‌ డే రాగానే.. ఆరోజు నుంచి తెలుగుజాతికి రెండు రాష్ట్రాలు. పది జిల్లాల తెలంగాణ. పదమూడు జిల్లాల సరికొత్త ఆంధ్రప్రదేశ్‌.











          బిల్లులో సవరణలపై బీజేపీ పట్టుబట్టడంతో సందిగ్ధంలో పడ్డ బిల్లు.. గురువారం ఎట్టకేలకు పెద్దల సభ ఆమోదం పొందింది. ప్రభుత్వంతో ఒప్పందం కుదరడంతో బీజేపీ బిల్లుకు సహకరించింది. సీమాంధ్ర కోణంలో బీజేపీ చేసిన కొన్ని ప్రతిపాదనలకు ప్రభుత్వం అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లపాటు ప్రత్యేక కేటగిరీ హోదా ప్రకటించింది. ప్రధాని మన్మోహన్‌ ఈమేరకు స్వయంగా రాజ్యసభలో ప్రకటన చేశారు. రాష్ట్రవిభజన తర్వాత తొలియేడాది రెవెన్యూలోటు ఏర్పడితే కేంద్రమే భరిస్తుంది. హైదరాబాద్‌ పదేళ్లపాటు ఉమ్మడిరాజధానిగా ఉంటుంది.ఆసమయంలో శాంతిభద్రతలు గవర్నర్‌ అదుపులో ఉంటాయి. బిల్లుపై విపక్షాల సవరణలన్నీ వీగిపోయాయి.




              ఉభయసభల్లోనూ తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంతో రాష్ట్రపతి ఇవ్వబోయే అప్పాయింట్‌మెంట్‌ డేపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆదాయ వనరులు, ఆస్తులు, ఆప్పులు, ఉద్యోగుల పంపిణీ వంటివన్నీ పూర్తయ్యేందుకు కావాల్సిన సమయం చూసుకొని అప్పాయింట్‌డే నిర్ణయిస్తారు. ఇప్పటికిప్పుడు విభజన అమల్లోకి వస్తే రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన జరిగాకే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దీనికి ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉన్నందున ఉమ్మడిరాష్ట్రంలోనే ఎన్నికలు నిర్వహించి ఆతర్వాత ఆప్పాయింట్‌డే ప్రకటిస్తారని తెలుస్తోంది.

17, ఫిబ్రవరి 2014, సోమవారం

ఢిల్లీలో మోహరించిన విభజన, సమైక్య వాదులు





           తెలంగాణ కల సాకారమవుతోందన్న ఆనందం ఆప్రాంత నేతల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. విభజన ప్రక్రియ కీలక దశకు చేరడంతో  ఢిల్లీ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే.. హస్తినలోనే మకాం వేసిన కేసీఆర్‌ కొత్త అనుమానం వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాటు హైదరాబాద్ ను యూటీ చేయాలనే ప్రతిపాదనను కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్ వెల్లడించారు. ఇదే అంశంపై తనతో జైరామ్ రమేష్ చర్చలు జరిపినట్లు కేసీఆర్ తమ పార్టీ నేతలు, జేఏసీ నేతలతో చెప్పారు. తెలంగాణ బిల్లుపై లోక్ సభలో చర్చ జరుగుతుందని.. అలాగే ఆమోదం కూడా పొందుతుందని కేసీఆర్ వారికి భరోసా ఇచ్చారు. టీఆర్ఎస్ విలీనంపై కూడా చర్చలు జరుగుతున్నాయన్న కేసీఆర్‌.. ఆంక్షలు లేని సంపూర్ణ తెలంగాణ ఇస్తే దేనికైనా సిద్ధమని కాంగ్రెస్‌ ముఖ్యనేతలకు చెప్పానన్నారు.

           అటు.. రాష్ట్ర విభజన వద్దంటూ ఢిల్లీలో మహాధర్నా చేపట్టిన ఏపీ ఎన్జీవోలు రాంలీలా మైదాన్‌లో మకాం వేశారు. రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకొని తీరతామని మహాధర్నాకు వచ్చిన నేతలు ఘంటాపథంగా చెబుతున్నారు. ఇక లగడపాటి రాజగోపాల్‌ వేదికపై మాట్లాడలేక కన్నీరు పెట్టుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ ఏపీఎన్జీవో నాయకుడు గుండెపోటుతో మరణించాడు.

           ఇక.. ఏపీ భవన్‌ మాత్రం ఇరుప్రాంతాల నేతల మోహరింపుతో గంభీరంగా మారింది. ఎవరికి వారు వ్యూహ ప్రతివ్యూహాలు చేస్తున్నారు. ఆలోచనలకు పదును పెడుతున్నారు. అయితే.. ఏం జరుగుతుందనేది ఇవాళ మధ్యాహ్నానికి క్లారిటీ వస్తుంది. అప్పటిదాకా క్షణక్షణం ఉత్కంఠ. ఉద్వేగ భరితమే...