13, మార్చి 2018, మంగళవారం

ప్రజాస్వామ్యం అంటూ ప్రజలను రెచ్చగొడుతున్న శక్తులు


అన్ని మతాలనూ ఆదరిస్తోన్న ప్రజాస్వామిక దేశం భారతదేశం. వసుధైవకుటుంబకం అని ప్రపంచమంతా ఒక కుటుంబంగా భావించిన మహోన్నత ఔదార్యం భారతీయులది. కానీ రాజకీయ, ఆర్ధిక, సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం కొందరు హిందూ సమాజాన్ని చీల్చే పనిలో పడ్డారు. మతాలు వేరైనా కలిసి ఉంటున్న జనం మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏకంగా ప్రజాస్వామ్యం పేరిట కొద్దిమంది ప్రజలను రెచ్చగొట్టే స్థాయికి దిగజారుతున్నారు. ఆ ప్రజాస్వామ్యం వల్లే తమలాంటి మతాలకు ఇక్కడ చోటు దక్కిందన్న ఇంగిత జ్ఞానాన్ని మర్చి పోతున్నారు.

మొన్నటి గుజరాత్‌ ఎన్నికల్లో, నిన్నటి నాగాలాండ్‌ఎన్నికల్లో భయంకర పరిణామాలు సమాజంలో ప్రకంపనలు సష్టిస్తున్నాయి. మతం పేరిట ఈ కుప్పిగంతుల వ్యవహారాలు అవసరమైనంత స్థాయిలో ప్రచారంలోకి రాకున్నా.. చాపకింద నీరులా సమాజాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితులు దాపురించాయి. 
గుజరాత్‌ ఎన్నికల సందర్భంగా  గాంధీనగర్‌ అర్జిడయాసిస్‌పేరిటఆర్చ్‌బిషప్‌ థామస్‌మాక్వాన్‌ సంతకంతో ఓ లేఖ విడుదలైంది. జాతీయవాద దళాల నుంచి భారత దేశాన్ని రక్షించేందుకు.. ప్రార్థన చేయాలని, జాతీయవాదులంటూ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వాళ్లకు ఓటు వేయొద్దని ఆ లేఖ సారాంశం. అంతేకాదు.. మనదేశం లౌకిక ప్రజా స్వామ్యం ప్రమాదంలో పడిందని కూడా లేఖలో ఆందోళన వ్యక్తంచేశారు. గుజరాత్‌ ఎన్నికల ప్రభావం దేశమంతా కనిపించే అవకాశం ఉన్నందున.. ఇక్కడ ఎన్నికల్లో సైలెంట్‌గా తమపని తాము చేసుకుపోవాలని పిలుపునిచ్చారు ఆర్చ్‌బిషప్‌.
ఇప్పుడు నాగాలాండ్‌లోనూ ఇదే పరిస్థితి పునరావతమైంది. నాగాలాండ్‌ బాప్టిస్ట్‌ చర్చ్‌ కౌన్సిల్‌ పేరిట ఎన్నికల సమయంలో లేఖ విడుదలయ్యింది. ఎన్నికల్లో మీరు త్రిశూలం వైపు వెళ్తారా..? సిలువవైపు నిలుస్తారా? అని ప్రశ్నిస్తూ కౌన్సిల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అట్సిడోలి సంతకంతో ఈ బహిరంగలేఖ సంధించారు. హిందూత్వ వాదులకు ఓటు వేయొద్దని చర్చ్‌కౌన్సిల్‌పిలుపునిచ్చింది. ఈశాన్య ప్రాంతంలో హిందువులకు వ్యతిరేకంగా పనిచేయాలని క్రైస్తవులకు సూచించింది. 
మరోవైపు.. గుజరాత్‌లో జిగ్నేష్‌మేవాని దళితుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు ఊపందుకున్నాయన్న వాదనలు జోరుగా సాగుతున్నాయి. ఓ దళిత నాయకుడిని పోలీసులు అరెస్ట్‌చేశారన్న సాకుతో నిరసనలు చేపడుతూ అమాయక దళితులను ఆందోళనలకు ఉసిగొల్పుతున్నారన్న విమర్శలున్నాయి. యూపీలోని షెహరాన్‌ జిల్లాలో ఠాకూర్‌-దళిత ఘర్షణల్లో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆజాద్‌ను గత ఏడాది జూలైలో హిమాచల్‌ ప్రదేశ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. దీన్ని నిరిసిస్తూ ఇప్పుడు జిగ్నేష్‌మేవాని జనంలో చిచ్చు రేపుతున్నారు. 
మహారాష్ట్రలో ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగించి భీమా కొరిగావ్‌హింసకు కారణమైన జిగ్నేష్‌మేవానిపై పుణే పోలీసులు కేసు ఫైల్‌చేశారు. అయితే. పుణే పోలీసులు కేసు బుక్‌చేసిన తర్వాత రోజే మహారాష్ట్రలో మాయమై, ఢిల్లీలో ప్రత్యక్షమైన మేవాని, తనకు వ్యతిరేకంగా కేంద్రప్రభుత్వం కుట్ర చేస్తోందంటూ ఢిల్లీలో యువ హంకర్‌ర్యాలీ తలపెట్టాడు. కానీ జనం లేక సభ వెలవెల బోయింది. సభలో మొత్తం ఖాళీ కుర్చీలే కనిపించాయి. వేలమంది హాజరవుతారనుకున్న సభకు కేవలం 200 నుంచి 300 మంది మాత్రమే హాజరు కాగా, అందులో వందమందిదాకా పాత్రికేయులున్నారు. మరో 100మంది జిగ్నేష్‌మేవాని అనుచరులే కావడం గమనార్హం. 
కొన్ని దశాబ్దలుగా దేశంలో చోటు చేసుకొంటున్న పరిణామాలు, సంఘటనలు జాతీయవాదానికి బీటలు వారుస్తున్న దుష్ట శక్తుల పన్నాగాలను స్పష్టం చేస్తున్నాయి. సాంస్కతిక జాతీయ వాదాన్ని వ్యతిరేకించే శక్తులు దేశంలో అంతర్గత సంఘర్షణలు నిర్మాణం చేయటానికి పని గట్టుకొని ప్రయత్నం చేస్తున్నాయి. 
ఇప్పుడిప్పుడే కుంభకోణాల నుంచి బయటపడుతూ.. అవినీతి, అక్రమాల రహితంగా దేశం ముందుకు దూసుకెళ్తున్న సమయంలో మత సంస్థలు, జిగ్నేష్‌లాంటి వ్యక్తులు చేసే ఇలాంటి జిమ్మిక్కులపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ.. ఇలాంటి వాళ్ల వెనకున్న కుట్రలను తెలుసుకుంటూ జాగరూకతతో ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. 
- హంసిని సహస్ర సాత్విక
(లోకహితం మార్చి 2018 సంచికలో ప్రచురితం)
 
link : http://www.lokahitham.net/2018/03/blog-post_52.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి