21, అక్టోబర్ 2017, శనివారం

దేవాలయాలు హిందూ సంస్కృతికి పట్టుగొమ్మలు (జాగృతి నవంబర్‌ 2016 సంచిక)

 దేవాలయాలు హిందూ సంస్కృతికి పట్టుగొమ్మలు
                                 - జాతీయ భావాలు పెంపొందించే వాహకాలు

                                 - గోపగోని సప్తగిరి
                                      98850 86126

    హిందూ సంస్కృతికి పట్టుగొమ్మలు దేవాలయాలు. హిందూధర్మంలో దేవాలయాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఆధ్యాత్మికతతో పాటు.. జాతీయ భావాలను కూడా పెంపొందించే వాహకాలు ఆలయాలు. ఒకప్పడు ఆలయాల్లో ఉండే పరిస్థితులు, సాగే కార్యకలాపాలు, జరిగే చర్చలే ఇందుకు నిలువెత్తు నిదర్శనాలు. కాలక్రమంలో ఆధునికత ముసుగులో నాగరికపు ఆలోచనలు మనసులను కమ్మేశాయి. ప్రతీదీ అధునాతనమని చెప్పుకుంటున్న ఈ రోజుల్లో చాలావరకు ఆలయాల్లో సంప్రదాయ కార్యకలాపాలకు కాలం చెల్లిందనే చెప్పొచ్చు. చాలామందికి దేవాలయాలకు వెళ్లడం కూడా ఏదో మొక్కుబడి తంతుగా సాగుతోంది. ఫలితంగా అనాదిగా వస్తున్న సంప్రదాయాలు, మహోన్నతమైన చర్చలు, ముఖాముఖిలకు వేదికలుగా పరిఢవిల్లే ఆలయ ప్రాంగణాలు సహజత్వాన్ని కోల్పోతున్నాయని చెప్పడం బాధాకరమే. మొత్తం కాకున్నా.. నూటికి తొంభైశాతం కృత్రిమ రూపును సంతరించుకున్నాయనడం ఎవరూ కాదనలేని వాస్తవం.

ఆ అనుభూతి అమూల్యం :
    దేవాలయం అంటే పవిత్రమైన ప్రదేశం. దేవాలయానికి వెళ్తే మనసుకు ఉల్లాసం. ఆలయంలో కాసేపు గడిపితే చాలు.. మానసిక ఉత్తేజం సొంతమవుతుంది. మనలోని నిగూఢ శక్తి నిద్రలేస్తుంది. ఆలయ ప్రాంగణాల్లో ఉండే ఆ వాతావరణమే ఓ సరికొత్త ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతిని కలిగిస్తుంది. ఆలోచనాశక్తిని పెంపొందిస్తుంది. మనలను మనం సమీక్షించుకునే పరిస్థితిని తెచ్చిపెడుతుంది. మంచి ఏదో.. చెడు ఏదో గ్రహించగలిగే శక్తి సామర్థ్యాలను ఇస్తుంది. నిత్యం ఆలయాలకు వెళ్లేవాళ్లకు ఈ అనుభవాలు కాదనలేని సత్యం. అయితే.. ఏదో మమ అనుకున్నట్లు వెళ్లడం కాకుండా.. మదినిండా భక్తిభావంతో, కల్మషం లేని మనసుతో.. దేవుడిపైనే శ్రద్ధ పెడితే ఆ కాసేపటి కాలం.. మనకు ఎంతో విజ్ఞానాన్ని కలుగజేస్తుంది. వేదాలు, శాస్త్రాల అధ్యయనం, ప్రార్థనలు, ఆధ్యాత్మిక గీతాల మననం మరింత పరిపూర్ణులుగా తీర్చిదిద్దుతుంది.

ప్రతీ అంశం వెనుకా పరమార్థం :
    భగవత్సాక్షాత్కారం కోసం ప్రతి హిందువు తపన పడతాడు.. ప్రయత్నిస్తాడు. దేవాలయంలో పూజలు చేస్తాడు. ఆలయం ఒక దేహం లాంటిది. శిఖరం శిరస్సు, గర్భగృహం మెడ, ముందరి మంటపం ఉదరం, ప్రాకారపు గోడలు కాళ్ళూ, గోపురం పాదాలు. ధ్వజ స్తంభమే జీవితం. ఇలా ఆలయం భగవన్మూర్తిగా భావింపబడుతోంది. అందువల్లనే దేవాలయాన్ని పవిత్రంగా భావిస్తున్నాము. ఆ స్థలాన్ని పుణ్యక్షేత్రంగా పరిగణిస్తున్నాము. దేవాలయం భౌతిక శరీరం, మానసిక శరీరం, తైజసిక శరీరాలను ప్రతిబింబించే ఒక ప్రతీక. అందువల్లనే దేవాలయం భగవంతుడికి మానవుడికి ఉన్న ఒక లింక్‌ అని విజ్ఞుల  అభిప్రాయం. 

    దేవాలయం పరమపవిత్రమైన స్థలం. కాబట్టి ప్రతి ఒక్కరూ నిత్యం దేవాలయానికి వెళ్ళి భగవంతున్ని దర్శించుకోవాలని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఆత్మకు దేహం ఆలయమైనట్లే, ఇంటికి పూజామందిరం, ఊరికి దేవాలయం అటువంటిది. కాబట్టి పూజ చేయని ఇంటిలో అడుగు పెట్టరాదు. దేవాలయం లేని ఊరి దారిలో పయనించరాదని శాస్త్రాలు చెబుతున్నాయంటే ఆలయాలకు, భగవత్‌ ఆరాధనకు ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు.    

నిగూఢమైన అంశాలు :
    ఆగమ సంప్రదాయాలను అనుసరించి ఆలయాలు నిర్మించబడతాయి. దానిలో ఒక భగవద్విగ్రహాన్ని మంత్ర యంత్ర తంత్రాదులతో సంస్కరించి ప్రతిష్ఠ చేస్తారు. అర్చకుని తపశ్శక్తిని, భక్తి, శ్రద్ధా విశ్వాసాలను బట్టి అభిషేక పూజాదులను బట్టి దోషం లేని విగ్రహాన్ని బట్టి భగవచ్ఛక్తి ఆ విగ్రహంలో అవతరించి భక్తులను అనుగ్రహిస్తుంటుంది. ఇటువంటి ధార్మిక విషయాలను గుర్తించే వివేకవంతులు, త్యాగులు, భక్తులు పట్టణాల్లో, పల్లెల్లో, కొండల్లో, కోనల్లో దేవాలయాలు కట్టించి నిత్యపూజా కైంకర్యాలకు ఏర్పాట్లు చేసారు. దేవాలయాల్లో మూల విరాట్ కు యంత్రం అమరుస్తారు. ఆ యంత్రం బలంగా పనిచేయడానికి నిత్యం అభిషేకాలు, క్రతువులూ జరుగుతూంటాయి. ఈ యంత్రాల వల్ల తీవ్రమైన, ఉగ్రమైన ప్రభావం ఆ గ్రామానిపై,  భక్తులపై పడకుండా దాన్ని శాంతింప చేయడానికి, యంత్రాలు సవ్యమైన మార్గంలో భక్తులను అనుగ్రహించడానికి ధ్వజస్తంభం ఉపయోగపడుతుంది. దేవాలయంలోని మూల విరాట్ కు సరిగ్గా ఎదురుగా ధ్వజ స్తంభాన్ని ప్రతిష్ఠిస్తారు. సశాస్త్రీయంగా యంత్రం కలిగిన దేవాలయంలో ధ్వజస్తంభం తప్పనిసరిగా ఉండాల్సిందే. పైన యంత్రం, కింద విమానం ఈ రెండింటి మధ్యన ఉంటూ, వాటిని కాపాడేది ధ్వజస్తంభం. యంత్రాలు లేని దేవాలయాలకు ధ్వజస్తంభాలుండవు.

మహోన్నత చరిత్ర :
     వాస్తు శాస్త్ర బద్దంగా, శిల్పకళామయంగా నిర్మించిన దేవాలయం సర్వారిష్టహారం, సర్వమంగళప్రదం. సనాతన కాలంనుంచి దేవాలయాలు ఉన్నాయి. అశోకుని కాలానికి ముందే ఆలయాలు నిర్మించబడినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. నగరాల్లో, పల్లెటూళ్ళల్లో శివకేశవ శక్తి గణేశాది దేవతలకు ఆలయాలు నిర్మించి తీరాలని కౌటిల్యుని అర్థశాస్త్రంలో కనబడుతోంది. చంద్రగుప్తుని కాలంలో ఆలయ నిర్మాణం వ్యాప్తి చెందింది. శుంగుల కాలంలో దేవాలయలు ఎక్కువగా నిర్మించబడినట్లు చరిత్ర చెబుతోంది. వారిని ఆదర్శంగా తీసుకొని బౌద్దులు చిహ్న శిఖరాలుండే బ్రాహ్మణ మందిరాలను నిర్మించారు. శాతవాహనులు, గుప్తులు కూడా దేవాలయాలను కట్టించినవారే. కాలక్రమంగా ఆలయాలు విశ్వవ్యాప్తమయ్యాయి. ఆయా ప్రాంతాలలో భిన్న భిన్న సంప్రదాయాలను బట్టి ఆలయ నిర్మాణం జరుగుతూ వచ్చింది.

ఆలయాలు ఐదు రకాలు :
    ఆలయాలను ఐదు రకాలుగా పెద్దలు పేర్కొన్నారు. భగవంతుడే స్వయంగా అవతరించినవి స్వయంవ్యక్త స్థలములు. దేవతలచే ప్రతిష్టించబడినవి దివ్య స్థలములు. మహర్షులు, తపస్సుచేసి సిద్ధి పొందిన స్వాములు ప్రతిష్ఠించినవి సిద్ధ స్థలములు. పురాణాలలో చెప్పబడిన ప్రసిద్ధిగాంచినవి పౌరాణ స్థలములు. రాజులు, భక్తుల చేత ప్రతిష్టించబడినవి మానుష స్థలములుగా చెబుతారు.

మనకు తెలియకుండానే మహోన్నత వ్యక్తిత్వం :
    దేవతలకు నిలయమైన దేవాలయానికి వెళ్ళేముందు శుచి శుభ్రత ప్రధానం. మొదట స్నానం చేసి.. శుభ్రమైన దుస్తులు ధరించి సంప్రదాయానుసారం నొసట బొట్టు పెట్టుకొని నిర్మలమైన మనస్సుతో ఆలయంలోకి ప్రవేశించాలి. హిందూ దేవాలయాలలో ఉండే భాగాలు, దేవాలయ సందర్శన సమయంలో భక్తులు పాటించే ఆచారాలను పెద్దలు ప్రత్యేకంగా పేర్కొన్నారు. దేవాలయంలో అర్చకులు, భక్తులు వ్యవహరించకూడనివి కూడా ఆగమ శాస్త్రములో ఉన్నాయి. ఆలయం లోపల వాహనము మీదగానీ, పాదరక్షలతో గాని తిరుగరాదు. మొదట ప్రదక్షిణము చేసిన తర్వాతే ఆలయము లోనికి ప్రవేశించాలి. తలపాగా ధరించిగాని, చేతిలో ఆయుధము పట్టుకొనిగాని ఆలయం లోనికి ప్రవేశించరాదు.ఆలయములోకి ఉత్తచేతులతోగాని, తిలకం ధరించకుండా గాని, తాంబూల చర్వణం చేస్తూగాని, ఆహారాదులు తింటూగాని ప్రవేశించరాదు. ఆలయ ప్రాంగణములో మల, మూత్ర విసర్జన చేయరాదు. ఆలయ ప్రాంగణంలో కాళ్ళు చాపుకొని కూర్చోకూడదు, నిద్రపోకూడదు. ఆలయంలో ఏ ప్రాణికైనా దుఃఖం కలిగించే ఎటువంటి హింసనూ చేయరాదు. ఆలయంలో వివాదాలకు స్థానం లేదు. ఆలయ ప్రాంగణంలో అహంకారంతో, గర్వంతో, అధికార దర్పంతో వ్యవహరించకూడదు. ఆలయంలో దేవుని ఎదుట పరస్తుతిని, పరనిందను కూడా చేయరాదు.  అధికార గర్వంతో అకాలంలో ఆలయంలోకి ప్రవేశించి అకాల సేవలు చేయరాదు. ఒక చేతితో ప్రణామము చేయరాదు. 

    ఆలయానికి వెళ్లిన ప్రతి భక్తుడు భగవంతునికి కొబ్బరికాయ సమర్పించుకుంటాడు. టెంకాయలోని డొప్ప, పీచు, టెంక శరీరత్రయాన్ని సూచిస్తాయి. పగులకొట్టడం అంటే వాటిని విడవడం. కొబ్బరికాయలోని పీచు చంచలమైన మనస్సును సూచిస్తుంది. కాబట్టి అది లయమైన తరువాత నిర్మలమైన, శుద్ధమైన పరమాత్మ స్వరూపాన్ని చూడటం జరుగుతుంది. కాబట్టి చివరివరకు కొబ్బరికాయకు జుట్టు ఉండి తీరాలి. ఆ శిఖ అఖండ జ్ఞానాన్ని సూచిస్తుంది. కొబ్బరికాయలోని కండ్లు మూడు కాలాలకు ప్రతినిధులు. కర్పూర హారతిని ఇవ్వడం వల్ల వాసనాశేషాన్ని రూపుమాపడమే అవుతుంది. పసుపు కుంకుమలు మంగళప్రదాలు. విభూతి సమస్త ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది.

    గర్భగృహంలో ప్రవేశద్వారం తప్పితే మరి ఎలాంటి కిటికీలు కానీ ఉండవు. సాధారాణంగా చీకటి అలుముకొని ఉంటుంది. ఈ చీకటి భక్తుణ్ణి విగ్రహం మీదికి దృష్టిని కేంద్రికరింపచేస్తుంది. ఈ లోకాన్ని  మరచి తన్మయత్వాన్ని పొందుతాడు భక్తుడు. తనకు తెలీయనటువంటి అనుభూతిని పొందుతాడు. భక్తుడికి భగవదాకర్షణ, సంపర్కం, ఆశీస్సులు ఇక్కడే లభిస్తాయి. భక్తుడు తనలో దైవాన్ని, సత్యాన్ని చూస్తాడు. తనను తాను సమీక్షించుకుంటాడు.

    ఆలయాలకు సంబంధించిన నియమాలు, నిబంధనలు, దేవాలయ ప్రాంగణాల్లోని వాతావరణం ఓ విధంగా మనిషిలోని స్వార్థాన్ని పారదోలి, విశాలమైన దృక్ఫథాన్ని కలిగి ఉండాల్సిన అవసరాన్ని మనకు తెలియకుండానే నేర్పుతాయి. మన సంస్కృతి, కళలు, శిల్పం, వాస్తు, వేదాంతం, పురాణం మొదలైన వాటి సంగమ స్థానం హిందూ దేవాలయం. ప్రాచీన కాలంనుంచీ శిల్పకళకు, చిత్రకళకు, వాస్తుకళకు ఇలా మన ఔన్నత్యాన్ని తెలుసుకోవడానికి నేడు మనకు ఉన్న పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు కూడా ఒక సాధనంగా ఉపకరిస్తున్నాయి. ఎన్నో దేవాలయాలు పరమత ద్వేషం వల్ల మట్టిపాలైన వాస్తవాలను చరిత్రలో చదువుకున్నాం. వాటికి సంబంధించిన ఆనవాళ్లను నేటికీ చూడొచ్చు. నేడున్న దేవాలయాలను దర్శించి  మనంతా గర్వపడాలి. వీటి సందర్శనం పూర్వ జన్మ సుకృతమనే చెప్పాలి. అదొక మహాభాగ్యం. తీర్థ యాత్రలవల్ల ఆయాప్రాంతాలతో పాటు.. ఆ ప్రాంతాల ప్రజలతో పరిచయం ఏర్పడుతుంది. అక్కడి సంస్కృతి, సంప్రదాయాల గురించి  అవగతమవుతుంది. తద్వారా భావ సమైక్యత, దేశ సమైక్యత ఏర్పడుతుంది. జాతీయ భావాలు పెంపొందుతాయి.

ఆనాటి వైభవం :
    ఒకప్పుడు సాయంకాలం అయ్యిందంటే చాలు.. ఆలయాల్లో పూజలు, మంత్రాల ప్రతిధ్వనులు వినిపించేవి. భజనలతో మారుమోగిపోయేవి. ఊరు ఊరంతా ఆ భక్తిభావంలో, భజన గీతాల్లో ఓలలాడేది. ప్రత్యేక సందర్భాలు, పండుగల సమయంలో అయితే.. తెల్లవార్లూ సాగే భజనామృతాలు ఆధ్యాత్మిక శోభను రెట్టింపు చేసేవి. డోలక్‌ల వాయిద్యాలు, క్రమ పద్ధతిలో సాగే తాళాల పదనిసలు ప్రతి ఒక్కరిలోనూ భక్తిభావాన్ని పెంపొందించేవి. కానీ.. ఇప్పుడు ఆలయాల్లో ఆ భజనల పదనిసలు దాదాపు కనుమరుగయ్యాయి. కొన్ని దేవాలయాల్లో మాత్రం వారానికోసారో, సందర్భానుసారమో భజనలు కొనసాగుతుండటం ఓ విధంగా సనాతన సంప్రదాయం కనుమరుగు కాకుండా జరుగుతున్న చర్యల్లో భాగమని చెప్పవచ్చు. అయితే.. ఈ పరిస్థితి కూడా మరింత ఉధృతంగా సాగాల్సిన అవసరం ఉంది. నాటి దేవాలయ వైభవం మళ్లీ కళ్లముందు కదలాడాల్సిన ఆవశ్యకత ఉంది.

- గోపగోని సప్తగిరి
98850 86126

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి