24, జులై 2014, గురువారం

చిద్రమైన చిన్నారుల జీవితాలు

మెదక్‌ జిల్లా ఘొల్లుమంది. తూప్రాన్‌ తల్లడిల్లింది. అభం శుభం తెలియని చిన్నారులు తన ఒడిలో నిర్జీవంగా పడి ఉన్నారన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక ఆనేల అల్లాడిపోయింది. మెదక్‌ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం దుర్ఘటనలో 16మంది చిన్నారులు చనిపోయారు. 21మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు.

23, జులై 2014, బుధవారం

కార్యాచరణ సరే... భరోసా కల్పిస్తారా?






           మాతృగడ్డకు తిరిగి వెళ్తున్నామని సంబరపడాలో లేక తమ రక్షణకు భరోసా ఉంటుందో లేదో అన్న భయం మధ్య బిక్కు బిక్కుమంటూ గడపాలో తెలియని సందిగ్ధ పరిస్థితి వారిది. ఒకప్పుడు దర్జాగా బతికినవాళ్లు, రాజ్యాలు ఏలిన వాళ్లు బతుకుజీవుడా అంటూ వలసల బాట పట్టి జన్మభూమికి దూరంగా, భారంగా బతుకులు వెళ్లదీస్తున్నారు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వారిపై ప్రత్యేక దృష్టి సారించింది. స్వస్థలాలకు తిరిగి పంపించేలా ఏర్పాట్లు కూడా చేస్తోంది. వాళ్ళే కాశ్మీరీ పండిట్లు. సొంత దేశంలోనే కాందిశీకుల మాదిరిగా బతుకులు వెళ్ళదీస్తున్నారు.

           దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత కాశ్మీర్ పండిట్లకు మంచి రోజులు వచ్చాయనే చెప్పుకోవాలి. దేశ నిర్మాణంలో, ప్రధానంగా కాశ్మీరీ ప్రాంతంలో తమదైన ప్రత్యేక చరిత్రను కలిగి ఉన్న కాశ్మీరీ పండిట్ల సమస్యను నరేంద్రమోది నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకంగా భావించింది. ఉగ్రవాదుల దాడుల కారణంగా నిరాశ్రయులైన కాశ్మీరీ పండిట్ల కోసం మూడు అనుబంధ నగరాలు నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం మూడు జిల్లాల్లో 2100 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించాల్సిందిగా జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కాశ్మీర్ పర్యటనలో భాగంగా సిఎం ఒమర్ అబ్దుల్లాతో భేటి సందర్భంగా ఈ ప్రతిపాదన చేశారు. అనంతనాగ్, బారాముల్లా, శ్రీనగర్ జిల్లాల్లో ఈ నగరాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ప్రతి నగరంలో 75 వేల నుంచి లక్షమందికి ఆవాసం కల్పించేందుకు రెండు పడక గదుల ఫ్లాట్లతో అపార్ట్ మెంట్లు నిర్మిస్తారు. అత్యాధునిక రవాణా సౌకర్యంతోపాటు సాంకేతిక వసతులు కల్పిస్తారు. ప్రతి నగరంలో ఒక మెడికల్ కాలేజి, రెండు ఇంజినీరింగ్ కాలేజీలు, నాలుగు డిగ్రీ కాలేజీలతో పాటు 12 పాఠశాలలు నిర్మిస్తారు. సాయుధ పోలీస్ స్టేషన్లతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలు, రైతులకు పంట రుణాలు, వలసలకు ముందు పండిట్లు తీసుకున్న రుణాలపై వడ్డీ మాఫీ తదితర సంక్షేమ చర్యలు తీసుకుంటారు.

             కేంద్రప్రభుత్వం చేపట్టే ఈ పునరావాస పథకంపై అంతర్జాతీయ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ హర్షం వ్యక్తం చేసింది. ఈ కీలక పరిణామం భరోసా కరువైన పండిట్ల మోముల్లో సంతోషాన్ని కురిపించడం సర్వసాధారణమే. 

              అయితే వీటిని కాశ్మీర్ వేర్పాటువాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జమ్మూకాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జె.కె.ఎల్.ఎఫ్.) ఏకంగా రాష్ట్ర బందుకు పిలుపునిచ్చింది. 

            నిజానికి బిజెపి ఎన్నికల మేనిఫెస్టోలోనే ఈ అంశాన్ని పొందుపరిచారు. అధికారంలోకి రాగానే యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ ప్రారంభించారు. తీవ్రవాదుల దాడుల కారణంగా 1990 తరువాత కాశ్మీర్ లోయ నుంచి పండిట్లు వలసబాట పట్టడం అనివార్యమైంది. దాదాపు నిర్వాసితులైన పండిట్ల సంఖ్య 7 లక్షలపైనే ఉంటుంది. వీళ్లంతా ప్రక్క రాష్ట్రాల్లో అభద్రత మధ్య జీవిస్తున్నారు.

            ప్రస్తుతం బిజెపి ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రయత్నం దేశ ప్రజలందరూ హర్షించదగినదే అయినా ఆచరణలో ముళ్లకిరీటంగానే చెప్పవచ్చు. ఓవైపు పండిట్లలో ఇప్పటికీ నెలకొన్న అభద్రతా భావం, మరోవైపు కాశ్మీర్ వేర్పాటువాదుల నిరసనలు, ఇంకోవైపు ఉగ్రవాద కార్యకలాపాలు ఈ బృహత్తర ఆశయానికి అవరోధాలు కల్పించబోవని నమ్మకంగా చెప్పలేం. మరోవైపు ఈ అతిభారీ ప్రాజెక్టు ఎంత సమయంలో పూర్తవుతుందన్న సంశయం వెంటాడుతుంది. ఇక పునరావాస నగరాల నిర్మాణం జరిగినా పండిట్ల రక్షణకు అత్యంత పటిష్టమైన వ్యవస్థ అవశ్యం. అసలే ఒక తరంలో సగం జీవితం నిర్వాసితులుగానే ముగిసింది. కనీసం తర్వాత తరానికైనా గట్టి భరోసా అవసరం. వాళ్ళ భద్రతను సవాల్ గా తీసుకోవడం అత్యావశ్యకం.

- హంసినీ సహస్ర