10, జనవరి 2016, ఆదివారం

పులకించిన తెలుగునేల - వైభవోపేతంగా అయుత చండీ మహాయాగం




 తెలుగు నేలపై మహోత్కృష్ట ఘట్టం ఆవిష్కృతమైంది. అత్యంత అరుదైన యాగానికి కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం వేదికైంది. అయుత చండీ మహాయాగం నిర్విఘ్నంగా జరిగింది. వేలాది మంది రుత్వికుల వేద మంత్రోచ్ఛారణల  ఘోషతో... అతిరథ మహారథుల సమక్షంలో యాగం యావత్తూ వైభవోపేతంగా సాగింది. భారతీయ సంస్కృతిలో భాగమైన యజ్ఞం మహోన్నత రూపం తెలుగు ప్రజలను పలకరించింది. నిష్ఠా గరిష్టంగా సాగిన యాగం ఆద్యంతం కోలాహలంగా, కన్నుల పండువగా సాగింది. రోజుకో వర్ణం కలిగిన వస్త్రాలతో ఐదు రోజుల పాటు యాగశాల ప్రత్యేక శోభను సంతరించుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు నిర్వహించిన అయుత చండీ మహాయాగం డిసెంబర్ 23 తేదీ నుంచి 27 తేదీ వరకు ఐదు రోజులు అట్టహాసంగా జరిగింది. మెదక్ జిల్లాలోని ఎర్రవెల్లి గ్రామం ఒక్కసారిగా జాతీయస్థాయిలో మారుమోగిపోయింది. సనాతన భారతీయ సంస్కృతికి అద్దం పట్టింది. ఎందరో పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, గవర్నర్లు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ ప్రముఖులు, వీఐపీలు, అధికారులు సహా సామాన్య జనంతోనూ ఎర్రవెల్లి దారులు కిక్కిరిసిపోయి యాగశాల మొత్తం ఆధ్యాత్మికతతో శోభిల్లింది.  
కన్నుల పండువ :
చూడచక్కని యాగ మండపం. భారీ చండీమాత విగ్రహం.. 108హోమ గుండాలు.. వెరసి మెదక్ జిల్లాలోని మారుమూల పల్లె ఎర్రవెల్లి ఐదు రోజుల పాటు వేద మంత్రాలతో పులకించిపోయింది. యజ్ఞ, యాగాది ఘోషలతో తన్మయత్వం చెందింది. చండీమాత స్తోత్రాలతో ప్రతిధ్వనించింది. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం అణువణువూ ఆధ్యాత్మికమయమై పునీతమైంది. డిసెంబర్ 23 తేదీ బుధవారం 11వందల మంది రుత్వికులు ముక్తకంఠంతో చండీ సప్తశతిని పారాయణం చేయగా.. పవిత్ర ద్రవాలతో యజ్ఞ వాటికలు జ్వలించగా అయుత చండీ మహాయాగం లాంఛనంగా ప్రారంభమైంది.  గోపూజ, గణపతి పూజతో మొదలైన క్రతువులో కలశ స్థాపన జరిగింది. మొత్తం 108 హోమ గుండాలు వెలుగుతుండగా.. యాగశాల శోభాయమానంగా వెలిగిపోయాయి. రెండోరోజు చండీమాత విగ్రహం ముందు గురుప్రార్థన నిర్వహించారు. అనంతరం రెండువేల సప్తశతి, చతుస్సష్టి యోగిని బలి, మహాగణపతిపూజ వంటి పూజలు నిర్వహించారు. మూడోరోజు గణపతి పూజ, ఏకాదశన్యాస పూర్వక త్రి సహస్ర చండీ పారాయణాలు, నవావరణ పూజ, నవగ్రహహోమం, యోగిని బలి, రాజశ్యామల చతుర్వేద మహారుద్ర పునశ్చరణలు, దంపతీ పూజ, మహా మంగళహారతి వంటి కార్యక్రమాలు వరుసగా జరిగాయి. నాలుగోరోజు యాగశాలలో నవావరణ పూజ, ఏకాదశన్యాసపూర్వక చతుసహస్ర చండీ పారాయణం, సప్తద్రవ్య మృత్యుంజయ హోమం, మహాసౌరము, ఉక్తదేవతాజపములు, కుమారి, సువాసిని, దంపతీపూజ, మహామంగళహారతి తదితర కార్యక్రమాల్లో కేసీఆర్ దంపతులతో పాటు.. అతిథులు, వీఐపీలు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాలనుంచి తరలివచ్చిన జనం యాగం జరిగిన తీరును దర్శించుకొని పునీతులయ్యారు. ఇక చివరిరోజు చండీమాత విగ్రహం ఎదుట గురుప్రార్థనతో యాగప్రక్రియ మొదలైంది. గణపతి పూజ, కుండ సంస్కారము, ప్రధాన కుండములో అగ్ని ప్రతిష్ఠ, విహరణము చేసి.. సపరివార అయుత చండీయాగాన్ని నిర్వహించారు. అలాగే.. అయుత లక్ష నవాక్షరీ, అజ్యాహుతి, మహా పూర్ణాహుతి, వసోర్దారా, కుమారీ, సహాసినీ, దంపతీ పూజ, కలశ విసర్జనము తదితర కార్యక్రమాలు వరుసక్రమంలో జరిగాయి. చివరిరోజు ప్రధాన హోమగుండంలోని అగ్నితో 101 హోమ గుండాలను రగిలించడంతో యాగశాల ప్రాంగణమంతా ధూమం పొగలతో ప్రత్యేక వాతావరణం అలుముకుంది. ధూమ సెగ భక్తులను తాకింది.  అయుత చండీ మహాయాగం జరిగినన్ని రోజులు నిత్యం యాగశాలలో వేలాదిమంది మహిళలు కుంకుమార్చన చేశారు.  కుంకుమార్చనలో పాల్గొన్న మహిళలకు పూజా వస్తువులను ఉచితంగా అందజేశారు.
పునీతమైన ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం
కేసీఆర్ దంపతులతో పాటు.. యాగ క్రతువు నిర్వహించిన సుమారు రెండువేల మంది రుత్వికులు, అతిథులు, వీఐపీలు, అధికారులు సైతం పవిత్రమైన అయుత చండీ మహాయాగం కోసం వేద పండితులు రూపొందించిన డ్రెస్కోడ్ పాటించడంతో యాగశాల ప్రాంగణం వైభవోపేతంగా కదలాడింది. తొలిరోజు యాగశాల మొత్తం పసుపువర్ణంతో శోభిల్లగా.. రెండోరోజు మండపాలన్నీ గులాబీమయమయ్యాయి. యాగంలో పాలు పంచుకున్న వాళ్లందరూ విధిగా గులాబీరంగు వస్త్రాలనే ధరించారు. అలాగే.. మూడోరోజు శ్వేతవర్ణ వస్త్రాలు, నాలుగోరోజు ఎరుపురంగు వస్త్రాలు, చివరిరోజు తిరిగి పసుపురంగు వస్త్రాలను ధరించారు. శృంగేరీ పీఠం నుంచి వచ్చిన నరహరి సుబ్రహ్మణ్య భట్ ఆధ్వర్యంలో యాగ క్రతువు యావత్తూ కొనసాగింది. ప్రధాన రుత్వికులు గోపీకృష్ణ శర్మ, ఫణి శశాంక శర్మ, హరినాథ్ శర్మ, తదితర పెద్దల వేద మంత్రాల నడుమ ఐదు రోజులపాటు యాగం జరిగింది. చివరిరోజు శృంగేరీ పీఠం అధిపతి భారతీ తీర్థస్వామి ప్రత్యేకంగా పంపించిన పూజా పట్టు వస్త్రాలను కేసీఆర్ దంపతులు ధరించి యాగంలో పాల్గొన్నారు.  తొలిరోజే ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు పండిట్ రవిశంకర్ యాగంలో పాల్గొన్నారు. ఐదు రోజుల్లోనూ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పీఠాధిపతులు ఆయా రోజుల్లో యాగానికి హాజరయ్యారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి, విశాఖ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానంద స్వామీజీ, కాకినాడ శ్రీపీఠం అధిపతి శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ, శ్రీ కమలానంద భారతీ స్వామి సహా అనేక మంది స్వామీజీలు, ఉపాసకులు అయుత చండీ మహాయాగానికి తరలివచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆద్యంతం మహాయాగంలో అన్నీ తానై పాల్గొన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తొలిరోజు పూజతో పాటు.. చివరి రోజు పూర్ణాహుతిలోనూ సతీసమేతంగా పాల్గొన్నారు.  దక్షిణ భారత వార్షిక విడిదిలో భాగంగా సికింద్రాబాద్ బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ యాగం చివరిరోజు పూర్ణాహుతిలో పాల్గొనేందుకు బయలుదేరారు. యాగశాల దగ్గర హెలికాప్టర్ దిగేందుకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో తిరిగి వెళ్లారు. అయితే.. యాగం పూర్తయిన మరుసటిరోజు కేసీఆర్ స్వయంగా కుటుంబసభ్యులతో కలిసి రాష్ట్రపతి నిలయానికి వెళ్లి ప్రణబ్ముఖర్జీకి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఇక.. అలాగే.. అయుత చండీ మహాయాగానికి   మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్రావు, తమిళనాడు గవర్నర్ రోశయ్య, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, సుజనాచౌదరి, ఏపీ, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్లు కోడెల శివప్రసాదరావు, మధుసూధనా చారి, ఏపీ, తెలంగాణ డిప్యూటీ సీఎంలు కేఈ కృష్ణమూర్తి, కడియం శ్రీహరి, ఎన్సీపీ అధినేత శరద్పవార్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జాస్తి చలమేశ్వర్, ఎన్వి రమణ, మాజీ న్యాయమూర్తులు జస్టిస్ సుదర్శన్రెడ్డి, జస్టిస్ సుభాషణ్రెడ్డి తదితరులతో పాటు.. ఎందరో ఎందరెందరో వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ, ఆధ్యాత్మిక ప్రముఖులు యాగంలో పాల్గొని పునీతులయ్యారు. మళ్లీ జన్మలో ఇలాంటి మహాక్రతువును చూస్తామో లేదో అన్న భావనతో తెలుగు రాష్టాలే కాకుండా.. దేశం నలుమూలల నుంచి జనం యాగానికి తరలివచ్చారు. దీంతో ఎర్రవెల్లి గ్రామానికి వెళ్లే దారులన్నీ యాగం జరిగినన్ని రోజులు కిక్కిరిసి పోయాయి.  
యాగశాల జనసంద్రం
అత్యంత వైభవోపేతంగా సాగిన యాగ క్రతువు హైదరాబాద్ శివారులో ఉన్న ఎర్రవెల్లి గ్రామానికి ఒక్కసారిగా పేరు ప్రతిష్టలు తీసుకువచ్చింది. ఎంతోమంది మహనీయుల పాదధూళి తాకేందుకు కారణమైంది. నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో యాగశాల భక్తజన సంద్రమైంది. పార్కింగ్కు స్థలం సరిపోక ఎర్రవల్లి చుట్టుపక్కల గ్రామాల్లోనే జనం వాహనాలు పార్కింగ్ చేసి కిలోమీటర్లకొద్దీ కాలినడకన యాగ స్థలికి చేరుకున్నారు. పొలాలు, చెరువుల్లోనూ వాహనాలను పార్కింగ్ చేశారు. చివరి మూడురోజులు 20 నుంచి 40 కిలోమీటర్ల దాకా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కొంతమంది భక్తులైతే యాగశాలకు చేరుకోలేక ఉన్నచోటినుంచే అమ్మవారికి నమస్కరించుకొని తిరుగుపయనమయ్యారు. యాగశాలలో ముందుగా అనుకున్న ప్రకారం అంచనాలు మించిపోవడంతో క్యూలైన్లను పెంచారు. బారికేడ్లను పెంచారు. నిత్య అన్నదానం పరిమితిని కూడా భారీగా పెంచాల్సి వచ్చింది.  అయుత చండీ మహాయాగానికి హాజరైన అతిథులు, భక్తులందరికీ పసుపు, కుంకుమ, లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదం యాగశాల వద్ద ఉచితంగా అందజేశారు.
- హంసినీ సహస్ర
(లోకహితం - జనవరి, 2016) 
Link : http://www.lokahitham.net/2016/01/blog-post_25.html