17, ఫిబ్రవరి 2014, సోమవారం

నేడు లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు - 2014 ఆమోదం!






             ఆరు దశాబ్దాల తెలంగాణ పోరాటం ఫలించే కల ఆఖరి అంకానికి చేరింది. తెలంగాణ బిల్లుకు నేడే ఆమోదం వేసే అవకాశం కనిపిస్తోంది. ఈమేరకు కాంగ్రెస్‌,  బీజేపీ మధ్య అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. చర్చ లేదా మూజువాణి ఓటుతో బిల్లును గట్టెక్కించేందుకు అధికారపార్టీ పావులు కదుపుతోంది. ఇవాళ లోక్‌సభలో చేపట్టనున్న సభా కార్యక్రమాల్లో 41వ అంశంగా తెలంగాణను చేర్చారు. పునర్విభజన విధానాన్ని వివరిస్తూ 6 పేజీల బులెటిన్ ను.. లోక్ సభ సచివాలయం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014పై చర్చించాల్సిందిగా కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే సభను కోరతారు. ప్రభుత్వం తరపున యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ చర్చను ప్రారంభించే అవకాశం ఉంది. వీలైనంతవరకు చర్చ జరిపి ఆమోదించేందుకు ప్రయత్నిస్తారు. అది కుదరకపోతే మూజువాణి ఓటుతోనైనా విభజన బిల్లును  ఆమోదించాలని భావిస్తున్నారు. అదే సమయంలో ఓటింగ్‌కు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ లోక్‌సభలో ఆమోద ప్రక్రియ పూర్తికాగానే.. బుధవారం లేదా గురువారం రాజ్యసభలోనూ విభజన బిల్లును గట్టెక్కించాలన్న నిర్ణయానికి వచ్చారు. బిల్లుకు బీజేపీ సహకారం ఖాయమని కాంగ్రెస్‌ నేతలు భరోసాతో ఉన్నారు. మరోవైపు.. వచ్చే వారం రోజులు ఎంపీలు తప్పనిసరిగా పార్లమెంటుకు హాజరుకావాలని కాంగ్రెస్ విప్ జారీ చేసింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి