29, ఏప్రిల్ 2019, సోమవారం

ప్రచార జోరు..

ప్రచార జోరు..

ప్రచార జోరు..
తెలంగాణ ఎన్నికల్లో ప్రధానమైన నామినేషన్ల ఘట్టానికి తెర పడింది. నియోజకవర్గాల్లో అన్ని పార్టీల అభ్యర్థులు పూర్తిగా ప్రచార పర్వంలో మునిగిపోయారు. దీంతో రాష్ట్రంలో నిజమైన ఎన్నికల వాతావరణం వచ్చి చేరింది. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడంలో ప్రధాన పార్టీల అభ్యర్థులంతా మునిగిపోయారు.
బహుముఖ పోటీ
ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఒంటరిగా బరిలో దిగుతుండగా, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ కూడా ఏ పార్టీతోనూ పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తోంది.
ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌, తెలుగుదేశం లీడ్‌ రోల్‌ పోషిస్త్తూ అధికార టీఆర్‌ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా జట్టుకట్టాయి. టీఆర్‌ఎస్‌, బీజేపీ మినహా తెలంగాణలో మనుగడలో ఉన్న పార్టీలను ఏకతాటి పైకి తెచ్చి ప్రజాకూటమి పేరిట ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి. ఇందులో కాంగ్రెస్‌, టీడీపీ, తెలంగాణ జన సమితి, సీపీఐ పార్టీలున్నాయి. సీపీఎం ‘బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌’ పేరిట చిన్నా చితక పార్టీలతో తనదైన ప్రచారం సాగిస్తోంది.
హ్యాండిచ్చిన కాంగ్రెస్‌
కాంగ్రెస్‌ పార్టీ చివరి నిమిషంలో మిత్రపక్షాలకు హ్యాండిచ్చింది. టీడీపీకి ఇస్తామని మాటిచ్చిన స్థానాలు, తెలంగాణ జనసమితి అభ్యర్థులు అప్పటికే నామినేషన్లు దాఖలు చేసిన స్థానాల్లోనూ ఆ పార్టీ చివరి నిమిషంలో బీ ఫామ్స్‌ ఇచ్చింది. పొత్తుల్లో భాగంగా కూటమి పార్టీలకు కేటాయించిన ఆరు స్థానాల్లోనూ కాంగ్రెస్‌ అదనంగా బీ-ఫారాలు ఇచ్చింది. దాదాపు నెలరోజుల పాటు సీట్ల పంపకాల విషయంలో కాలయాపన చేసిన కాంగ్రెస్‌ ఆఖరి నిమిషంలో గందరగోళ పరిస్థితులు సృష్టించిందని మిత్ర పక్షాలు తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశాయి. అయితే టీఆర్‌ఎస్‌ ఓటమే లక్ష్యమంటూ ఆ అసహనాన్ని బయటకు కనిపించకుండా మిత్రధర్మాన్ని పాటిస్తా మంటూ టీడీపీ, జనసమితి సర్దుకుపోయాయి.
స్నేహ పూర్వకం తప్పదా!?
మొత్తం 119 నియోజకవర్గాల్లో 25 స్థానాలను టీడీపీ, తెలంగాణ జనసమితి, సీపీఐకి కేటాయించగా కాంగ్రెస్‌ 94 స్థానాలకు పోటీ చేయాల్సి ఉంది. అయితే కాంగ్రెస్‌ పార్టీ మొత్తం వంద స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చింది. టీడీపీ 13 నియోజకవర్గాల్లోనే పోటీ చేస్తోంది. పొత్తుల్లో భాగంగా ఈ పార్టీకి 14 స్థానాలు కేటాయించినప్పటికీ విడతల వారీగా స్పష్టత వచ్చిన 13 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది.
తెలుగుదేశం, సీపీఐకి కేటాయించిన స్థానాల్లో కాంగ్రెస్‌ బీ ఫారాలు ఇవ్వకున్నా అక్కడ ఆ పార్టీ తిరుగుబాటు అభ్యర్థులు బరిలోకి దిగారు. కాంగ్రెస్‌, తెలంగాణ జనసమితి మధ్య మాత్రం నేరుగా పోటీ నెలకొంది. సీట్ల సర్దుబాటుపై సుదీర్ఘంగా కసరత్తు చేసిన మహాకూటమి నేతలు చివరకు ఓ అంగీకారానికి రాలేక పరస్పరం పోటాపోటీగా బీ ఫారాలు ఇచ్చి నామినేషన్లు దాఖలు చేయించడంతో పదకొండు స్థానాల్లో కూటమి పార్టీల మధ్యే పోటీ నెలకొంది.
రికార్డు స్థాయిలో నామినేషన్లు
రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఆఖరి నిమిషం వరకూ ప్రధాన పార్టీల అభ్యర్థిత్వాల ఖరారు కొనసాగుతూనే ఉండటంతో ఒక్క నామినేషన్ల చివరి రోజే రికార్డు స్థాయిలో 2,087 నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,584 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇంత పెద్ద సంఖ్యలో నామినేషన్లు రావడం ఇదే తొలిసారి.
ప్రధాన పార్టీల పరంగా చూస్తే టీఆర్‌ఎస్‌ నుంచి 119 మంది, కాంగ్రెస్‌ నుంచి 135 మంది, బీజేపీ నుంచి 128 మంది, సీపీఎం నుంచి 28మంది, టీడీపీ నుంచి 20మంది, బీఎల్‌ఎఫ్‌ నుంచి 112 మంది, ఎంఐఎం నుంచి 13 మంది నామినేషన్లు సమర్పిం చారు. 2014 ఎన్నికల్లో 2,662 మంది నామినేషన్లు సమర్పించగా ఈసారి ఆ సంఖ్య 3,584కు పెరిగింది.
ఏ పార్టీ అయినా ఓకే..!
ఈ ఎన్నికల్లో మరో అంశం ఆసక్తికరంగా మారింది. టీఆర్‌ఎస్‌ పార్టీ అసెంబ్లీ రద్దు నాడే 105 మంది అభ్యర్థులను ప్రకటించడం, మహాకూటమి పేరుతో జట్టుకట్టిన కాంగ్రెస్‌, టీడీపీ నామినేషన్ల చివరి రోజు దాకా అభ్యర్థులను పూర్తిస్థాయిలో ఖరారు చేయకపోవడం వంటి అంశాల నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులు భారీగా చోటుచేసుకున్నాయి. అయితే కొంతమంది అలా పార్టీలోకి రాగానే ఇలా టికెట్లు దక్కించుకోవడం హైలైట్‌గా నిలిచింది. ‘పార్టీ ఏదైనా సరే టికెట్‌ కావాలంతే’ అన్నట్లుగా ఆశావహులైన అభ్యర్థులూ రాత్రికి రాత్రే కండువాలు మార్చి తాము కోరుకున్న స్థానాల్లో బరిలోకి దిగిపోయారు. పార్టీలు కూడా కొన్నేళ్లుగా పనిచేస్తున్న వారిని కాదని, గెలిచే అవకాశం ఉంటుందనో, గట్టి పోటీ ఇస్తారనో నమ్మకం కుదిరితే చాలు రాత్రికి రాత్రి కండువా కప్పి బీ ఫారం ఇచ్చేశాయి.
కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీలే కాదు, బీజేపీ, సీపీఎం నేతృత్వంలోని బీఎల్‌ఎఫ్‌ కూడా ఇలాంటి వారికి వేదిక అయ్యాయి. అలా పది మందికిపైగా తాజా మాజీ ఎమ్మెల్యేలు, పలువురు నేతలు కూడా పార్టీలు మారి బీ ఫారాలు దక్కించుకున్నారు.
– సప్తగిరి.జి, 9885086126 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి