8, మార్చి 2018, గురువారం

ప్రజాస్వామ్యం అంటూ ప్రజలను రెచ్చగొడుతున్న దుష్టశక్తులు

                                                                                               - హంసిని సహస్ర సాత్విక

    అన్ని మతాలనూ ఆదరిస్తోన్న ప్రజాస్వామిక దేశం భారతదేశం. ప్రధానంగా హిందూ సంస్కృతికి పుట్టినిల్లయినా.. ఏ ఇతర మతాన్ని కూడా కించపరచని మహోన్నత వ్యక్తిత్వం హిందువులది. ఏ మతం వాళ్లయినా.. స్వేచ్ఛగా ఎదిగేందుకు ఏ చిన్న అడ్డంకి కూడా కలిగించక పోవడం వల్లే.. క్రమంగా ఇతర మతాల ప్రార్థనాలయాలు, జనాభా సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. గల్లీ గల్లీకి చర్చీలు పుట్టుకొచ్చాయి. వాడవాడకూ మసీదులు వెలుస్తున్నాయి. చివరకు ఆ మంచితనాన్నే మరో రకంగా భావిస్తున్నాయి పరాయి మత మూకలు. గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నాయి. ఏకంగా బహిరంగ లేఖలే విడుదల చేసే స్థాయికి చేరాయి.

    విచ్చల విడిగా తమ మత వ్యాప్తి చేసుకుంటూ నిలదొక్కుకున్న  క్రైస్తవ పాస్టర్లు, ఆర్చి బిషప్‌లు ఇక హిందూ సమాజాన్ని చీల్చే పనిలో పడ్డారు. మతాలు వేరైనా కలిసి ఉంటున్న జనం మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏకంగా ప్రజాస్వామ్యం పేరిట కొద్దిమంది ప్రజలను రెచ్చగొట్టే స్థాయికి దిగజారుతున్నారు. ఆ ప్రజాస్వామ్యం వల్లే తమలాంటి మతాలకు ఇక్కడ చోటు దక్కిందన్న ఇంగిత జ్ఞానాన్ని మర్చిపోతున్నారు.

    మొన్నటి గుజరాత్ ఎన్నికల్లో, నిన్నటి నాగాలాండ్‌ ఎన్నికల్లో భయంకర పరిణామాలు సమాజంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మతం పేరిట ఈ కుప్పిగంతుల వ్యవహారాలు అవసరమైనంత స్థాయిలో ప్రచారంలోకి రాకున్నా.. చాపకింద నీరులా సమాజాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితులు దాపురించాయి.

    గుజరాత్‌ ఎన్నికల సందర్భంగా నవంబర్‌ 21వ తేదీన గాంధీనగర్ అర్జిడయాసిస్‌ పేరిట ఆర్చ్‌ బిషప్‌ థామస్‌ మాక్వాన్‌ సంతకంతో ఓ లేఖ విడుదలైంది. జాతీయ వాద దళాల నుంచి భారత దేశాన్ని రక్షించేందుకు.. క్రైస్తవులందరూ ప్రార్థన చేయాలని, జాతీయ వాదులంటూ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వాళ్లకు ఓటు వేయొద్దని ఆ లేఖ సారాంశం. అంతేకాదు.. మనదేశం లౌకిక ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని కూడా లేఖలో లెక్చర్లు ఇచ్చారు. గుజరాత్‌ ఎన్నికల ప్రభావం దేశమంతా కనిపించే అవకాశం ఉన్నందున.. ఇక్కడ ఎన్నికల్లో సైలెంట్‌గా తమపని తాము చేసుకుపోవాలని పిలుపునిచ్చారు ఆర్చ్‌ బిషప్‌. లేఖలో ఏ రాజకీయ పార్టీ పేరు ప్రస్తావించకుండా.. పరోక్షంగా బీజేపీని టార్గెట్‌ చేశారు.

    ఇప్పుడు నాగాలాండ్‌లోనూ ఇదే పరిస్థితి రిపీటయ్యింది. నాగాలాండ్‌ బాప్టిస్ట్‌ చర్చ్‌ కౌన్సిల్‌ పేరిట ఎన్నికల సమయంలో లేఖ విడుదలయ్యింది. ఎన్నికల్లో మీరు త్రిశూలం వైపు వెళ్తారా..? సిలువవైపు నిలుస్తారా? అని ప్రశ్నిస్తూ కౌన్సిల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అట్సిడోలి సంతకంతో ఈ బహిరంగలేఖ సంధించారు. బిజెపి, హిందూత్వ వాదులకు ఓటు వేయొద్దని చర్చ్‌ కౌన్సిల్‌ పిలుపునిచ్చింది. నార్త్‌ఈస్ట్‌ ప్రాంతంలో బీజేపీకి, హిందువులకు వ్యతిరేకంగా పనిచేయాలని క్రైస్తవులకు సూచించింది.

    మరోవైపు.. గుజరాత్‌లో జిగ్నేష్‌ మేవాని దళితుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు ఊపందుకున్నాయన్న వాదనలు జోరుగా సాగుతున్నాయి. ఓ దళిత నాయకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారన్న సాకుతో నిరసనలు చేపడుతూ అమాయక దళితులను ఆందోళనలకు ఉసిగొల్పుతున్నారన్న విమర్శలున్నాయి. యూపీలోని షెహరాన్ జిల్లాలో ఠాకూర్-దళిత ఘర్షణల్లో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆజాద్‌ను గత ఏడాది జూలైలో హిమాచల్ ప్రదేశ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. దీన్ని నిరిసిస్తూ ఇప్పుడు జిగ్నేష్‌మేవాని జనంలో చిచ్చు రేపుతున్నారు.

    అయితే.. 'యువ హంకర్‌ ర్యాలీ' పేరిట ఢిల్లీలో చేపట్టిన నిరసనలో జిగ్నేష్‌మేవానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర ప్రభుత్వానికి, బిజెపికి వ్యతిరేకంగా చేపట్టిన ఈ కార్యక్రమం జనాలు లేక బోసిపోయింది. తనకు మద్దతుగా వేల సంఖ్యలో ప్రజలు హాజరవుతారని భావించిన జిగ్నేష్‌ మేవానికి శృంగ భంగమైంది. మహారాష్ట్రలో ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగించి భీమా కొరిగావ్‌ హింసకు కారణమైన జిగ్నేష్‌ మేవానిపై పుణే పోలీసులు కేసు ఫైల్‌ చేశారు. అయితే. పుణే పోలీసులు కేసు బుక్‌ చేసిన తర్వాత రోజే మహారాష్ట్రలో మాయమై, ఢిల్లీలో ప్రత్యక్షమైన మేవాని, తనకు వ్యతిరేకంగా కేంద్రప్రభుత్వం కుట్ర చేస్తోందని, దానిపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో యువ హంకర్‌ ర్యాలీ తలపెట్టాడు. కానీ జనం లేక సభ వెలవెలబోయింది. సభలో మొత్తం ఖాళీ కుర్చీలే కనిపించాయి. వేలమంది హాజరవుతారనుకున్న సభకు కేవలం 200 నుంచి 300 మంది మాత్రమే హాజరు కాగా, అందులో వందమందిదాకా పాత్రికేయులున్నారు. మరో 100మంది జిగ్నేష్‌ మేవాని అనుచరులే కావడం గమనార్హం.

    కొన్ని దశాబ్దలుగా దేశంలో చోటు చేసుకొంటున్న పరిణామాలు, సంఘటనలు జాతీయ వాదానికి బీటలు వారుస్తున్న దుష్ట శక్తుల పన్నాగాలను స్పష్టం చేస్తున్నాయి. సాంస్కృతిక జాతీయ వాదాన్ని వ్యతిరేకించే శక్తులు దేశంలో అంతర్గత సంఘర్షణలు నిర్మాణం చేయటానికి పని గట్టుకొని ప్రయత్నం చేస్తున్నాయి.

    ఇప్పుడిప్పుడే కుంభకోణాల నుంచి బయటపడుతూ.. అవినీతి, అక్రమాల రహితంగా దేశం ముందుకు దూసుకెళ్తున్న సమయంలో క్రైస్తవ సంస్థలు, జిగ్నేష్‌ లాంటి వ్యక్తులు చేసే ఇలాంటి జిమ్మిక్కులపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ.. ఇలాంటి వాళ్ల వెనకున్న కుట్రలను తెలుసుకుంటూ జాగరూకతతో ఉండాల్సిన ఆవశ్యకత ఇప్పుడు అత్యవసరం.
(లోకహితంలో ప్రచురణ కోసం మార్చి 2018)
==============================

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి