21, అక్టోబర్ 2017, శనివారం

మహోజ్వల చరితం - భవితకదే దిశా నిర్దేశం (స్ఫూర్తి మాసపత్రిక ఆగస్టు 2017)

మహోజ్వల చరితం  - భవితకదే దిశా నిర్దేశం
                                                                  - సప్తగిరి, ఎం.ఫిల్‌ (జర్నలిజం)
    భారత దేశానికి స్వాతంత్ర్యం లభించి సరిగ్గా ఏడు దశాబ్దాలు. రెండు వందల యేళ్ల పరాయి పాలనకు చరమగీతం పాడి.. 70 సంవత్సరాలు నిండింది. అయినా సమాజంలో అసమానతలు తొలగిపోలేదు. ఆనాటి పెద్దల నిస్వార్థ స్వభావాలు నానాటికీ కనుమరుగవుతున్నాయి. సమాజం అంతా స్వార్థం చుట్టూరా తిరుగుతోంది. దేశం నాకేమి ఇస్తోందని ప్రశ్నిస్తున్న వాళ్లు.. నేను దేశానికి ఏమివ్వగలుగుతానని ప్రశ్నించుకోవడం మానేశారు. ఫలితంగా భారత సమాజం అస్తవ్యస్థంగా తయారైంది. వందశాతం పూర్తిగా ఇదే పరిస్థితి లేకున్నా.. పరిణామాలు మాత్రం ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి.

    స్వాతంత్ర్య సమరయోధులే కాదు.. మన పూర్వీకులు మన ముందు తరాల వాళ్లలోనూ భక్తిభావన, నిస్వార్థ ఆలోచన, ఎదుటివాళ్లకు హానికలిగితే తాము ఎదురొడ్డి నిలిచే మనస్తత్వం మిక్కిలిగా ఉండేది. కానీ.. ఇప్పుడు అలాంటి భావనలు తరిగిపోతున్నాయి. అంటే ఇది చదువుతున్న వాళ్లకు నిరాశావాదం నూరిపోయడం కాదు గానీ.. భావి భారత నిర్మాతలైన విద్యార్థులపైనే ఈ పరిస్థితులను రూపుమాపాల్సిన బాధ్యత ఉంది.

    స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల్లోనే దేశభక్తి అందరిలోనూ ఉప్పొంగుతుంది. ప్రసంగాలు ధారాళంగా సాగుతాయి. మహానుభావుల చరిత్రలు నెమరేయడం జరుగుతుంది. కానీ..  స్వాతంత్ర్య సంగ్రామం సమయంలో ప్రజల స్థితిగతులు ఎంత దిగజారి ఉన్నా, వాటిని ఎదుర్కొని మరీ.. స్వార్థాన్ని విడనాడి పరోపకారం కోసం జీవితాలనే ధారపోసిన ఉత్తమోత్తములు ఎందరో.. ఎందరెందరో.. చరిత్రలో చదువుకున్నవాళ్లే కాదు.. జీవితాలను దేశం కోసం ధారపోసినా.. కనీసం రికార్డులకు కూడా ఎక్కని వాళ్ల జాబితా అంతా రూపొందిస్తేనే చాంతాడంత లిస్టవుతుంది. 

    ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో ఝాన్సీ లక్ష్మీబాయ్‌ గురించి తెలుసుకున్నాం... పుస్తకాల్లో చదువుకున్నాం.. అదే సమయంలో బ్రిటిష్‌ వాళ్లకు చెమటలు పట్టించిన భారత సిపాయి మంగళ్‌ పాండే. ఈస్ట్ ఇండియా కంపెనీలోని 34వ బెంగాల్ రెజిమెంట్‌లో సిపాయిగా పనిచేసేవాడు. కోల్‌కతా దగ్గర బారక్ పూర్ వద్ద 1857వ సంవత్సరం మార్చి 29వ తేదీ మధ్యాహ్నం బ్రిటిష్ అధికారిని కాల్చి చంపాడు మంగళ్‌పాండే. బ్రిటిషు వాళ్లు.. తమ సిపాయిలకు అందించే తుపాకులకు, ఆవు కొవ్వు,  పంది కొవ్వును పూసి తయారు చేసిన తూటాలు ఇచ్చేవారు. ఆ తూటాలని నోటితో కొరికి తొక్క తొలిగిస్తేనే పేలుతాయి. దీన్ని తట్టుకోలేని మంగళ్‌పాండే బ్రిటిష్‌ అధికారిని చంపేశాడు. బ్రిటిష్‌ వాళ్ల సైన్యంలో ఇక్కడివాళ్లే సిపాయిలుగా పనిచేసినా.. వాళ్ల అరాచకాలు, అవమానాలు మౌనంగా భరించేవాళ్లు. కానీ.. భారతీయుల ఆలోచనలను స్వేచ్ఛా స్వాతంత్ర్యాల సాధన వైపు మళ్లించిన ఘనత మంగళ్ పాండేదే.. అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

    ఇక.. చిన్నతనం నుంచే నరనరానా దేశభక్తిని పునికి పుచ్చుకున్న మరో యోధుని గురించి చెప్పుకుందాం... చంద్రశేఖర్‌ ఆజాద్‌ పేరు వినగానే మీసం మెలివేస్తున్న నవ యువకుడి ఫోటో అందరి మదిలో మెదులుతుంది. ఆయన అసలు పేరు చంద్రశేఖర్‌ సీతారాం తివారీ. అయితే.. స్వాతంత్ర్యోద్యమ కాలంలో పసివయసులోనే ఆ బాలుడి తెగింపు చూసి అందరూ పెట్టిన పేరు ఆజాద్‌. దేశం గర్వించదగ్గ ఉద్యమకారుల్లో ఒకడు.. చంద్రశేఖర్ అజాద్. భగత్ సింగ్‌కు ముఖ్య అనుచరుడిగా, హిందూస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ నిర్మాతగా, శత్రువు చేతికి చిక్కకుండా.. తనను తానే ఆత్మాహుతి చేసుకున్న అమరవీరుడిగా భారత ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచాడు చంద్రశేఖర్‌ ఆజాద్‌. పేదరికంలో పుట్టినా విద్యార్థి దశనుంచే అత్యంత ధైర్యసాహసాలు కనబరిచాడు ఆజాద్. వందేమాతర ఉద్యమంలో పాల్గొన్న సమయంలో చిన్నతనంలోనే ఉద్యమ కారులను బ్రిటిష్‌ పోలీసులు చితకబాదడం సహించలేక.. రాళ్లతో పోలీసులను కొట్టి పారిపోయాడు. బ్రిటిష్ పాఠశాలలో చదువు కోవడం ఇష్టంలేని అజాద్.. కాశీలో సంస్కృత విద్యాలయంలో చేరాడు. ఓ కేసు విచారణలో అతిపిన్న వయసులోనే  కోర్టుకు హాజరైన చంద్రశేఖర్‌.. న్యాయమూర్తి ముందే అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించాడు. ఎక్కడా వెనక్కి తగ్గలేదు. దీంతో.. బాలుడని కూడా చూడకుండా ఆ బ్రిటిష్‌ న్యాయమూర్తి.. 16 కొరడా దెబ్బల శిక్ష విధించాడు. కొరడా దెబ్బలు తగులుతున్నకొద్దీ చంద్రశేఖర్‌.. అంతటి నిర్బంధ పరిస్థితుల్లోనూ వందేమాతరం, భారత్‌ మాతాకీ జై అని నినదించాడు.

    బ్రిటిష్‌వాళ్లకు వ్యతిరేకంగా స్థాపించిన అనేక సంస్థల కార్యకలాపాల్లో పాల్గొన్నాడు చంద్రశేఖర్‌ ఆజాద్. దాదాపు తనకు అందుబాటులో ఉన్న అన్ని ఉద్యమాల్లో పాల్గొన్నాడు. పలు కేసుల్లో ఆజాద్‌ను నిందితుడిగా  చేర్చిన బ్రిటిష్‌ పోలీసులు అతన్ని పరారీలో ఉన్నట్లు ప్రకటించారు. 1931 ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం ఆల్‌ఫ్రెడ్ పార్క్‌లో సుఖదేవ్‌రాజ్‌తో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చలు జరుపుతున్న ఆజాద్‌ గురించి బ్రిటిష్‌వాళ్లకు ఉప్పందింది. దీంతో.. భారీ సంఖ్యలో పోలీసులు ఆజాద్‌ ఉన్న పార్కును చుట్టుముట్టారు. తుపాకులతో కాల్పులు జరిపారు. ఆజాద్‌ను ప్రాణాలతో పట్టుకొని.. స్వాతంత్ర్య సంగ్రామానికి సంబంధించిన మరిన్ని రహస్యాలు తెలుసుకోవాలనుకున్న బ్రిటిష్‌ సేనలు.. అతని తొడ, కుడి చెయ్యిపై కాల్చాయి. కానీ.. అప్పటిదాకా బ్రిటిష్‌వాళ్లతో పోరాడిన ఆజాద్‌.. ఇక తాను వాళ్లకు చిక్కడం ఖాయమనుకొని.. తన చేతిలోని తుపాకీలో ఉన్న ఆఖరి తూటాతో తనను తానే బలిదానం చేసుకున్నాడు.

    ఇవి కేవలం ఇద్దరి జీవితాలే. తమ కుటుంబాన్ని వదిలిపెట్టి.. స్వార్థం విడనాడి దేశం కోసమే తమ సర్వస్వాన్ని అర్పించారు. చివరి శ్వాస వరకూ భారతమాత సంకెళ్లను తెంచడమే లక్ష్యంగా పోరాడారు. దేశం బాగుంటే చాలు.. తాము, తమ కుటుంబం బాగున్నట్లే అని భావించారు. ఇలాంటి వేలాదిమంది సమరయోధుల ప్రాణత్యాగాల ఫలితమే నేటి స్వాతంత్ర్యం. ఈ స్వేచ్ఛను మనం అవసరానికి మించి అనుభవిస్తున్నాం. పిల్లలు పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఈ మాటల్లోని ఆంతర్యం బోధపడుతుంది. అయితే.. శిశుమందిరాల్లో బోధనా శైలి, సదాచారముతో భవిష్యత్తుకు గట్టి పునాదులు వేస్తున్న తీరు ఇక్కడ ప్రస్తావనార్హం. స్వార్థం పూర్తిగా వీడకున్నా.. పరోపకారం ఆవశ్యకతను గుర్తుచేస్తూ.. దేశభక్తి పరుల జీవితాలు, మహోన్నతుల శక్తి యుక్తుల గురించి ప్రత్యేకంగా విశదీకరించే సదాచారము.. మన జీవితాలకు మంచి దిశానిర్దేశం చేస్తుందనడంలో అనుమానం లేదు.

- సప్తగిరి,
ఎం.ఫిల్‌ (జర్నలిజం)
శిశుమందిర్‌ పూర్వ విద్యార్థి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి