18, సెప్టెంబర్ 2013, బుధవారం

హుస్సేన్‌సాగర్‌కు కంఠాభరణంలా గణపయ్యలు



హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ తీరాన్ని గణనాథులు ఆక్రమించేశారు. సాగర్‌ చుట్టూ విఘ్నేశ్వరుని విగ్రహాలు కంఠాభరణంలా కనిపిస్తున్నాయి. జంటనగరాల్లోని కాలనీలు, వీధులు, రోడ్లన్నీ గణేశుని శోభాయాత్రలో మునిగిపోయాయి. హుస్సేన్‌ సాగర్‌ వద్ద ఏర్పాటు చేసిన భారీ క్రేన్లకు తోడు.. మొబైల్‌ క్రేన్లతో వినాయకుడి విగ్రహాలను హుస్సేన్ ‌సాగర్‌లో నిమజ్జనం చేస్తున్నారు. ఉదయం నుంచి కాస్త మందకొడిగా తరలివచ్చిన గణనాథులు.. సాయంత్రానికి హైదరాబాద్‌ రోడ్లను ఆక్రమించేశారు. ప్రధాన శోభాయాత్ర మార్గం ఇసకేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. భక్తుల భజనలు, యువతుల కోలాటాలు, యువకుల సందడి మధ్య గణేశులు ముందుకు సాగుతున్నారు. మరోవైపు.. సాయంత్రం హైదరాబాద్‌ నగరాన్ని కుండపోత వర్షం ముంచెత్తింది. రోడ్లన్నీ వరద నీటితో నదులను తలపించాయి. అయినా.. భారీ వర్షంలోనే భక్తులు శోభాయాత్రలో పాల్గొన్నారు. తెల్లవార్లూ గణేశ నిమజ్జనోత్సవం ఉధృతంగా సాగనుంది. ఇటు.. నిమజ్జనం సందర్భంగా నగరంలోని అన్ని రోడ్లలో ట్రాఫిక్‌ను మళ్లించారు. ప్రత్యేకంగా కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటుచేశారు. శోభాయాత్రలోని ప్రధాన కూడళ్లు, హుస్సేన్‌సాగర్‌ చుట్టూ సిసి కెమెరాలు అమర్చిన పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి