29, నవంబర్ 2018, గురువారం

ఈసీ విప్లవాత్మక నిర్ణయాలు..!


ఈసీ విప్లవాత్మక నిర్ణయాలు..!

ఈసీ విప్లవాత్మక నిర్ణయాలు..!
తెలంగాణ శాసనసభ ఎన్నికలు ఇటు రాజకీయ పార్టీలకు, అటు ఎన్నికల సంఘానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారాయి. అంతేకాదు దేశంలోనే సరికొత్త ప్రయోగాలకు తెలంగాణ రాష్ట్రం వేదిక కానుంది. ఈ మేరకు ఎలక్షన్‌ కమిషన్‌ పలు ప్రతిపాదనలపై విస్తృతంగా సమాలోచనలు చేస్తోంది. దేశంలోనే ప్రప్రథమంగా ఎన్నికల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి సాధ్యాసాధ్యాలపై చర్చలు సాగిస్తోంది. ఒకవేళ ఈ వినూత్న ప్రయోగాలు సఫలమైతే భవిష్యత్తులో దేశమంతటా అమలు చేసేందుకు కూడా సంసిద్ధమవుతోంది.
సీసీ కెమెరాల ఏర్పాటు!?
తెలంగాణలో డిసెంబర్‌ ఏడో తేదీన జరగనున్న పోలింగ్‌కు అన్ని బూత్‌లలో సీసీ కెమెరాలు అమర్చాలని ఎలక్షన్‌ కమిషన్‌ యోచిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల అభిప్రాయాలు సైతం సేకరించింది. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాల వినియోగం సాధ్యమవు తుందా? లేదా? అన్న అంశాలను పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకుంటే దేశంలోనే పోలింగ్‌ ప్రక్రియలో సీసీ కెమెరాలు వినియోగించిన తొలిరాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుంది.
ప్రయోజనాలు
సున్నితమైన, సమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో ఇప్పటికే సీసీ కెమెరాలను వినియోగించే ప్రక్రియను ఎన్నికల సంఘం అమలు చేస్తోంది.
తెలంగాణ సహా మధ్యప్రదేశ్‌, మిజోరాం, ఛత్తీస్‌గఢ్‌, రాజస్తాన్‌ రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో పలు విడతలుగా ఎన్నికలు జరగనుండగా, తెలంగాణలో మాత్రం ఒకే విడతలో పోలింగ్‌ జరగనుంది. 2019 సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలనే మలుపు తిప్పే అవకాశాలు మెండుగా కనిపిస్తు న్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం వీటిని పకడ్బందీగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే దశలవారీగా జరుగుతున్న సమీక్షల్లో భాగంగా పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు వినియోగించే అంశం చర్చకు వచ్చింది. దీన్ని అమలు చేయాలంటే భారీ వ్యయం అయ్యే పరిస్థితులు ఉన్నా అధికార యంత్రాంగానికి విధినిర్వహణ మరింత సులువు అవుతుందని ఈసీ అంచనా వేస్తోంది. శాంతి భద్రతల పరిరక్షణ, ఎన్నికల నిబంధనల అమలు, రిగ్గింగ్‌ వంటి ఇతర అక్రమాలకు అడ్డుకట్ట వేయడం సీసీ కెమెరాల ఏర్పాటుతో సాధ్యమవుతుందన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
తెలంగాణలోనే తొలిసారి
ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నా సీసీ కెమెరాల వినియోగం ఒక్క తెలంగాణకే పరిమితం చేయాలన్న నిర్ణయం ఖరారైనట్లు తెలుస్తోంది. ఎందుకంటే తెలంగాణలో ఒకే విడతలో పోలింగ్‌ జరగనుండటం, ఎన్నికల సంఘం అధికారులు ఇప్పటికే దాదాపు సర్వ సన్నద్ధం కావడం వల్ల పోలింగ్‌ తేదీ నాటికి ఈ ప్రతిపాదన అమలు చేయడానికి జాప్యం ఉండదని ఈసీ భావిస్తోంది. మరోవైపు పోలింగ్‌ తేదీ సమీపి స్తుండటం కూడా ఈ నిర్ణయాన్ని ఒకే రాష్ట్రానికి పరిమితం చేయాలన్న ఆలోచనకు కారణమని చెబుతున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు సీసీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం.
పర్యవేక్షణ బాధ్యత పోలీసులదే
తెలంగాణలో మొత్తం 32 వేల 574 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. అన్నింట్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు దాదాపు 48 కోట్ల 86 లక్షల రూపాయల మేరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే అయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లోనూ విద్యుత్తు సౌకర్యం ఉంది. కాబట్టి కెమెరాల అమరిక కష్టసాధ్యమేమీ కాదని అధికారులు కూడా చెబుతున్నారు. కెమెరాలను జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటయ్యే కమాండ్‌ కంట్రోల్‌ రూంలతో అనుసంధానించి పర్యవేక్షించే యంత్రాంగం కూడా రాష్ట్రంలో ఇప్పటికే అందుబాటులో ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
పోలింగ్‌ తేదీ దగ్గర పడుతుండటంతో టెండర్లు పిలిస్తే ఆలస్యమవుతందని నామినేషన్‌ పద్ధతిలోనే సీసీ కెమెరాలు కొనాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కెమెరాల నిర్వహణ, పర్యవేక్షణకు 32వేల మందికిపైగా సిబ్బంది అవసరమవుతారు. ఆ కోణంలోనూ సిబ్బంది సమీకరణకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు పలు నగరాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణకు కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లు విజయవంతంగా అమలు చేస్తున్న పోలీసు శాఖ సిబ్బందిని వీటికోసం వినియోగించుకోనున్నారు. కెమెరాలు అమర్చడం దగ్గర్నుంచి, పోలింగ్‌ సరళి మొత్తాన్ని పర్యవేక్షించే బాధ్యతలు పోలీసులకే అప్పగించనున్నారు.
ఈవీఎంలపై అభ్యర్థుల ఫోటో!
ఈ ఎన్నికల్లో ఈవీఎంలపై అభ్యర్థుల ఫోటోలను కూడా ముద్రించనున్నారు. ఓటు వేసిన తర్వాత ఓటరు ఎవరికి ఓటు వేశాడో మూడు భాషల్లో స్క్రీన్‌పై కనిపిస్తుంది.
మొత్తానికి సీసీ కెమెరాలు ఏర్పాటైతే పూర్తి స్థాయిలో నిఘా నీడన ఎన్నికలు జరిగిన తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్రపుటల్లోకి ఎక్కుతుంది. అంతేకాకుండా ఈవీఎంలు పనిచేయడం లేదని, ఒకరికి ఓటు వేస్తే మరొకరికి పడిందనే ఆరోపణలకు, విమర్శలకు తెరపడనుంది.
– సప్తగిరి.జి, 9885086126
http://www.jagritiweekly.com/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87%E0%B0%B7%E0%B0%A3/ec-rajat-kumar/

అమిత్‌ షా ఆల్‌రౌండ్‌ ఎటాక్‌


అమిత్‌ షా ఆల్‌రౌండ్‌ ఎటాక్‌

అమిత్‌ షా ఆల్‌రౌండ్‌ ఎటాక్‌
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా పర్యటనతో తెలంగాణలో పొలిటికల్‌ సీన్‌ ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటివరకు అమిత్‌ షా రెండు దఫాలుగానే పర్యటించినా ఎన్నికల వేడిని రగిల్చేలా ప్రసంగాలు సాగించారు. బీజేపీ సైలెంట్‌ గానే ఉన్నా సందర్భం వస్తే ఎలా దూసుకుపోతుందో జన సమీకరణే తేల్చేసింది. తన వ్యాఖ్యలు, విమర్శల తీరుతో అమిత్‌ షా తనదైన శైలిలో రాష్ట్ట్ర నేతలకు అస్త్ర శస్త్రాలను అందించారు. కరీంనగర్‌ సభలో అమిత్‌ ఆల్‌రౌండ్‌ ఎటాక్‌తో అధికార పక్షంతో పాటు, మిగతా విపక్షాలకు సెగ తగిలింది. పనిలో పనిగా మజ్లిస్‌ పైనా మాటల తూటాలు పేల్చిన షా రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టత ఇచ్చారు.
లేట్‌గా అయినా లేటెస్ట్‌గా
తెలంగాణలో అసెంబ్లీ రద్దు తర్వాత జాతీయ నాయకత్వ వ్యూహం, ఎన్నికల ప్రచార సరళిపై మార్గదర్శనం కోసం వేచి చూసిన బీజేపీ రాష్ట్ర నేతలు కొన్నాళ్లు మౌనంగా పరిస్థితులను అంచనా వేస్తూ వచ్చారు. అంతర్గతంగా పోరుకు సమాయత్త మవుతూనే, సమీక్షలు నిర్వహిస్తూనే, సరళిని విశ్లేషిస్తూనే కేంద్ర కమిటీ ఆదేశాలతో ప్రచార వ్యూహాన్ని కార్యాచరణలో పెట్టారు. అయితే అటు ప్రభుత్వాన్ని రద్దు చేసిందో లేదో ఆ మరుక్షణమే తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల వేడిని రగిల్చే నిర్ణయాలు, ప్రచార సభలు వెంటవెంటనే ప్రకటించే సింది. మరోవైపు కాంగ్రెన్‌ పార్టీ కూడా ఆలస్యం చేస్తే సమయం సరిపోతుందో! లేదో! అన్న ఆలోచనతో ప్రచార రంగంలోకి దూకేసింది. కానీ బీజేపీ మాత్రం ఆచి తూచి పరిస్థితులను అంచనా వేసుకొని, జాతీయ నాయకత్వం సూచనలతో లేటుగానే అయినా లేటెస్టుగా ప్రచార గోదాలోకి దిగింది.
కరీంనగర్‌ సభతో మారిపోయిన పరిస్థితి
ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధాన పోటీ అధికార టీఆర్‌ఎస్‌కు, విపక్ష కాంగ్రెస్‌కు మధ్యే ఉంటుందన్న విశ్లేషణలు సాగాయి. కానీ బీజేపీ నేరుగా జాతీయ అధ్యక్షుడితోనే ఎన్నికల సమర శంఖం పూరించడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మహబూబ్‌నగర్‌ సభతో బీజేపీకి కాస్త ఊపు వచ్చినా కరీంనగర్‌ సభ తర్వాత ఆ ఊపు రెట్టింపయ్యింది. క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి ఉత్సాహం పెరిగింది. దీంతో ఇన్నాళ్లుగా కాంగ్రెస్‌ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌గా ఉన్న పరిస్థితి కాస్తా బీజేపీ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌గా మారిపోయిందని విశ్లేషకులే వ్యాఖ్యానించారు.
ఒక్కదెబ్బకు మూడు పిట్టలు
దీనికి కారణం అమిత్‌ షా ప్రసంగం ఓ జాతీయ నాయకుడి మాదిరిగా కాకుండా తెలంగాణతో ఎంతో అనుబంధం ఉన్న నేతగా సాగింది. పేరుకు తగినట్లే బీజేపీ సమరభేరిని మోగించారు. ప్రధానంగా టీఆర్‌ఎస్‌ మజ్లిస్‌తో అంటకాగడాన్ని ఎత్తిచూపి తెలంగాణ ప్రజలను అటువైపుకు ఆలోచించేలా చేయడంలో ఆయన సఫలమయ్యారు. అసదుద్దీన్‌ ఓవైసీని లక్ష్యంగా చేసుకొని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రజాకార్ల దురాగతాలను తెలంగాణ సమాజం మరచిపోగలదా? అని బీజేపీ అధ్యక్షుడు ప్రశ్నించారు. ఒవైసీకి భయపడే కేసీఆర్‌ సర్కార్‌ తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను పక్కనబెడుతోందని ఆరోపించారు. సమరయోధుల త్యాగాలను అవమానపరుస్తోందని ప్రజలను ఆలోచనలో పడేశారు. ఓవైసీకి వ్యతిరేకంగా పోరాడే దమ్ము టీఆర్‌ఎస్‌కు, కాంగ్రెస్‌కు, టీడీపీకి లేదని దుయ్యబట్టారు. ఎంఐఎంను ఎదిరించే సత్తా ఉన్న పార్టీ ఒక్క బీజేపీనే అని పేర్కొన్నారు. బీజేపీకి పట్టంకట్టి తెలంగాణ రాష్ట్రానికి ఒవైసీ బారి నుంచి విముక్తి కల్పించాలని అన్నారు. ఒక్క దెబ్బకు మూడు పిట్టలన్నట్లు. అటు అధికార టీఆర్‌ఎస్‌.. ఇటు మహాకూటమిగా జట్టుకట్టిన పార్టీలు, మరోవైపు మజ్లిస్‌కు సెగ తగిలేలా అమిత్‌ షా ప్రసంగం సాగిందన్న చర్చ జరుగుతోంది.
కూటమి వస్తే కుర్చీల కొట్లాట !
బీజేపీ, టీఆర్‌ఎస్‌ మినహా మిగతా అన్ని పార్టీలనూ కలుపుకొని జట్టుకట్టిన మహాకూటమి పరిస్థితి దినదినం సందిగ్ధంగానే తయారైంది. మేనిఫెస్టో రూపకల్పన దగ్గర్నుంచి సీట్ల పంపకాలు, అభ్యర్థుల ప్రకటనలు అన్నీ ఎవరూ స్వతంత్రంగా వెంట వెంటనే నిర్ణయం తీసుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కూటమికి గనుగ అధికారం వస్తే అందులోని నేతల మధ్యే కుర్చీల కొట్లాట సాగుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కూటమిలో జట్టుకట్టిన నేతలు ఎవరికి వారే.. ఎవరి ఎజెండా వారిదే అన్న రీతిలో వేర్వేరు ఆలోచనలతో, వేర్వేరు వ్యూహాలతో ముందుకెళ్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇది కాస్త గందరగోళానికి కారణ మవుతోందని అంటున్నారు. ప్రధానంగా మహా కూటమిలో కాంగ్రెస్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తోంది. తెలుగు దేశం పార్టీకి అంతగా ఆదరణ లేకపోవడం, జన సమతి ఉద్యమ పార్టీయే అయినా.. కొత్తగా ఏర్పడిన పార్టీ కావడంతో పాటు… వనరుల సమీకరణ సమస్యతో కాంగ్రెస్‌ లీడర్‌ షిప్‌ను బలవంతంగా అయినా ఒప్పుకోవాల్సి వస్తోందని ఆ పార్టీ నేతలే అనుకుంటు న్నారు. మిగతా పార్టీలు అంతగా ప్రభావం చూపించే స్థితిలో లేకపోవచ్చని చెబుతున్నారు.
మొత్తానికి తెలంగాణలో ఎన్నికల వేడి ఊపందుకుంది. పోటా పోటీ ప్రచారం కొనసాగు తోంది. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో త్రిముఖ పోటీ తప్పదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు భయం పట్టుకుంది. మహాకూటమికి ప్రధానంగా సీట్ల సర్దుబాటుతో పాటు భాగస్వామ్యంగా ఉన్న పార్టీల అంతర్గత వ్యూహాలు, విభేదాలు, అభిప్రాయ భేదాలు మైనస్‌ అంటున్నారు విశ్లేషకులు. ఇక మొదటి నుంచీ చెబుతున్నట్లు ఒంటరిగానే అన్ని స్థానాల్లో పోటీకి సై అంటున్న బీజేపీ ఎలా దూసుకుపోతుందో చూడాలి.
– సప్తగిరి.జి, 9885086126
http://www.jagritiweekly.com/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87%E0%B0%B7%E0%B0%A3/amit-shah-3/

తెలంగాణాలో పోలింగ్‌ హీట్‌


తెలంగాణాలో పోలింగ్‌ హీట్‌

తెలంగాణాలో పోలింగ్‌ హీట్‌
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్‌ విడుద లయ్యింది. దీంతో అనుమానాలు, సందేహాలకు తెర పడింది. నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణకూ ఎన్నికలు నిర్వహిస్తారని కొందరు వాటికంటే ముందే తెలంగాణలో పోల్‌ బెల్‌ మోగుతుందని మరికొందరు సార్వత్రిక ఎన్నికలతో పాటే తెలంగాణలోనూ పోలింగ్‌ జరుగుతుందని ఇంకొందరు ఇలా ఎవరికి వారే వాదనలు ప్రచారం చేశారు. సామాన్య జనం నుంచి మొదలుకొని రాజకీయ పార్టీల నేతలు కూడా తమకు తోచిన రీతిలో అంచనాలు వేసుకున్నారు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం అన్ని సందేహాలకూ తెరదించింది.
డిసెంబర్‌ 7న పోలింగ్‌
ఎన్నికల కమిషన్‌ చెప్పిన వివరాల ప్రకారం.. రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరాంలతో పాటే తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 119 నియోజక వర్గాల్లోనూ ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహించ నున్నారు. నామినేషన్లు దాఖలు చేయడానికి తుది గడువును నవంబర్‌ 19గా నిర్ణయించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు నవంబర్‌ 22. అదే నెల 28వ తేదీన నామినేషన్లు పరిశీలించి పోటీ చేయబోయే అభ్యర్థుల తుది జాబితా సిద్ధం చేస్తారు. డిసెంబర్‌ 7వ తేదీన ఒకే విడతలో తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్‌ 11వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.
కూసిన కోడ్‌
అసెంబ్లీ రద్దయిన రాష్ట్రాలకు ఆర్నెల్ల లోపు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు పేర్కొన్నదని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రావత్‌ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన సమయంలో చెప్పారు. సెప్టెంబర్‌ 6న తెలంగాణ అసెంబ్లీ రద్దు కావడంతో ఎన్నికల కోడ్‌ అమలులో ఉందని తెలిపారు. డిసెంబర్‌ 15నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రచార ఖర్చు 28 లక్షల రూపాయలకు మించకూడదని ఈసీ పేర్కొంది.
న్యాయస్థానం ఆక్షేపణ
తెలంగాణలో ఓటర్ల జాబితాకు సంబంధించి హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అంతేకాదు ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా అసెంబ్లీని రద్దుచేసే అధికారం ఎవరిచ్చా రంటూ కాంగ్రెస్‌ సభ్యులు హైకోర్టులో సవాల్‌ చేశారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాధాకష్ణన్‌ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని ఆక్షేపించారు. ఐదేళ్లు ఎమ్మెల్యేలుగా కొనసాగాల్సిన ప్రతిపక్ష సభ్యులు, స్వతంత్య్ర సభ్యులపైనా సర్కారు రద్దు నిర్ణయం ప్రభావం చూపిస్తోందని వ్యాఖ్యానించారు. వారి అభిప్రాయం కోరకుండా, వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గడువు తీరకముందే వారి సభ్యత్వాలతో ముడిపడిన శాసనసభను ఏకపక్షంగా రద్దు చేయడం సరైన విధానం అవుతుందా? అని ప్రశ్నించారు.
కేసీఆర్‌ గొంతులో పచ్చి వెలక్కాయ
తెలంగాణలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిం దంటేనే ప్రభుత్వం ఎటువంటి ప్రకటనలు కానీ, పథకాలు కానీ, కానుకలు కానీ ప్రకటించకూడదు. ముందస్తు ఊపులో రెండు ప్రధాన పథకాలు తనకు ఓట్లను కురిపిస్తాయనుకున్న కేసీఆర్‌కు ఈ నిబంధనలు గొంతులో పచ్చివెలక్కాయ పడ్డ చందంగా మారాయి. గతేడాది నుంచి దసరాకు కేసీఆర్‌ సర్కార్‌ మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోంది. కానీ ఈసారి చీరల పంపిణీకి బ్రేక్‌ పడింది. ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో చీరల పంపిణీకి ఈసీ బ్రేక్‌ వేసింది. మొదట రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి బతుకమ్మ చీరల పంపిణీపై అభ్యంతరం లేదని ప్రకటించినా కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయంలో ఝలక్‌ ఇచ్చింది. మరో కీలక పథకమైన రైతుబంధుకు మాత్రం ఐదు షరతులతో ఈసీ ఓకే చెప్పింది. ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని, రైతులకు చెక్కులు పంపిణీ చేయకుండా బ్యాంకు అకౌంట్లలో రైతుబంధు మొత్తాన్ని జమ చేయాలని సూచించింది. అయితే ఈ పరిణామాలను కూడా టీఆర్‌ఎస్‌ తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటోంది. కాంగ్రెస్‌ నేతల కారణంగానే బతుకమ్మ చీరలు పంచలేక పోతున్నామని విమర్శల దాడి చేస్తోంది.
తీర్మానాల పరంపర
మరోవైపు తెలంగాణలో ఎన్నికలు సమీపించిన వేళ వివిధ గ్రామాల్లో, ప్రార్థనా స్థలాల్లో ‘ఓటు ప్రతిజ్ఞ’లు సర్వసాధారణంగా మారాయి. ప్రధానంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఓట్లు వేస్తామంటూ పలు గ్రామాల ప్రజలు ప్రతిజ్ఞలు చేయడంతో పాటు ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. కులసంఘాలు కూడా ఫలానా నాయకుడికే ఓటు అంటూ తీర్మానాలు చేశాయి. అయితే ఇలాంటి తీర్మానాలు కోడ్‌ ఉల్లంఘన కిందికే వస్తాయన్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వీటిపై ఫిర్యాదులు వస్తే కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఇలాంటి చర్యలు నైతికంగా సరి కాదని, అయితే సాంకేతికంగా, చట్టపరంగా ఇలాంటి తీర్మానాలను తప్పు అని నిరూపించలేమని విశ్లేషకులు అంటున్నారు.
ఎవరి వాదన వారిదే
మొత్తానికి మరో నెలా పదిహేను రోజుల్లో తెలంగాణ ఓటరు తన తీర్పేంటో స్పష్టం చేయనున్నాడు. ఈ సమయం అన్ని పార్టీలకు ఎంతో కీలకం కానుంది. ఈసీ ప్రకటనతో తెలంగాణలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీల్లో సందడి మొదలైంది. అయితే, ముందస్తును ముప్పుగా భావిస్తున్న కొన్ని పార్టీలకు ఈ ప్రకటన కాస్త ఇబ్బందికరంగా పరిణమించింది. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసుకుని ముందస్తుకు సిద్ధమైన అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మహాకూటమి ప్రచార సునామీలో కొట్టుకుపోతుందని విపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి. బీజేపీ హవా ముందు అధికార టీఆర్‌ఎస్‌ మాత్రమే కాదు, కూటమిగా జట్టుకట్టిన పార్టీలన్నీ తుడిచిపెట్టుకుపోతాయని భారతీయ జనతాపార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
– సప్తగిరి.జి, 9885086126
http://www.jagritiweekly.com/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87%E0%B0%B7%E0%B0%A3/ts-2/

మాటల లొల్లి ‘షురు’


మాటల లొల్లి ‘షురు’

మాటల లొల్లి ‘షురు’
తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. రాజకీయ పార్టీల వాగ్యుద్ధాలు మొదలయ్యాయి. ముందస్తు ముసురు పట్టుకుంది. మాటలు తూటాల్లా పేలుతున్నాయి. రాజకీయ ప్రచార సభలు హోరెత్తుతున్నాయి.
నిరసన నిజమేనా?
రాష్ట్ర రాజకీయాలన్నీ టీఆర్‌ఎస్‌ చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రధానంగా కేసీఆర్‌ రహస్య వ్యూహాలు అమలు చేస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. విపక్షాలను టార్గెట్‌ చేయడమే కాదు, సొంత పార్టీకి సంబంధించి కూడా గులాబీ అధినేత వైఖరిపై విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. నియోజకవర్గాల్లో జరుగుతున్న పార్టీ మీటింగుల్లో ఘర్షణలు, నిరసనలు, సొంత పార్టీ నేతల జంపింగ్‌లే ఇందుకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
విపక్షాల నేతలపై కేసులు, ఐటీ దాడుల విషయంలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వమే ఉన్నా కేసీఆర్‌ ప్రమేయంతోనే ఇవన్నీ జరుగుతున్నాయని పలు పార్టీలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి.
కావాలనే పక్కన పెడుతున్నారా?
టీఆర్‌ఎస్‌ పార్టీ విషయానికి వస్తే హరీశ్‌రావు అంశం హాట్‌టాపిక్‌గా మారింది. పార్టీ ఆవిర్భ వించినప్పటి నుంచి కేసీఆర్‌ తర్వాత స్థానంలో ఉన్న హరీశ్‌ కొన్నేళ్లుగా వెనక్కి వెళ్లిపోయారు. ఆ స్థానాన్ని కేటీఆర్‌ ఆక్రమించేశారన్నది పార్టీ వర్గాల మాట. అయితే ఈ విషయంలో హరీశ్‌ ఎక్కడా బయటపడలేదు. కానీ ఇటీవల ఓ గ్రామంలో జరిగిన బహిరంగ సభలో నిర్వేదం వ్యక్తం చేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రకపంనలు పుట్టించింది. ఒక్కసారిగా టీఆర్‌ఎస్‌తో పాటు అన్ని రాజకీయ పార్టీల్లో ఈ అంశంపై చర్చ సాగింది. గులాబీ పార్టీలో ప్రస్తుతం నెలకొన్న వాస్తవ పరిస్థితికి ఈ పరిణామాలు అద్దం పడుతున్నాయి.
తొలుత ప్రజా ఆశీర్వాద సభలకు తానే హాజరవుతానని ప్రకటించిన కేసీఆర్‌ కొంతకాలం ప్రగతిభవన్‌కే పరిమితమయ్యారు. కేటీఆర్‌ ఆ పాత్ర పోషించారు. తర్వాత బహిరంగ సభల ప్రణాళికలు సిద్ధం చేసుకొని మరోసారి సభల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు కేసీఆర్‌. అయితే మొదట ప్రకటించినట్లు 50 రోజుల్లో 100 సభల పరిస్థితి మాత్రం జవాబులేని ప్రశ్నగానే మిగిలింది.
టిక్కెట్ల చిచ్చు
పార్టీ టిక్కెట్ల విషయానికొస్తే హరీశ్‌రావు వర్గంగా పేరొందిన వాళ్లను పక్కన పెట్టారన్న విషయం బహిరంగ రహస్యమే అంటున్నాయి టీఆర్‌ఎస్‌ శ్రేణులు. హరీశ్‌ వర్గానికి చెందిన నాయకులకు టికెట్లు ఇవ్వకుండా, ఒకవేళ అక్కడక్కడ ఇచ్చినా వారి స్థానాల్లో అసమ్మతి రేగేలా కేటీఆర్‌ ప్లాన్‌ చేశారని కొండా సురేఖ పార్టీ మారే సమయంలో మీడియాకు చెప్పడం కలకలం రేపుతోంది. తాము కూడా ఆయన వర్గం కాబట్టే దూరం పెట్టారని ఆరోపించారు కొండా దంపతులు. అంతేగాకుండా కేటీఆర్‌ని ముఖ్య మంత్రిని చేయడానికే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని చెప్పారు.
కారుకు ‘బై’
కొండాసురేఖ దంపతులే కాదు టీఆర్‌ఎస్‌ ఆంధోల్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే బాబూమోహన్‌ కూడా పార్టీ మారారు. ఢిల్లీలో అమిత్‌షా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. మరికొందరు ఈ బాటలో ఉన్నట్లు లీకులు వస్తున్నాయి. వివిధ రాజకీయ పక్షాలు కూడా అలాంటివాళ్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
పార్టీలో విభేదాలకు చోటులేదు
హరీశ్‌రావుకు, తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని సందర్భం వచ్చినప్పుడల్లా కేటీఆర్‌ చెబుతు న్నారు. కానీ జరుగుతున్న పరిణామాలు వీటికి భిన్నంగా ఉంటున్నాయని టీఆర్‌ఎస్‌ మాత్రమే కాదు, ఇతర రాజకీయ నాయకులు కూడా అనుకుంటు న్నారు.
– సప్తగిరి.జి, 9885086126
http://www.jagritiweekly.com/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87%E0%B0%B7%E0%B0%A3/ts/

స్తబ్దుగా గులాబీ.. హుషారులో కమలం..



స్తబ్దుగా గులాబీ.. హుషారులో కమలం..

స్తబ్దుగా గులాబీ..  హుషారులో కమలం..
తెలంగాణలో ముందస్తు ఎన్నికల శంఖారావం మోగిన తర్వాత పరిణామాలు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. జనంలో ముఖ్యంగా ఓటర్లలో పలు సందేహాలకు కారణమవుతున్నాయి. ఎన్నికలు ముంచుకొస్తున్నాయన్నట్లుగా అసెంబ్లీ రద్దునాడే ప్రకటన చేసిన కేసీఆర్‌ ఆ తర్వాత స్తబ్దుగా ఉండిపోయారు. హుస్నాబాద్‌ సభ మినహా ప్రగతిభవన్‌ నుంచి అడుగు కూడా బయటపెట్టడం లేదు. దేశంలోనే అత్యంత పెను విషాదంగా నమోదైన కొండగట్టు ఘాట్‌రోడ్డుపై ప్రమాదంలో 62మంది అమాయకులు బలైనా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ¬దాలో ఉన్న కేసీఆర్‌ వారిని పరామర్శించలేదు. ఈ ఘోర ప్రమాదం జరిగిన రోజు మతుల కుటుంబాలకు ఐదులక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామన్న ప్రకటన తప్ప ఆ తర్వాత అంతా మర్చిపోయారు.
ఎన్నికల వేళ నాయకులు జనాల్లో తిరగడం అన్నది పరిపాటి. తెల్లవారితే ఓటర్లతో మమేకం కావడమన్నది ఎన్నేళ్లనుంచో వస్తున్న ఓ పరిణామం. ఎన్నికల సమయంలో ఏ అవకాశాన్ని నాయకులు వదులుకునే ప్రసక్తి ఉండదు. ప్రజలకు అండగా ఉంటామన్న ఆనవాళ్లు కనిపించేలా ప్రచారం చేసుకోవడం సర్వ సాధారణం. ఇప్పుడు ఓ వైపు వినాయక నవరాత్రోత్సవాలు కొనసాగుతున్నాయి. వచ్చేనెలలో శరన్నవరాత్రోత్సవాలున్నాయి. ఓవైపు జనం, వివిధ సంఘాలు, కాలనీలు రాజకీయ నాయకులను చందాలు, నవరాత్రోత్సవాల ఏర్పాట్లకోసం సంప్రదిస్తున్నారు. అసలే ఎలక్షన్‌ సీజన్‌ కావడంతో తమ స్థాయికి మించి కూడా నాయకులు అందరినీ సంతప్తి పరుస్తున్న పరిస్థితి ఉంది. కానీ.. సీఎం కేసీఆర్‌ మాత్రం దేన్నీ పట్టించుకోవడం లేదు. కొండగట్టు ఘోర విషాదాన్ని కూడా లెక్క చేయలేదన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు.
లోటు పూడ్చుకునే ప్రయత్నం
మరో విషయం ఏమంటే తెలంగాణ అసెంబ్లీని రద్దుచేసిన తర్వాత 50 రోజుల్లో వంద సభలు నిర్వహిస్తానని చెప్పారు కేసీఆర్‌. ఆ సభలను హుస్నాబాద్‌తో మొదలు పెడతానని అట్టహాసంగా ప్రకటించుకున్నారు. అసలే ప్రగతి నివేదన సభ అంచనాలు బోల్తా కొట్టడంతో నియోజకవర్గాలు, జిల్లాల వారీ సభలతో ఆ లోటును పూడ్చుకోవాలని భావిస్తున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరిగింది. కానీ హుస్నాబాద్‌ సభ తర్వాత కేసీఆర్‌ తిరిగి ప్రగతిభవన్‌కే పరిమితమయ్యారు. కనీసం ఆయన దినచర్య ఏమిటి..? రాజకీయ వ్యూహాలు ఎలా సాగు తున్నాయో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు.
దూరంగా ట్రబుల్‌ షూటర్‌
ఈ తాజా పరిణామాలతో సొంత పార్టీలోనే తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రసమితి ఆవిర్భావం నుంచి ప్లానింగ్‌లోగానీ, కార్యకర్తలతో సంబంధాల విషయంలో గానీ ఏ స్థాయి సభలనైనా సక్సెస్‌ చేయడంలో సిద్ధహస్తుడిగా, ట్రబుల్‌ షూటర్‌గా పేరున్న హరీష్‌రావు కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌కు మహాబలంగా చెప్పుకుంటారు. అయితే కొన్నాళ్లుగా కేటీఆర్‌కు రాష్ట్ర బాధ్యతలు అప్పగించి కేంద్రంలో చక్రం తిప్పుదామనుకుంటున్న కేసీఆర్‌ ప్రగతి నివేదన సభతో ఆ కార్యానికి శ్రీకారం చుట్టేందుకు ప్రయత్నించారు. అప్పటిదాకా పార్టీ వ్యవహారాలన్నింటిలోనూ చురుగ్గా ఉన్న హరీష్‌ రావును పక్కనబెట్టి ప్రగతి నివేదన సభకు కేటీఆర్‌నే సర్వస్వంగా చూపించారు.
అయితే ఊహించిన స్థాయిలో ఆ సభ సక్సెస్‌ కాకపోవడం పట్ల ఏకంగా కేసీఆర్‌ కొందరు ముఖ్య నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారన్న వాదనలు బలంగా వినిపించాయి. దీంతో కాస్త వెనక్కి తగ్గిన కేసీఆర్‌ తిరిగి హరీష్‌రావును ప్రగతిభవన్‌కు పిలిపించి మరీ ప్రజా ఆశీర్వాద సభలను భుజానవేసుకోవాలని బాధ్యతలు అప్పగించినట్లు చెప్పుకున్నారు. ఆ క్రమంలోనే మొదటగా హుస్నాబాద్‌లో నిర్వహించిన ప్రజాశీర్వాదసభ సక్సెస్‌ అయ్యింది. రాత్రికిరాత్రే రంగంలోకి దిగిన హరీష్‌రావు తనదైన వ్యూహాలతో హుస్నాబాద్‌లో చక్రం తిప్పారు. నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన సభకు రాష్ట్రస్థాయిలో జనం తరలివచ్చారని కేసీఆరే స్వయంగా సభావేదికపై నుంచి సంతోషం వ్యక్తం చేశారు.
99 సభల లోగుట్టు ఏంటి..?
ఆ తర్వాత సోషల్‌ మీడియాలో టీఆర్‌ఎస్‌పై విమర్శలు, వ్యంగ్యస్త్రాలు ఎక్కువయ్యాయి. సభ సక్సెస్‌ కావడమంటే ట్వీట్లు పోస్ట్‌చేసినంత సులభం కాదంటూ విపక్షాలే కాదు స్వపక్షంలోని హరీష్‌ వర్గీయులు కూడా ప్రచారం సాగించారు. హుస్నాబాద్‌ సభ తర్వాత ఆ ప్రచారం మరింత ఉధతంగా సాగింది. అంతేకాదు కేసీఆర్‌ ముందుగా చెప్పినట్లు 50 రోజుల్లో వంద సభల పరిస్థితి ఏంటని తెలంగాణ వ్యాప్తంగా ఇటు రాజకీయ వర్గాల్లో, అటు జనంలోనూ చర్చ తీవ్రంగా సాగుతోంది. అంటే హుస్నాబాద్‌ తరహాలో మిగతా 99 సభలూ సక్సెస్‌ అయితే కేటీఆర్‌కు ఈమాత్రం ఉన్న ఆదరణ తగ్గిపోతుందని.. తాత్కాలికంగా ఆశీర్వాద సభలకు ఫుల్‌స్టాప్‌ పెట్టారేమో అన్న చర్చ అంతర్గతంగా సాగుతోంది. ఫలితంగా టీఆర్‌ఎస్‌లో కుమారుడు వర్సెస్‌ మేనల్లుడు తరహాలో ఆధిపత్యపోరు కొనసాగుతోందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది.
అభ్యర్థుల ఎంపికలోనూ లెక్కలేదు
కేసీఆర్‌ ప్రకటించిన 105 మంది అభ్యర్థుల్లో హరీష్‌రావు మాటకు, ఆయన వర్గానికి చోటు ఇవ్వలేదని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. హరీష్‌రావు వర్గంగా గుర్తింపు పొందిన వాళ్లను అసలు పరిగణనలోకి తీసుకోలేదని అంటున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీలోనూ ఈ అభ్యర్థుల ఖరారుపై అసంతప్తి నెలకొందన్నది బహిరంగ రహస్యమే. దాదాపు 50 మంది అభ్యర్థులను ద్వితీయశ్రేణి నాయకులు వ్యతిరేకిస్తున్నారని పార్టీ ముఖ్యనేతలే చెప్పుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో బాల్కసుమన్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన టీఆర్‌ఎస్‌ నేత గట్టయ్య హైదరా బాద్‌లో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో హరీష్‌రావు కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తు న్నారు. లేదంటే ఇలాంటి సంక్షోభాలు, అసంతప్తులు తలెత్తినప్పుడు స్వయంగా రంగంలోకి దిగి హరీష్‌ రావు పరిస్థితిని చక్కదిద్దేవారు. ఇప్పుడు ఆ బాధ్యత కేటీఆర్‌ చూస్తున్నా బుజ్జగింపులు సంతప్తికరంగా సాగడం లేవన్న ప్రచారం పార్టీలోనే జరుగుతోంది.
పుంజుకున్న కాషాయ దళం
అధికార టీఆర్‌ఎస్‌ పరిస్థితి ఇలా ఉంటే కాషాయదళం మాత్రం పుంజుకుంది. పాలమూరులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా శంఖారావ సభతో ఎన్నికల రణరంగంలోకి దూకారు రాష్ట్రపార్టీ నేతలు. అంతేకాదు ఎప్పుడూ లేని విధంగా ఈసారి మజ్లిస్‌ కంచుకోట హైదరాబాద్‌ పాతబస్తీ నుంచే కమల దళపతి అమిత్‌షా శంఖారావం పూరించారు. లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని పాలమూరు ఎన్నికల ప్రచార సభకు బయలుదేరి వెళ్లడం ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపింది. అంతేకాదు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ కూడా ఎంఐఎంకు సవాల్‌ విసిరారు. అసదుద్దీన్‌పై హైదరాబాద్‌లో సామాన్య కార్యకర్తను పోటీకి దించి ఓడిస్తామని, ఇంట్లో కూర్చుని ట్వీట్‌ చేయడం కాదని.. దమ్ముంటే ఎన్నికల మైదానంలో దిగాలని లక్ష్మణ్‌ సూచించారు. పాతబస్తీలో 10 సీట్లలో పోటీ చేయడమే కాదు.. రాష్ట్రంలోని అన్ని సీట్లలో పోటీ చేసినప్పుడే ఎవరి బలం ఎంతో తేలిపోతుందని కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపు చేసే ప్రయత్నం చేశారు.
దిశానిర్దేశం
ముందస్తు ఎన్నికల తరుణంతో తెలంగాణపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రత్యేక దష్టి పెట్టారు. 20 రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగుర వేసినట్లుగానే తెలంగాణలోనూ బీజేపీని అధికారం లోకి తెచ్చేందుకు వ్యూహరచన చేస్తున్నారు. పార్టీ బలోపేతం, అధికారమే లక్ష్యంగా కనీసం 50 భారీ బహిరంగ సభలకు ప్లాన్‌ చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా కూడా సభలు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఆ క్రమంలోనే మహబూబ్‌ నగర్‌ సభ తర్వాత శంషా బాద్‌లో బీజేపీ రాష్ట్ర బాధ్యులు, జిల్లా ఇన్‌ఛార్జులు, జిల్లా అధ్యక్షులతో సమావేశమై ఎన్నికల వ్యూహాలపై అమిత్‌షా దిశానిర్దేశం చేశారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో ఉంటే ప్రజలకు మరింత మేలు జరుగు తుందనే నినాదంతో ముందుకెళ్లాలని సూచించారు.
‘మార్పుకోసం బీజేపీ శంఖారావం’ నినాదంతో నిర్వహించిన అమిత్‌షా సభ కాషాయ శ్రేణులలో ఉత్సాహం నింపింది. అనుకున్న దానికంటే రెట్టింపు స్థాయిలో జనం తరలిరావడం శుభ పరిణామంగా పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఎన్నికల హామీలు, అమిత్‌షా ప్రసంగం జనాన్ని ఆకట్టుకోవడం మరింత అనుకూలించే అంశంగా భావిస్తున్నారు. ఈ సభకు మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచే కాక సమీపంలోని వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాల నుంచి కూడా జనం తరలివచ్చారు.
నెలాఖరులో కరీంనగర్‌లో నిర్వహించే బహిరంగ సభకు కూడా అమిత్‌షా హాజరుకానున్నారు. టీఆర్‌ఎస్‌కు బీజేపీ ఒక్కటే ఎదురొడ్డి నిలుస్తుందం టున్న రాష్ట్ర నేతలు టీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ రోజురోజుకు పడిపోతోందని, బీజేపీ బలం పెరుగు తోందని అంటున్నారు. ఎన్నికలకు తాము సంసిద్ధంగా ఉన్నామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ప్రకటించారు. వచ్చే నెలాఖరులోపు రాష్ట్రంలో 50 చోట్ల బహిరంగ సమ్మేళనాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమ్మేళనాలకు కేంద్ర మంత్రులు హాజరుకానున్నారని చెప్పారు. మహిళా సంఘాలతో ఈ నెల 27న హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి స్మతిఇరానీ సమావేశం కానున్నారని ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడగానే అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు.
– సప్తగిరి.జి, 9885086126
http://www.jagritiweekly.com/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87%E0%B0%B7%E0%B0%A3/%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%AC%E0%B1%8D%E0%B0%A6%E0%B1%81%E0%B0%97%E0%B0%BE-%E0%B0%97%E0%B1%81%E0%B0%B2%E0%B0%BE%E0%B0%AC%E0%B1%80-%E0%B0%B9%E0%B1%81%E0%B0%B7%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81/

ముందస్తు ఊపు వెనుక ఢిల్లీవైపు చూపు


ఊరించి ఉసూరుమనిపించిన ప్రగతి నివేదన సభ




తెలంగాణలో ముందస్తు ముసురు



తెలంగాణలో ముందస్తు ముసురుకేసీఆర్‌ సవాల్ - విపక్షాల వార్నింగ్ 


తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి ముసురుకుంది. రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్నికలు రేపో, మాపో అన్నంతగా విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఫలితంగా రాజధాని హైదరాబాద్‌ మొదలుకొని.. క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల దాకా అసెంబ్లీ ఎన్నికలపైనే చర్చ జరుగుతోంది. దీంతో.. సమీకరణాలు కూడా శరవేగంగా మారుతున్నాయి.

ప్రతిపక్షాలకు ముందస్తుకు సిద్ధమా ? అంటూ గతంలో సవాల్‌ విసిరిన కేసీఆర్‌ మాటలను అప్పుడు అంత సీరియస్‌గా తీసుకోలేదు. కానీ.. వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు గడువుకు ముందే ఎన్నికలకు వెళ్తారన్న వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. త్వరలో నాలుగు రాష్ట్రాలకు జరగనున్న ఎన్నికలతో పాటే.. తెలంగాణలోనూ ఎన్నికలు నిర్వహించేందుకు కేసీఆర్‌ ఉవ్విళ్లూరుతున్నారు.

విపక్షాలను బురిడీ కొట్టించే ప్లాన్‌ :
ముందస్తు ఎన్నికల విషయంలో విపక్షాలను బురిడీ కొట్టించేలా కేసీఆర్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్‌ తేరుకునేలోగానే.. నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ బలం పుంజుకోవచ్చునని కేసీఆర్‌ భావిస్తున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఇంకా ఎన్నికలకు సిద్ధం కాలేదు. దీనికి తోడు కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు, కుమ్ములాటలు, నేతల మధ్య అనైక్యత అన్నీ తమకు గ్రౌండ్ లో కలిసొస్తాయనే ప్రగాఢ విశ్వాసంతో కెసీఆర్ ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

శంఖారావంగా ప్రగతి నివేదన సభ :
మరోవైపు.. ప్రజల్లో రైతుబంధు పథకం, రైతు భీమా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వంటి అభివృద్ధి పథకాలే కాకుండా కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, ఆసరా వంటి సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో ఫీల్‌గుడ్ వాతావరణం ఉన్నట్లు అంతర్గత సర్వేలు చెబుతున్నాయంటున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ క్యాడర్ లో ఉత్సాహం నింపి ఎన్నికలకు సన్నధ్దం చేయడానికే  హైదరాబాద్‌లో ప్రగతి నివేదన సభను వాహకంగా వాడుకున్నట్లు కూడా చెబుతున్నారు. ఈ సభను ఎన్నికల శంఖారావ సభగా ఆ పార్టీ నేతలు అభివర్ణిస్తున్నారు.

ముందస్తు సందేశాలు :
పార్టీ ముఖ్యుల సమావేశంలో కేసీఆర్‌ ముందస్తు సంకేతాలు ఇవ్వకముందే.. సాంకేతిక అంశాల సర్దుబాటుపై ఓ అంచనాకు వచ్చినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే.. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషనర్ ఆశోక్‌ లావాసాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు  రాజీవ్ శర్మ కలిశారు. ఇటు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌.. పలుసార్లు గవర్నర్‌ నరసింహన్‌ను పదే పదే కలుస్తున్నారు. వారంలోనే రెండుసార్లు రాజ్‌భవన్‌ వెళ్లి గవర్నర్‌తో సమావేశం కావడం కూడా ఎన్నికల వేడికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. అటు.. ఢిల్లీలో, ఇటు హైదరాబాద్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు తెలంగాణలో ముందస్తు ఖాయమన్న సందేశాలను ఇస్తున్నాయి.

సర్వసన్నద్ధమంటున్న ప్రతిపక్షాలు :
అయితే.. కేసీఆర్‌ స‌వాల్‌ను ప్రధాన ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కూడా స్వీకరించాయి. తామూ సర్వ సన్నద్ధంగా ఉన్నామంటూ ప్రకటనలు చేశారు ఆయా పార్టీల నేతలు. అంతేకాదు.. గతంలో ముందస్తుకు వెళ్లిన చంద్రబాబు గతి ఏమయ్యిందో కేసీఆర్‌కు అదే గతి తప్పదని వ్యాఖ్యానిస్తున్నారు. కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో కూర్చొని పగటి కలలు కంటున్నారు తప్ప.. క్షేత్రస్థాయిలో జనం సమస్యలు, ఓటర్ల మనోభావాలు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు.

  ఇందుల భాగంగానే.. కాంగ్రెస్ పార్టీ ముందస్తు వ్యూహాలను సిద్ధం చేసే పనిలో పడింది. పార్టీ ముఖ్య నేతలతో ఎమర్జెన్సీ మీట్‌ నిర్వహించిన రాష్ట్ర పెద్దలు, ఢిల్లీ దూతలు.. ముఖ్యనేతలు, కేడర్‌కు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ముందస్తు ఎన్నికల వ్యూహాలు, తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. దీనికి ముందు రాహుల్ గాంధీ దృష్టికి ముందస్తు అంశాన్ని తీసుకెళ్లారు ఆ పార్టీ నేతలు. దీంతో.. అభ్యర్థుల ఎంపికకు కమిటీ వేయాలని రాహుల్‌ ఆదేశించడంతో ఈ దిశగా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు చర్యలు చేపట్టారు.

ఇక.. మోదీ చరిష్మా దేశవ్యాప్తంగా దూసుకుపోతున్న తరుణంలో.. రాష్ట్ర బీజేపీ కూడా అప్రమత్తమైంది. కేసీఆర్‌ వైఫల్యాలే తమ ఆయుధాలని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. జాతీయస్థాయిలో అమలవుతోన్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని అంటున్నారు. క్షేత్రస్థాయిలో బీజేపీ బలం ఏమాత్రం తగ్గలేదని.. బలమైన అభ్యర్థులను ఎంపిక చేసి.. ముందస్తులో కేసీఆర్‌కు చుక్కలు చూపిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ముందస్తుకు మార్గం :
అసలు కేంద్రంలో మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా.. లోక్‌సభకు, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ప్రతిపాదనకు తెరతీసింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే.. భారీగా ప్రజాధనం వృథా కాకుండా ఉంటుందని లెక్కలతో సహా నిపుణులు తేల్చి చెప్పారు. దీనిపై ఎన్నికల సంఘం అన్నిరాష్ట్రాల, అన్ని రాజకీయపార్టీల అభిప్రాయాలు కూడా తీసుకుంది. అయితే.. ఇప్పటికి మాత్రం ఆ ప్రతిపాదన మూలన పడింది. దీంతో.. కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు మార్గం సుగమమైందన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.

- సప్తగిరి.జి

హైదరాబాద్‌లో ఉగ్రవేట



హైదరాబాద్ లో ఉగ్రవేట - ఎన్ఐఏ సో దాలతో ఐఎస్ మూలాలు

- సప్తగిరి.జి

హైదరాబాద్ లో ఉగ్రవేట కొనసాగుతోంది. పాత బస్తీలో ఐఎస్ మూలాలు బయటపడుతూనే ఉన్నాయి. దేశంలో ఎక్కడ ఎలాంటి ఉగ్ర కుట్ర జరిగినా.. భాగ్యనగరంతో సంబంధం బట్టబయలవుతోంది. అంటే.. హైదరాబాద్ పాతబస్తీలో ఇంకా స్లీపర్ సెల్స్, ఉగ్రవాద సానుభూతి పరులు ఉన్నారన్న విషయం మరోసారి తేటతెల్లమైంది.

మరోసారి కుట్ర భగ్నం :
భారత్ ను టార్గెట్ చేసి విధ్వంసం సృష్టించాలనుకున్న ఐఎస్ కుట్రలను జాతీయ దర్యాప్తు సంస్థ - ఎన్ఐఏ మరోసారి భగ్నం చేసింది. హైదరాబాద్ లో ముష్కరుల సానుభూతి పరులను అరెస్ట్ చేసింది. హైదరాబాద్ ఎన్ ఐఏ అధికారులకు తోడు.. గుజరాత్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు కూడా ఒక్కసారిగా హైదరాబాద్ పాతబస్తీలో సోదాలు జరపడం తీవ్రకలకలం సృష్టించింది.  మరోసారి విధ్వంసక వాతావరణాన్ని హైదరాబాద్ వాసులకు గుర్తుచేసింది. ఏ పుట్టలో ఏ పాముందో అన్న చందంగా పాతబస్తీలోని ఏ ప్రాంతంలో ఏ ఉగ్రవాద సానుభూతి పరుడు ఉన్నాడో అన్న ఊహే జడుసుకునేలా చేసింది. అయితే.. ఎన్ఐఏ హైదరాబాద్ తో పాటు.. గుజరాత్ లోనూ ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది.

ఉగ్ర కదలికలపై దృష్టి :
  ప్రపంచాన్ని ఇస్లాం రాజ్యంగా మారుస్తామన్న ప్రధాన ఆశయంతో ఆవిర్భవించిన ఐసిస్..  ఆ తర్వాత ఇస్లామిక్ స్టేట్ - ఐఎస్ గా పేరు మార్చుకుంది. అప్పటినుంచి తమ మూకలో రిక్రూట్ మెంట్లను ఉధృతంగా సాగిస్తోంది. ప్రధానంగా భారత్ ను టార్గెట్ చేసిన ఐఎస్.. ఇక్కడి యువతను ప్రధానంగా ముస్లిం యువతను చేర్చుకోవడంపై దృష్టిపెట్టింది.  అందులో భాగంగానే.. పలుసార్లు ఐఎస్ స్థావరాలు, రిక్రూట్ మెంట్ సెంటర్లు, మధ్యవర్తులు ఎన్ఐఏకు పట్టుబడ్డారు.  ఈక్రమంలోనే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సమీపిస్తున్న వేళ.. దేశంలో ఉగ్రవాదుల కదలికలపై ఎన్ఐఏ దృష్టిసారించింది.

హైదరాబాద్ లో ఇద్దరు అరెస్ట్ :
ఇప్పటికే బోధగయ పేలుళ్లకు కుట్ర పన్నిన పలువురు ఉగ్రవాదులను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. బోధగయలో దాడులకు స్కెచ్ వేసిన ఉగ్రవాదులను పట్టుకుంటూనే హైదరాబాద్ వైపు దృష్టి  సారించారు ఎన్ఐఏ అధికారులు. పంద్రాగస్టు వేడుకలకు తొమ్మిదిరోజుల ముందు ఆగస్టు 6వ తేదీన హైదరాబాద్లోని షహీన్ నగర్, చాంద్రాయణగుట్ట, హఫీజ్ బాబానగర్ తదితర ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు . ఈ సోదాల్లో ఉగ్రవాద సంస్థల ప్రతినిధులుతో పలువురు యువకులు సంభాషణలు జరుపుతున్నట్టు ఆధారాలు సేకరించారు. దీంతో.. హైదరాబాద్ లో మరోసారి ఐఎస్ మూలాలు బయటపడ్డాయి. ఐఎస్ లో చేరేందుకు పలువురు యువకులు మొగ్గుచూపుతున్నట్టు గుర్తించిన ఎన్ఐఏ అధికారులు పక్కా ఆధారాలతో ఇద్దరిని అరెస్టు చేశారు.  వారం రోజులపాటు 20 మంది యువకులను ప్రశ్నించిన ఎన్ఐఏ అధికారులు.. హైదరాబాద్ హఫీజ్ బాబా నగర్ కు చెందిన అబ్దుల్ బాసిత్, చాంద్రాయణగుట్టకు చెందిన అబ్దుల్ ఖాదర్ అనే ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు.

2016 జనవరిలో ఐఎస్ ఉగ్రవాదుల షేక్ ఇస్లాం, మహమ్మద్ ఫర్హాన్, అధ్నన్ హసన్ లను ఎన్. ఐ. ఏ అరెస్ట్ చేసింది. ముస్లిం యువకులను టార్గెట్ గా చేసుకుని వారిని ఐసిస్ వైపు ఆకర్షితులను చేసి రిక్రూట్ చేస్తున్నారని వీరిపై అభియోగాలు మోపింది. జులై 2016 లో వీరిపై చార్జిషీట్ దాఖలు చేయడంతో షేక్ ఇస్లాం, మొహమ్మద్ ఫర్హాన్ లకు ఏడేళ్లపాటు జైలు శిక్ష పడింది. మరో ఉగ్రవాది అద్నాన్ హాసన్ ట్రయల్ ఇంకా కొనసాగుతోంది. ఈ విచారణ జరుగుతున్న క్రమంలోనే అధ్నాన్ హాసన్ తో టచ్ లో ఉన్న హైదరాబాద్ యువకుడు అబ్దుల్ బాసిత్ .. హాసన్  అనుచరులతో  నిరంతరం సంభాషణలు జరుపుతున్నట్టు ఎన్ఐఏ దృష్టికి వచ్చింది. రంగంలోకి దిగిన ఎన్ఐఏ అబ్దుల్ బాసిత్ పై దృష్టి సారించింది.

                 మొదట అబ్దుల్ బాసిత్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులకు.. చాంద్రాయణ గుట్టకు చెందిన అబ్దుల్ ఖాదర్ తోపాటు మరికొంతమంది యువకులు ఐఎస్ ఆపరేషన్లకు పనిచేస్తున్నట్టు ఆధారాలు లభించాయి. దీంతో హైదరాబాద్ ఎన్ ఐఏ కార్యాలయంలో  20 మంది యువకులను అధికారులు ప్రశ్నించారు. ఈ  విచారణలో అబ్దుల్ భాసిత్ తోపాటు అబ్దుల్ ఖాదర్ లు ఐఎస్ కు పనిచేస్తున్నట్టు నిర్ధారణ అయ్యిందని, ఐఎస్ సిద్ధాంతాలను హైదరాబాద్ లో ప్రచారంచేసేందుకు ప్రయత్నిస్తున్నారని  ప్రకటించిన ఎన్ఐఏ.. వీళ్లిద్దరినీ అరెస్ట్ చేసినట్లు ధృవీకరించింది.

ముష్కర మూకల కోడ్ లు డీకోడ్ :
ఇప్పటికే ఐఎస్ కు ఆకర్షితులైన వాళ్లు, ఐఎస్ కోసం పనిచేస్తున్న వాళ్ల వివరాలు, వాళ్ల సంభాషణల కోడ్ లు ఎన్ఐఏ సేకరించింది. ముష్కర మూకల కోడ్ భాషను ఎప్పటికప్పుడు డీ కోడ్ చేస్తూ ముందుకెళ్తోంది. ఇప్పటికే తమ దగ్గరున్న లిస్టులో కనిపించకుండా పోయిన వాళ్ల వివరాలు, వాళ్ల బంధువులు, కుటుంబసభ్యుల వివరాలను ఎప్పటికప్పుడు చెక్ చేస్తోంది. వాళ్లు ఎవరి ద్వారా ఉగ్రవాదానికి ఆకర్షితులయ్యారో, ఎవరెవరితో టచ్ లో ఉన్నారో అన్న అంశాలను కూడా విశ్లేషిస్తోంది. ఫలితంగా ఐఎస్ కార్యకలాపాలను భారత్ లో సమూలంగా నిర్మూలించే దిశగా కార్యాచరణ చేపడుతోంది. ఈ క్రమంలోనే ఎన్ఐఏ పక్కా ఆధారాలతో హైదరాబాద్ పాతబస్తీలో ఎటాక్ చేసింది.

- సప్తగిరి.జి
98850 86126

పర్యావరణహితం – హరితహారం


పర్యావరణహితం – హరితహారం

పర్యావరణహితం – హరితహారం
నీడనిచ్చే, ప్రాణవాయువునిచ్చే, చల్లని గాలినిచ్చే చెట్లే మనిషి మనుగడకు ఆధారం. మొక్కలు, చెట్లనుంచే మానవులకు ఆహారం లభిస్తుంది. పర్యావరణం సమతుల్యంగా ఉంటుంది. భూమి సారవంతమవుతుంది. ఏమాత్రం హాని లేకుండా.. ప్రయోజనాలు మాత్రమే కలిగించేవి చెట్లు. తెలంగాణ ప్రభుత్వం ఈ వాస్తవాలను గుర్తించింది. హరితహారం పేరిట బహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొంది. ప్రజలనూ భాగస్వాము లను చేసింది. ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థలు, సామాజిక సేవా సంస్థలను కూడా కలుపుకొనిపోతోంది.
తెలంగాణ వ్యాప్తంగా హరితహారం కార్యక్రమం ఉద్యమ స్థాయిలో కొనసాగుతోంది. నాలుగేళ్లుగా రాష్ట్రంలో ప్రతియేటా హరితహారం పేరిట ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తూ లక్షలు, కోట్ల సంఖ్యలో మొక్కలు నాటుతున్నారు. వాటిని సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మొన్నటికి మొన్న ఈనెల ఒకటో తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాలుగో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఎం సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ పరిధిలో ఒకేసారి లక్షా నూట పదహారు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఓ పండుగలా నిర్వహించారు. గజ్వేల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం మాత్రమే కాదు, సమాజంలోని అన్ని వర్గాల వారిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసి ఒకేరోజు అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చారు. అనేక రకాల మొక్కలను ప్రభుత్వమే సమకూర్చింది.
సంఖ్య కోసమో లేక లక్ష్యం అధిగమించడానికో మొక్కలు నాటొద్దని ప్రభుత్వం మొదటినుంచీ చెబుతోంది. పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణపై ప్రేమతో మొక్కలు నాటాలని ప్రచారం చేస్తోంది. ఆకుపచ్చ తెలంగాణ సాధన దిశగా అందరూ పునరంకితం కావాలని ప్రతీ హరితహారం లోనూ పిలుపునిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. వాతావరణ సమతూకాన్ని కాపాడేందుకు మొక్కల అవశ్యకతను ప్రజలకు చేర్చాలని మీడియాను కోరుతోంది. హరితహారంతో చేకూరే బహుళ ప్రయోజనాలను ప్రజల దష్టికి తీసుకెళ్లాలని విన్నవిస్తోంది.
ఈ మహత్తర కార్యక్రమానికి 2015 జూలైలో చిలుకూరు బాలాజీ దేవాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. తెలంగాణ మొత్తంలో మొక్కలను నాటాలని, రాష్ట్రం మొత్తం పచ్చదనంతో కనిపించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. మొదటిదశ హరితహారంలోనే ఒకేరోజు హైదరాబాద్‌ వ్యాప్తంగా 25 లక్షల మొక్కలు నాటి రికార్డు సష్టించారు.
హరితహారం కార్యక్రమానికి ప్రత్యేకంగా కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుంది ప్రభుత్వం. రాష్ట్రంలోని 24 శాతం అటవీ ప్రాంతంలో నూటికి నూరు శాతం అడవులు పెంచడం. పట్టణాలు, గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున సామాజిక అడవుల పెంపకం చేపట్టడం. తెలంగాణ వ్యాప్తంగా ఐదేళ్ల కాలంలో 230 కోట్ల మొక్కలు నాటి, వాటిని సంరక్షించడం. అటవీ ప్రాంతంలో 100 కోట్ల మొక్కలు, సామాజిక అడవుల కింద 120 కోట్ల మొక్కలు, హైదరాబాద్‌ నగర పరిధిలో 10 కోట్ల మొక్కలు నాటడం. సహజసిద్ధమైన అడవులను పరిరక్షించడం, పునరుజ్జీవింపచేయడం. అటవీ భూముల దురాక్రమణను అడ్డుకోవడం. పెద్ద ఎత్తున సాగే వక్షాల నరికివేతను నిలువరించడం. సామాజిక అడవుల పెంపకానికి పెద్దఎత్తున చర్యలు చేపట్టడం. ప్రజల భాగస్వామ్యంతో విస్తతంగా మొక్కలు నాటి సంరక్షణకు సమగ్ర చర్యలు చేపట్టడం.. వంటి లక్ష్యాలతో హరితహారాన్ని చేపట్టింది తెలంగాణ సర్కారు. ఐదేళ్ల కాలానికి గానూ ఇప్పటికే నాలుగేళ్లు పూర్తయ్యాయి. నాలుగో విడత హరితహారం ఇప్పుడు పూర్తయింది.
హరితహారం కార్యక్రమం ఏ స్థాయిలో నిర్వహిస్తోందో.. అదే స్థాయిలో ప్రచారాన్ని కూడా ఉధతంగా చేస్తోంది ప్రభుత్వం. ఈ మహాయజ్ఞంపై ప్రజలకు అవగాహన కల్పించేలా వార్తా కథనాలు ప్రచురించి, ప్రసారం చేసే మీడియా సంస్థలు, జర్నలిస్టులకు హరితహారం అవార్డులు కూడా ఇస్తోంది. ఫలితంగా హరితహారం ప్రజలకు మరింత చేరువయ్యేలా విస్తతంగా ప్రచారం జరుగుతుందని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు.
సాధారణంగా ప్రభుత్వంలో ఉండే పార్టీలు తమదైన శైలిలో చేపట్టే పథకాలకు రాజకీయ ప్రయోజనాలను దష్టిలో పెట్టుకుంటాయి. అయితే.. తెలంగాణలో చేపట్టిన హరితహారం కార్యక్రమం.. అటు ఆ పార్టీకి మైలేజీని తీసుకురావడంతో పాటు.. వాస్తవంగా సమాజానికి, పర్యావరణానికి ఉపయోగ కరంగా ఉంటోంది. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగితే ప్రధానంగా భూతాపాన్ని కొంతైనా తగ్గించే అవకాశం ఉంటుంది. పర్యావరణానికి మేలు కలుగుతుంది. మొత్తానికి సమాజానికి ప్రయోజన కారిగా ఉంటుందనడంలో సందేహం లేదు.
అయితే ప్రతి హరితహారం ముగిసిన తరువాత నాటిన మొక్కలకు పోషణ లేక ఎండిపోతున్నాయని లేక మేకలు తినేస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. నాలుగో విడత హరితహారం విషయంలో మాత్రం ఇటువంటివి జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. నాటిన వందశాతం మొక్కలు పెరిగి పెద్దవి కావాలంటే మొదట వాటికి జంతువుల నుండి రక్షణ కల్పించాలి. అందుకు వాటి చుట్టూ ఇనుప కంచె లేదా మరేదైనా రక్షణ కవచం ఏర్పాటు చేయాలి. అలాగే అవి ఎండిపోకుండా నిరంతరం రెండు పూటలా నీరు పోసే ఏర్పాటు చేయాలి. అలాగే మొక్కల వేళ్ళు బలంగా పెరిగి భూమిలోకి చొచ్చుకు పోతే భవిష్యత్తులో ఎన్నో తరాలకి చక్కని నీడనిస్తూ పర్యావరణాన్ని రక్షిస్తాయి. ఇది జరగాలంటే మొక్కలకు బలాన్నిచ్చే ఎరువులను పెరిగే దశలో ఉపయోగించాలి. ఇటువంటి రెండు మూడు చర్యలు తీసుకుంటే హరితహారం నిజరగానే రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తుంది.
– సప్తగిరి, 9885086126
http://www.jagritiweekly.com/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87%E0%B0%B7%E0%B0%A3/%E0%B0%AA%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B5%E0%B0%B0%E0%B0%A3%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A4%E0%B0%82-%E0%B0%B9%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82/

సెటిలర్లకూ టిక్కెట్లు సెటిలర్లకూ టిక్కెట్లు


సెటిలర్లకూ టిక్కెట్లు

సెటిలర్లకూ టిక్కెట్లు
– టిపిసిసి చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దాపై పోరాటం చేయాలని సిడబ్ల్యూసిలో నిర్ణయించిన నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లోని సెటిలర్లు సానుకూలంగా మారే అవకాశం ఉందని టిపిసిసి వర్గాలు భావిస్తున్నాయి.
2014 ఎన్నికల్లో సెటిలర్లలో ఎక్కువమంది టిడిపి, బిజెపి కూటమికి మద్దతు ఇవ్వడం వల్లనే గ్రేటర్‌ పరిధిలో ఆ కూటమికి ఎక్కువ సీట్లు వచ్చాయని టిపిసిసి అంచనా వేస్తోంది. ఒక రాష్ట్రంలో తుడిచి పెట్టుకుపోతామని తెలిసినా మాట నిలబెట్టుకొని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ పట్ల ప్రజలకు సానుకూలత ఉందని భావిస్తోంది.
ఈ నేపథ్యంలో పిసిసి కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో నివసిస్తున్న ఆంధ్రా, రాయలసీమ వాసులు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారేనని, కాంగ్రెస్‌ పార్టీ నిర్మాణంలోనూ, పార్లమెంటు, అసెంబ్లీ టిక్కెట్ల కేటాయింపుల్లోనూ వారికి తగిన ప్రాతినిథ్యం కల్పిస్తామని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఇచ్చామన్న కోపంతో గత ఎన్నికల్లో వారు కాంగ్రెసేతర పార్టీలకు ఓటేశారని, గత ఎన్నికలకు, ఇప్పటికి వాతావరణంలో సమూల మార్పు వచ్చిందన్నారు.
హైదరాబాద్‌లో అత్యంత ప్రభావం చూపే మైనారిటీలు, ఆంధ్రా, రాయలసీమ వాసులు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు పలుకుతారని ఉత్తమ్‌ అభిప్రాయపడ్డారు. అంతేకాదు టిఆర్‌ఎస్‌లో టిక్కెట్ల విషయంలో తీవ్రమైన సమస్య ఏర్పడనుందని భావించారు. ఆ పార్టీలో చాలామంది అభద్రతా భావం, తీవ్ర అసంతప్తితో ఉన్నారని, చాలామంది ముఖ్యులు తమతో టచ్‌లో ఉన్నారని, వారిని కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు అధిష్టానం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ఉత్తమ్‌ బాంబు పేల్చారు.
తెలంగాణను తాకిన ‘హోదా’ సెగలు
ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక ¬దా అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనూ సెగలు పుట్టిస్తోంది. ఏపిలో అన్ని రాజకీయ పార్టీలు ¬దా గళం అందుకోవడంతో ఇటు తెలంగాణకూ ఆ ప్రకంపనలు విస్తరించాయి. తాము తిరిగి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా ఇస్తామని సిడబ్ల్యూసిలో తీసుకున్న నిర్ణయం వేడిని మరింత రగిల్చింది.
ఏపికి ప్రత్యేక హోదాతో వచ్చే రాయితీలను తెలంగాణకు కూడా ఇవ్వాలని, అలా ఇవ్వలేకుంటే ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి వీల్లేదంటూ పార్లమెంటులో టిఆర్‌ఎస్‌ ఎంపిలు ఓ రకంగా యుద్ధమే చేశారు. లోక్‌సభలో జరిగిన చర్చలో ఏపి డిమాండ్‌కు వ్యతిరేకంగా మాట్లాడారు. ఆ తర్వాత ప్రత్యేక హొదాకు కాంగ్రెస్‌ అధిష్టానం మద్దతు ప్రకటించిన నేపథ్యంలో టిఆర్‌ఎస్‌ పార్టీ నేతలు టి-కాంగ్రెస్‌ నేతలపై మాటల దాడి ప్రారంభించారు. ఏపి ఒక్కదానికే ప్రత్యేక ¬దా ఇస్తే రాయితీల కోసం తెలంగాణ పరిశ్రమలు ఆంధ్రాకు తరలిపోతాయని, అలాంటి నిర్ణయానికి ఎలా మద్దతు ప్రకటిస్తారని నిలదీశారు.
కాంగ్రెస్‌ ఎదురుదాడి
టిఆర్‌ఎస్‌ విమర్శలకు కాంగ్రెస్‌ నేతలూ దీటుగానే స్పందించారు. ఈ నాలుగున్నరేళ్లలో ఎన్ని పరిశ్రమలు సాధించారని అధికార పక్షాన్ని ప్రశ్నిస్తున్నారు. అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే ప్రత్యేక హోదా హామీ ఇవ్వాల్సి వచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్ర పునర్విభజన బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఏపికి ఐదేళ్ల పాటు ప్రత్యేక ¬దా కల్పిస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ హామీ ఇచ్చారని, ఆ హామీ మేరకే సిడబ్ల్యూసిలో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు.
తర్వాత కేంద్రంలో బిజెపి నేతృత్వంలో ఎన్‌డిఏ ప్రభుత్వం ఏర్పడింది. తదనంతర పరిణామాల్లో ప్రత్యేక హోదా అంశంపై ఎన్‌డిఏ భాగస్వామిగా ఉన్న టిడిపి బయటికి వచ్చింది. ఎపికి ప్రత్యేక హోదా డిమాండ్‌ చేస్తూ టిడిపి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్‌, టిఎంసి, ఎస్పి మద్దతు పలకడం దేశ ప్రజల దృష్టిని ఆకర్శించింది. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు దూరంగా ఉన్న టిఆర్‌ఎస్‌ విభజన హామీలపై పార్లమెంటులో గళం విప్పింది. అయితే ముందస్తుగా ఎన్నికలొస్తే ప్రత్యేక హోదాను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఇటు టిఆర్‌ఎస్‌, అటు కాంగ్రెస్‌ పావులు కదుపుతున్నాయి.
సోషల్‌ మీడియా వేదికగానూ టిఆర్‌ఎస్‌పై కాంగ్రెస్‌ ఎదురుదాడికి దిగుతోంది. ¬దాకు అనుకూలంగా కెసిఆర్‌, ఎంపి కవితలు చేసిన వ్యాఖ్యలను, వ్యతిరేకంగా హరీశ్‌రావు చేసిన ప్రసంగాలను జోడించి వైరల్‌ చేస్తున్నారు. రాజ్యసభలో విభజన బిల్లు ఆమోదం పొందకుంటే తెలంగాణ వచ్చుండేదే కాదంటున్నారు కాంగ్రెస్‌ నేతలు. హైదరాబాద్‌ రెవెన్యూ మొత్తం తెలంగాణకే వర్తిస్తున్న నేపథ్యంలో పారిశ్రామికంగా ఎపి ఎదిగేందుకు ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా హామీని అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఇచ్చారని, దానికి అనుగుణంగానే సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను సాధించలేని టిఆర్‌ఎస్‌కు ఇతర రాష్ట్రాల హక్కుల గురించి మాట్లాడే నైతికత లేదని టి-కాంగ్రెస్‌ నేతలు విమరిస్తున్నారు.
– సప్తగిరి, 98850 86126
http://www.jagritiweekly.com/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87%E0%B0%B7%E0%B0%A3/%E0%B0%B8%E0%B1%86%E0%B0%9F%E0%B0%BF%E0%B0%B2%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B2%E0%B0%95%E0%B1%82-%E0%B0%9F%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81/

టీ కాంగ్రెస్‌కు హోదా బెంగ




టి-కాంగ్రెస్‌కు హోదా బెంగ..

టి-కాంగ్రెస్‌కు హోదా బెంగ..
తెలంగాణ కాంగ్రెస్‌ నేతల్లో భయం మొదలైంది. తాజా పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో అన్న బెంగ పట్టుకుంది. జాతీయ నాయకత్వం ఆలోచనలు, సిడబ్ల్యూసి నిర్ణయం తెలంగాణలో ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్న చర్చ ప్రస్తుతం పార్టీలో జోరుగా సాగుతోంది.
కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో పట్టు సాధించేందుకు కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందుకోసం మాజీలను కూడా తిరిగి పార్టీలోకి చేర్చుకుంటోంది. పార్టీని గాడిలో పెట్టాలంటూ హైకమండ్‌ తెలంగాణకు ఏకంగా ముగ్గురు సీనియర్లను పంపించింది.
అలాగే ఏపిలో పునర్‌వైభవం కోసం కూడా ఆ పార్టీ అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే ఏపికి ప్రత్యేక హోదా కల్పిస్తామని పదేపదే ప్రకటిస్తోంది. తద్వారా ఆంధ్ర ప్రజలకు దగ్గర కావాలని చూస్తోంది. అయితే ఈ క్రమంలోనే 2019లో అధికారంలోకి వస్తే ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకుంది. రాహుల్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన తొలి సిడబ్ల్యూసిలో తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ కాంగ్రెస్‌లో కాక పుట్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామన్న రాహుల్‌ ప్రకటనతో తెలంగాణ నేతలు కలవరపడుతున్నారు.
టిఆర్‌ఎస్‌ వర్గాలు ఈ అంశాన్ని శరవేగంగా నెత్తికెత్తుకున్నాయి. కాంగ్రెస్‌పై తెలంగాణ మంత్రులు, టిఆర్‌ఎస్‌ నేతలు ఎదురుదాడి మొదలెట్టారు. తెలంగాణ ద్రోహులంటూ వారిని విమర్శిస్తున్నారు. ఏపికి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ పరిశ్రమలన్నీ అటువైపు తరలిపోయే ప్రమాదం ఉందని టిఆర్‌ఎస్‌ జోరుగా ప్రచారం చేస్తోంది. తెలంగాణకు అన్యాయం జరగడాన్ని టి కాంగ్రెస్‌ నేతలు సమర్థిస్తారా ? అని కొంతమంది అధికార పార్టీ నేతలు నేరుగా ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న కాంగ్రెస్‌కు ఈ వాదనతో గొంతులో పచ్చి వెలక్కాయ ఇరుక్కున్న మాదిరిగా తయారైంది. టిఆర్‌ఎస్‌ పార్టీ ఇదే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ఎన్నికల అస్త్రంగా మార్చుకోవచ్చని కాంగ్రెస్‌ నేతలు ఆందోళన చెందుతున్నారు.
అసలు ఉనికే కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌లో తిరిగి పాగా వేయడం కోసం హైకమాండ్‌ పెద్దలు చేస్తున్న ప్రకటనలు తెలంగాణలో ప్రమాదంగా మార నున్నాయని టి కాంగ్‌ నేతలు భయపడుతున్నారు. అయితే హైకమాండ్‌ మాత్రం ఈ విషయంలో కఠినంగా ఉండటంతో రాజకీయ పోరాటానికే సిద్ధమవుతున్నారు. టిఆర్‌ఎస్‌పై ఎదురుదాడి చేయాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ ఇచ్చింది.. తెచ్చింది కాంగ్రెస్సే అన్న అంశాన్ని మరింత ఉధృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు.
ఇక ఇప్పటికే రూపొందించిన షెడ్యూల్‌ ప్రకారం ఆగష్టులో రాహుల్‌ గాంధీ తెలంగాణలో నిర్వహించే బస్సు యాత్రలో పాల్గొననున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో రాహుల్‌ పర్యటిస్తారని రాష్ట్ర నేతలకు సమాచారం అందింది. ఈ జిల్లాల్లో ఏదో ఒకచోట జరగబోయే బహిరంగ సభలో కూడా ఆయన పాల్గొంటారని చెబుతున్నారు.
అవిశ్వాసంపై చిక్కని దొరకని టిఆర్‌ఎస్‌
కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై టిఆర్‌ఎస్‌ తనదైన వ్యూహాన్ని అనుసరించింది. చర్చలో పాల్గొని తెలంగాణ సమస్యల గురించి ప్రస్తావించి, విభజన చట్టంలో హామీల గురించి నిలదీసి సమయానికి టిడిపికి హ్యాండిచ్చి గోడమీద పిల్లి సామెతను గుర్తు చేసింది.
అవిశ్వాసంపై సభలో పార్టీ సభ్యులు అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ అధినేత, సిఎం కెసిఆర్‌ తనదైన శైలిలో మార్గనిర్దేశం చేశారు. కెసిఆర్‌ ఆలోచనలను ప్రతిబింబించేలా టిఆర్‌ఎస్‌ ఎంపిలు లోక్‌సభలో వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. ఎన్డీఏకి వ్యతిరేకంగా టిడిపి అవిశ్వాసం ప్రవేశ పెడితే ఆ పార్టీ సభ్యుల ప్రసంగాలకు టిఆర్‌ఎస్‌ నేతలు అడ్డుతగిలారు.
ఏపికి రావాల్సిన నిధులు, నెరవేర్చాల్సిన హామీలు, ప్రత్యేక హోదాపై టిడిపి ఎంపిలు మాట్లాడితే టిఆర్‌ఎస్‌ పక్కా వ్యూహంతో వాళ్లకే కౌంటర్‌ ఇచ్చింది. ఏపికి అన్యాయం జరిగిందంటూ టిడిపి సభ్యులు లేవనెత్తిన అంశాలపై తెలంగాణకు కూడా కేంద్రం మొండిచేయి చూపిందంటూ వీళ్లు మరో దారి పట్టారు.
అవిశ్వాసంపై చర్చను ఫాలో అయిన వాళ్లంతా టిఆర్‌ఎస్‌ వైఖరిని అర్థం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. టిఆర్‌ఎస్‌ బిజెపిని సమర్థిస్తుందా ? లేదంటే అవిశ్వాసానికి అనుకూలంగా వ్యవహరిస్తోందా ? టిడిపిని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తుందా ? అన్న సందిగ్ధం నెలకొంది. చర్చలో పాల్గొంటూనే ఓటింగ్‌ సమయంలో మాత్రం టిఆర్‌ఎస్‌ తటస్థంగా వ్యవహరించింది.
– సప్తగిరి, 98850 86126
http://www.jagritiweekly.com/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87%E0%B0%B7%E0%B0%A3/%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D%E2%80%8C%E0%B0%95%E0%B1%81-%E0%B0%B9%E0%B1%8B%E0%B0%A6%E0%B0%BE-%E0%B0%AC%E0%B1%86%E0%B0%82/