21, అక్టోబర్ 2017, శనివారం

దేశమాత విముక్తి కోసం.. మత విశ్వాసాలనే త్యజించిన భగత్‌సింగ్‌ (స్ఫూర్తి మాసపత్రిక అక్టోబర్‌ 2017)


దేశమాత విముక్తి కోసం..  మత విశ్వాసాలనే త్యజించిన భగత్‌సింగ్‌

- సప్తగిరి, ఎం.ఫిల్‌ (జర్నలిజం)

    మానవులు పుడతారు.. చనిపోతారు. కొంతమంది మాత్రమే తమ కుటుంబం కంటే సమాజం కోసం ఎక్కువగా శ్రమిస్తారు. కొందరు తమ జీవితాన్ని కూడా ఫణంగా పెట్టి చిరస్థాయిగా నిలిచిపోతారు. వాళ్లను 'మహానుభావులు' అంటాం. వందల కోట్ల మందిలో పదుల సంఖ్యలో మాత్రమే ఇలాంటివాళ్లు ఉంటారు.

    1947లో స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత.. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించింది మన భారతదేశం. భారతావనికి స్వేచ్ఛా వాయువులు అందించేందుకు వందల సంవత్సరాలు పోరాటం జరిగింది. లక్షల మంది మహనీయులు ఈ పవిత్ర కార్యంలో సమిధలయ్యారు. ప్రధానంగా బ్రిటిష్‌ పాలన సమయంలో భారతీయులు స్వాతంత్ర్యం కోసం ఎక్కడికక్కడ చేసిన పోరాటాలు మహోన్నతమైనవి. వాటిని కొనియాడకుండా ఉండలేం. వారిలో కొందరైతే చిన్న వయసులోనే స్వాతంత్ర్యోద్యమంలోకి దూకారు.

    ఈ నెల స్వాతంత్ర్య సమరయోధుడు షహీద్‌ భగత్‌సింగ్‌ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. భారత స్వాతంత్ర్యోద్యమంలో పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులలో భగత్‌సింగ్‌ ఒకరు. ఈ కారణంగానే ఆయనను షహీద్ భగత్‌సింగ్ అని గర్వంగా పిలుచుకుంటున్నాం. భగత్ సింగ్ ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉన్న లాయల్ జిల్లా బంగా గ్రామంలో కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు  1907 సెప్టెంబరు 28వ తేదీన జన్మించాడు. భారత్‌లో బ్రిటీషు పాలనను వ్యతిరేకిస్తూ విప్లవాత్మక ఉద్యమాలను చేపట్టిన కుటుంబంలో ఆయన జన్మించారు.

    భారత మరియు బ్రిటన్ రాజకీయ ఖైదీలకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ జైలులో 64 రోజుల పాటు నిరాహారదీక్షను చేపట్టడం ద్వారా భగత్‌సింగ్‌ అన్నివర్గాల నుంచి విస్తృతంగా మద్దతును కూడగట్టుకున్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజ్‌పత్ రాయ్ హత్య నేపథ్యంలో ఒక పోలీసు అధికారిని కాల్చినందుకు భగత్‌సింగ్‌ను బ్రిటిష్‌ పాలకులు ఉరితీశారు. ఈ పరిణామాలు భారత స్వాతంత్ర్య సిద్ధికి పోరాడేలా భారత యువతను ప్రేరేపించాయి.

    విద్యార్థి దశలో స్కూల్లో చదువుతో పాటు.. ఆటపాటల్లోనూ చురుగ్గా ఉండేవాడు భగత్‌సింగ్‌. అందరితో కలివిడిగా ఉండేవాడు. బాబాయి సర్దార్ అజిత్ సింగ్ ఆంగ్లేయులతో పోరాడుతూ విదేశాల్లో ఉంటున్న సమయంలో, కంట నీరు పెట్టుకొనే చిన్నమ్మ హర్నామ్ కౌర్ ను చూసి నాలుగేళ్ళ భగత్ సింగ్ " పిన్నీ ఏడవొద్దు. నేను ఆంగ్లేయులపై ప్రతీకారం తీర్చుకుంటా" అని ప్రతిజ్ఞలు చేసేవాడు. పాలుగారని ఆ పసి వయసులోనే భగత్‌సింగ్‌ అవగాహన, వ్యక్తిత్వం అందరినీ ముగ్ధులను చేసేవి.

     13 ఏళ్ల ప్రాయంలోనే మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమానికి భగత్‌సింగ్ ప్రభావితుడయ్యాడు. ఆ సమయంలో బ్రిటీష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగిన భగత్.. ప్రభుత్వ పాఠశాల పుస్తకాలు మరియు బ్రిటీషు దిగుమతి దుస్తులను తగులబెట్టడం ద్వారా గాంధీ సిద్ధాంతాలను అనుసరించాడు. ఉత్తరప్రదేశ్‌ లోని చౌరీ చౌరా గ్రామస్తులు పోలీసులను హింసాత్మకంగా హతమార్చిన నేపథ్యంలో ఉద్యమాన్ని గాంధీ ఉపసంహరించుకున్నాడు. ఆయన అహింసావాదంపై అసంతృప్తి చెందిన భగత్‌సింగ్ యువ విప్లవోద్యమంలో చేరి, తెల్లదొరలకు వ్యతిరేకంగా హింసాత్మక ఉద్యమాన్ని ఉధృతం చేశాడు.

    భగత్‌సింగ్‌కు మొదటినుంచీ అధ్యయనమంటే చాలా ఇష్టం. రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం, సామాజిక శాస్త్ర విషయాలను ప్రబోధించే అనేక గ్రంథాలను ఆయన అధ్యయనం చేశాడు. అంతేకాదు.. తనకు ఉరిశిక్ష ఖాయమన్న సంగతి తెలిసిన తర్వాత.. అంతకు ముందు జైల్లోనూ భగత్ సింగ్ ఒక అధ్యయనశీలిగా కాలాన్ని గడిపాడు. పుస్తకం చదువుతూ మధ్యలో హఠాత్తుగా లేచి అటూ ఇటూ తిరుగుతూ.. స్వాతంత్ర్యోద్యమ గీతాలు పాడేవాడు.

    భారత స్వాతంత్ర్యోద్యమంలో దేశమాత విముక్తి కోసం పోరాడిన భగత్‌సింగ్‌.. ఓ బ్రిటిష్‌ పోలీసు అధికారిని కాల్చి చంపాడు. ఆ తర్వాత లాహోర్‌ పారిపోయి.. తనను ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు స్వాతంత్ర్య సమరంలో భాగంగా తన మత విశ్వాసాలను కూడా త్యజించిన త్యాగజీవి భగత్‌సింగ్‌. గడ్డాన్ని గీసుకోవడం, వెంట్రుకలు కత్తిరించుకోవడం ద్వారా సిక్కు మత విశ్వాసాల ఉల్లంఘనకు పాల్పడి.. నిజమైన దేశభక్తుడిగా పేరు తెచ్చుకున్నాడు.

    23 మార్చి 1931న భగత్ సింగ్‌తో పాటు ఆయన సహచరులు రాజ్‌గురు మరియు సుఖ్‌దేవ్‌లను లాహోర్‌లో ఉరితీశారు. సింగ్ ఉరిని వ్యతిరేకిస్తూ నిరసన చేపడుతున్న ఆయన మద్దతుదారులు ఆయన్ను ఆ క్షణమే షహీద్ అంటే.. అమరవీరుడుగా ప్రకటించారు. సాధారణంగా ఉరిశిక్షను ఉదయం 8 గంటలకు అమలు చేసేవారు. అయితే.. ఏం జరిగిందో ప్రజలు తెలుసుకునే లోగానే ఆయన్ను ఉరితీయాలని అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం నిర్ణయించింది. జనం నుంచి తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఉందన్న సమాచారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సుమారు రాత్రి 7 గంటల ప్రాంతంలో జైలు లోపల నుంచి ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు వినిపించాయి. సింగ్‌ జీవితానికి చివరగా తెర దించబోతున్నారన్న విషయానికి అది సంకేతమయింది. సట్లెజ్ నది ఒడ్డున ఉన్న హుస్సేనివాలా వద్ద భగత్‌సింగ్‌‌ను దహనం చేశారు. భగత్ సింగ్ స్మారకచిహ్నం నేడు భారత స్వాతంత్ర్య సమరయోధులను గుర్తుకు తెస్తుంది.

- సప్తగిరి,
ఎం.ఫిల్‌ (జర్నలిజం)
శిశుమందిర్‌ పూర్వ విద్యార్థి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి