18, మే 2016, బుధవారం

యుపిఎకు అగస్టా గండం

                                 -    సోనియా మెడకు వేలాడుతున్న హెలికాప్టర్లు

(సప్తగిరి గోపగోని)


అగస్టా ఒప్పందం :

ఇటలీకి చెందిన అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ అనేది హెలికాప్టర్ల తయారీ సంస్థ. వివిధ దేశాలకు అవసరమైన హెలికాప్టర్లను, వాళ్ల డిజైనింగ్‌కు అనుగుణంగా తయారుచేసి ఇవ్వడంలో పేరున్న ఈ సంస్థతో నాటి యూపీఏ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ఇప్పుడు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 2010 ఫిబ్రవరిలో అప్పటి యూపీఏ సర్కారు అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో  ఒప్పందం కుదుర్చుకుంది. దేశానికి అవసరమైన 12 వీవీఐపీ హెలికాప్టర్లను సరఫరా చేసేందుకు రూ.3,600 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే.. ఈ వ్యవహారంలో హెలికాప్టర్ల తయారీ కంపెనీ అగస్టా రూ.360 కోట్ల రూపాయల ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఒప్పందం కోసం యూపీఏ ప్రభుత్వం నిబంధనలను కూడా సడలించింది. వాస్తవానికి అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో రక్షణశాఖ ఈ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే.. అప్పటి యూపీఏ పెద్దల హస్తంతోనే ఈ ఒప్పందం, ముడుపుల వ్యవహారం సాగినట్లు తెలుస్తోంది. తాజాగా దేశాన్ని, పార్లమెంటును కుదిపేస్తున్న అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కుంభకోణం కాంగ్రెస్‌ నేతలను వదిలేలా కనిపించడం లేదు.

బయటపడిన గుట్టు – ఇటలీకోర్టు తీర్పు :

    అగస్టా వ్యవహారంలో భారీగా ముడుపులు చేతులు మారినట్లు ఒప్పందంలో మధ్యవర్తి క్రిస్టియన్‌ మైకేల్‌ 2008లో ఆ కంపెనీ భారత విభాగం చీఫ్‌ పీటర్‌ హ్యూలెట్‌కు రాసిన లేఖ ఇటీవలే వెలుగు చూడటంతో అగస్టా తేనెతుట్టె కదిలింది. ఈ లేఖను విచారణాధికారులు ఇటీవలే ఇటలీ కోర్టుకు సమర్పించారు. డీల్‌ కుదరాలంటే సోనియాను ప్రసన్నం చేసుకోవాల్సిందేనంటూ మధ్యవర్తి ఆ లేఖలో సూచించడం పెద్ద దుమారాన్ని లేపింది.  అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ సహా అహ్మద్‌ పటేల్‌, ప్రణబ్‌ ముఖర్జీ, వీరప్ప మొయిలీ, ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌ తదితరులు సోనియాకు అత్యంత దగ్గరివారుగా ఆలేఖలో మైకేల్‌ పేర్కొన్నాడు. ఈ స్కాంకు సంబంధించి స్వట్జర్లాండ్‌కు చెందిన మరో దళారి గిడోరాల్ఫ్‌ హష్కే వద్ద దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్న కీలక పత్రాల్లో మైకేల్‌ రాసిన లేఖ కూడా ఉండటం అందరినీ నివ్వెర పరిచింది. ఈ రహస్యఫైళ్లు గత నెలలోనే వెలుగులోకి వచ్చాయి. ఇటలీలోని కోర్టు అగస్టా ఛాపర్ కేసు లావాదేవీలపై విచారణ జరిపి భారత్‌లోని రాజకీయ నాయకులకు ఈ సంస్థ ముడుపులు సమర్పించిందని తీర్పు చెప్పింది. ఇటలీలోని మిలన్‌ కోర్టు 250 పేజీలతో ఈ తీర్పు వెలువరించింది. ముడుపులు సమర్పించిన ఇటలీ సంస్థకు ఐదువేల డాలర్ల జరిమానా విధించింది. ఇటలీ కోర్టు తీర్పు 193వ పేజీలో సోనియాగాంధీ పేరు, 163-164 పేజీల్లో మన్మోహన్ సింగ్ పేరు ఉంది. 165వ పుటలో ఎస్.పి. త్యాగి సోదరుల పేర్లు ఉదహరించబడ్డాయి. ఇటలీ ప్రధాని మారియో మోంటే, రాయబారి టెర్రా షియానో పేర్లు కూడా జడ్జిమెంట్ కాపీలో ఉన్నాయి.

డ్రాఫ్ట్‌ బడ్జెట్‌..?

    అగస్టా హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకునేందుకు మధ్యవర్తులు భారత్‌లో అనేక మందికి భారీగా ముడుపులు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు బయటపడ్డ పత్రాల ఆధారంగా ప్రభుత్వంలోని పెద్దలు, రాజకీయ నేతలు, రక్షణ శాఖ అధికారులకు సుమారు రూ.430 కోట్ల మేర డబ్బులు చేతులు మారినట్లు బయటపడింది. ఎవరెవరికి ఎంతెంత చెల్లించారన్న వివరాలతో మధ్యవర్తి మైకేల్‌ రూపొందించిన కీలక పత్రం కూడా దర్యాప్తు అధికారులకు చిక్కింది. అయితే.. దానిపై డ్రాఫ్ట్‌ బడ్జెట్‌ అని రాసి ఉంది. ఇందులో సంక్షిప్త నామాలతో ముడుపుల వివరాలను పేర్కొన్నారు. పివోల్‌ అంటే పొలిటిషియన్స్‌ అనే శీర్షిక కింద ఏపీ అన్న అక్షరాలున్న వ్యక్తికి రూ.25కోట్లు ముట్టినట్లు రాశారు. ఎఫ్‌ఏఎం అంటే ఫ్యామిలీ అనే శీర్షిక కింద రూ.126 కోట్లు ముట్టజెప్పినట్లు పేర్కొన్నారు. సోనియా పేరును సంక్షిప్త నామంలో సిగ్మోరా గాంధీగా పేర్కొన్నారు.

ఇక.. 2011-12మధ్య మైకేల్‌ భారత్‌కు 31సార్లు వచ్చి వెళ్లినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఒప్పందం కుదరడానికి ముందుకూడా నేతలను ప్రసన్నం చేసుకునే లక్ష్యంతో 1993 నుంచి క్రిస్టియన్ మైఖేల్ దాదాపు వందసార్లు ఇండియాకు వచ్చి కాంగ్రెస్ నాయకులతో డీల్ కుదుర్చుకున్నట్లు కూడా గుర్తించారు.

శరవేగంగా దర్యాప్తు :

    అగస్టాపై దుమారం చెలరేగుతుండటంతో సీబీఐ ఈ వ్యవహారంపై శరవేగంగా దర్యాప్తు చేస్తోంది. ఇటాలియన్ ప్రాసిక్యూటర్లు విడుదల చేసిన లక్షా అరవై అయిదువేల డాక్యుమెంట్ల ఆధారంగా సిబిఐ ఛార్జ్‌షీటు తయారు చేస్తున్నది. అప్పటి ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ ఎస్పీ త్యాగి, అతని సోదరులతో పాటు.. పలువురిని సీబీఐ సుదీర్ఘంగా విచారించింది. ప్రస్తుతం లండన్‌లో ఉన్న క్రిస్టియన్‌ మైకేల్‌ను అప్పగించాల్సిందిగా ఇంటర్‌పోల్‌ను కూడా సీబీఐ కోరింది.

హెలికాప్టర్ల స్కాం విచారణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ - ఈడీ కీలక ఆధారాలు సంపాదించింది. ఒప్పంద మధ్యవర్తి క్రిస్టియన్ మిచెల్ కారు డ్రైవర్ నారాయణ బహదూర్‌ను విచారించిన ఈడీకి కేసుకు సంబంధించిన కీలక వివరాలు దొరికాయి. మిచెల్‌కు భారతీయ అధికారులు, రాజకీయ నేతలతో ఉన్న సంబంధాల వివరాలు ఈడీ సంపాదించింది. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి డ్రైవర్ నారాయణ బహదూర్‌కు డబ్బులు వచ్చేవని తెలిసింది.   లావాదేవీలను   విశ్లేషించటం ద్వారా మిచెల్‌కు ఏయే దేశాల్లో వ్యాపారాలున్నాయో స్పష్టత వస్తుందని ఈడీ భావిస్తోంది. ఢిల్లీలోని హోటల్‌నుంచి మిచెల్‌ను పికప్ చేసుకునే బహదూర్.. ఢిల్లీలోని భారత, విదేశీ సంస్థలు, వ్యక్తుల దగ్గరకు తీసుకెళ్లేవారు. దీంతో మిచెల్ ఎక్కడెక్కడ, ఎవరెవరిని కలిశారనే విషయాలు బయటపడనున్నాయి.

మరోవైపు.. అగస్టా కుంభకోణంలో తాను ముడుపులు స్వీకరించినట్లు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ మాజీ అధిపతి ఎస్పీ త్యాగికి వరుసకు సోదరుడైన సంజీవ్‌ త్యాగి అంగీకరించినట్లు సిబిఐ వెల్లడించింది. అగస్టా హెలికాప్టర్ల డీల్‌లో మధ్యవర్తులైన గిడో హాష్కె, కార్లో గెరోసాలనుంచి తాను డబ్బు స్వీకరించినట్లు సంజీవ్‌ త్యాగి చెప్పినట్లు సిబిఐ  పేర్కొంది. త్యాగి సోదరులు ఎస్పీ త్యాగితో తమకు ఆస్తుల విషయంలో సంబంధాలున్నాయని చెప్పారు. మధ్యవర్తులైన హాష్కె, గెరోసాలతో తాను ఆర్థిక లావాదేవీలను నిర్వహించానని సంజీవ్‌ త్యాగి చెప్పారని సిబిఐ వర్గాలు పేర్కొన్నాయి.

పెయిడ్‌ జర్నలిస్టు..?

అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంలో ఒక హిందీ చానెల్ కు చెందిన సీనియర్ జర్నలిస్టు పాత్రపై కూడా ఈడీ దృష్టి సారించింది.   సదరు జర్నలిస్టు అగస్టా వెస్ట్ ల్యాండ్ ఖర్చుతో తన భార్యతో కలిసి ఇటలీలో పర్యటించినట్లు ఈడీ కనుగొంది. ఈ జర్నలిస్టు, అతని కుటుంబంపై అగస్టా వెస్ట్ ల్యాండ్ 28 లక్షలు ఖర్చుచేసినట్లు ఈడీ పేర్కొంది. ఈ సీనియర్ జర్నలిస్టుకు అగస్టా వెస్ట్ ల్యాండ్ తో ఉన్న సంబంధంపై దర్యాప్తు చేస్తున్నది. ఈ కుంభకోణానికి సంబంధించి సదరు సీనియర్ జర్నలిస్టును ఈడీ గత ఏడాది   కూడా ప్రశ్నించింది. ఇలా ఉండగా బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఒక ట్వీట్ లో అగస్టావెస్ట ల్యాండ్ కుంభకోణంలో తొలి పెయిడ్ జర్నలిస్టును విచారించాలనడం కూడా చర్చకు దారితీసింది.

పార్లమెంటులో దుమారం !

         అగస్టా వెస్ట్‌ల్యాండ్ వ్యవహారంపై పార్లమెంట్‌లో దుమారం చెలరేగింది. లోక్‌సభలో దీనిపై సుదీర్ఘ చర్చ జరిగింది.  కావాలనే కాంగ్రెస్ పార్టీ అగస్టాతో ఒప్పందం కుదుర్చుకుందని రక్షణ మంత్రి పారికర్ లోకసభలో ఆరోపించారు. వీవీఐపీ చాపర్ల కొనుగోలు కోసం నిబంధనలు సైతం మార్చివేసిందన్నారు. ఒప్పందంలో కుదుర్చుకున్న బెంచ్‌ మార్క్‌ కంటే- కంపెనీ కోసం ధరను ఆరు రెట్లు పెంచడం జరిగిందన్నారు. 12 హెలికాప్టర్ల కోసం కాంగ్రెస్ ఆర్డర్ చేసిందని, ముడుపుల వ్యవహారం బయటపడడంతో ఆ డీల్‌ను రద్దు చేసుకున్నట్లు మంత్రి తెలిపారు. అంతేకాదు.. ఈ స్కాంలో ప్రభుత్వానికి సహకరించిన అధికారులకు రిటైర్మెంట్ తర్వాత మంచి స్థానాలు (గవర్నర్లుగా, అంబాసిడర్లుగా) లభించాయని రక్షణ మంత్రి పరీకర్ చెప్పారు. నమ్మకంగా ఉన్నందుకే వీరందరికీ అప్పటి ప్రభుత్వం రాజ్యాంగ పదవులు ఇచ్చిందన్నారు.

అయితే.. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో అగస్టా వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రక్షణ మంత్రి పారికర్ ఆరోపణలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ సభ నుంచి వాకౌట్ చేసింది. 

బోఫోర్స్‌లా సాగదు..!

బోఫోర్స్ స్కాం విషయంలో మాదిరి కాకుండా అగస్టా వివాదంలో పకడ్బందీగా ముందుకెళ్తామని రక్షణమంత్రి పరీకర్ లోక్‌సభలో తెలిపారు. ఈ కేసు విచారణలో ఇప్పటివరకు బయటపడ్డ ఎస్పీ త్యాగి, గౌతమ్ ఖైతాన్‌ల పాత్ర తక్కువేనన్నారు. యూపీఏ హయాంలో, వారి సహకారంతోనే అగస్టాకు హెలికాప్టర్ డీల్ దక్కిందనేది వాస్తవం. త్యాగి, గౌతమ్ కేవలం గంగానది (అవినీతి) లో చేతులు మాత్రమే కడుక్కున్నారు. అసలు గంగ ఎక్కడికెళ్లిందో గుర్తించే పనిలో ప్రభుత్వం ఉంది’ అని అన్నారు. ఈ కుంభకోణంలో త్యాగి పాత్ర చాలా చిన్నదన్నారు. ఈ కేసులో ఏపీ, సిగ్నోరా పదాలకు అర్థమేంటో ప్రపంచమంతటికీ తెలుసని ఆ పేర్లను ప్రస్తావించి తన పేరు పాడుచేసుకోదలచుకోలేదన్నారు.

మరోవైపు.. అగస్టా కేసులో ఇటలీ కోర్టు తీర్పుకు అనుగుణంగా కాంగ్రెస్ నేతలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్న పిటిషన్‌పై ఏం చేయాలో చెప్పాలని కేంద్ర ప్రభుత్వం, సీబీఐలకు సుప్రీం కోర్టు ఆదేశించింది. దర్యాప్తులో దూకుడు, కేంద్రం పట్టుదల చూస్తూంటే అగస్టా వ్యవహారం త్వరలోనే తేలే పరిస్థితి కనబడుతోంది.

సప్తగిరి గోపగోని

98850 86126.


11, మే 2016, బుధవారం

జాగృతి వారపత్రికలో ప్రచురితమైన ప్రపంచ పత్రికా దినోత్సవ వ్యాసం























పరిణామ క్రమంలో సంప్రదాయ మీడియా

                                  నాలుగో స్తంభానికి స్వేచ్ఛ


                                             -    మే ౩ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం




పత్రికారంగం రూపులు మార్చుకుంటోంది. కొత్తపుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు పత్రికలే ప్రధాన సమాచార వారధులు. తొలినాళ్లలో ఒక పత్రిక ముద్రితమైన తేదీ నుంచి వారం రోజుల తర్వాత కూడా పాఠకునికి చేరే పరిస్థితి ఉండేది. అప్పటి పరిస్థితులు, మౌలిక వసతులు అలా ఉండేవి. కానీ.. రాను రాను ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న సాంకేతికతను అత్యంత వేగంగా అందిపుచ్చుకోవడంలో పత్రికారంగం పాత్ర అమోఘమని చెప్పవచ్చు. ఒకప్పుడు మెయిన్ పేపర్ కే పరిమితమైన పత్రికలు క్రమంగా జిల్లా అనుబంధాలు, మండల, డివిజన్ స్థాయి అనుబంధాలను ప్రచురిస్తున్నాయి. అంతేకాదు.. జిల్లా స్థాయిలో ఎడిషన్లు నిర్వహిస్తున్నాయి. దీంతో సమాచారం మరింత విస్తృతంగా ప్రజల్లోకి చేరవేయడంలో పత్రికలు ముందడుగు వేశాయి. ఆ తర్వాత వచ్చిన రేడియో.. ఆకాశవాణి పేరిట సమాచారాన్ని మారుమూల ప్రాంతాలకూ చేరవేయడంలో ప్రముఖ పాత్ర పోషించింది. ఇక సమాచార రంగంలో టెలివిజన్ విప్లవాత్మక మార్పులను తెచ్చింది. తొలుత దూరదర్శన్, ఎంటర్ టైన్ మెంట్ చానెళ్ల స్థాయిని దాటి.. ప్రత్యేకంగా వార్తా చానెళ్లే ఉనికిలోకి వచ్చాయి. 24 గంటల పాటు వార్తలనే ప్రసారం చేసే టీవీ చానెళ్లు రావడంతో సమాచారం గణనీయమైన వేగాన్ని అందుకుంది. ఆ తర్వాత వచ్చిన ఇంటర్నెట్, వెబ్ చానెళ్లు సమాచారం రూపాన్నే మార్చేశాయి. ఇక.. ఇప్పుడు స్మార్ట్ సెల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక.. సోషల్ మీడియా సైట్లు అయితే.. ప్రతి ఒక్కరినీ జర్నలిస్టుగా మార్చేశాయి. ఇప్పుడు సోషల్ మీడియాను వినియోగిస్తున్న ప్రతి ఒక్కరూ అప్రకటిత జర్నలిస్తుగానే భావించాల్సి ఉంటోంది.

పత్రికా స్వేచ్ఛ :

పత్రికలను లేదా ప్రసార మాధ్యమాలను ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా (ఫోర్త్‌ ఎస్టేట్‌) పేర్కొంటారు. ప్రభుత్వానికి ఉండే మూడు అంగాలైన శాసన వ్యవస్థ, అధికార వ్యవస్థ, న్యాయ వ్యవస్థ (లెజిస్లేచర్‌, ఎగ్జిక్యూటివ్‌, జుడిషియరీ) తో పాటు ప్రజాస్వామ్యవ్యవస్థ ఆరోగ్యానికి అత్యావశ్యకమైనది పత్రికాస్వేచ్ఛ. అందుకే దాన్ని నాల్గవ అంగంగా, నాలుగవ స్తంభంగా పేర్కొన్నారు. 1729-1797 సంవత్సరాల నడుమ జీవించిన ఆంగ్లోఐరిష్‌పొలిటికల్‌థియరిస్ట్‌ఎడ్మండ్‌బ్రూక్‌మొదటిసారిగా పత్రికలను ఉద్దేశించి పౌరుష పదజాలంతో శక్తి అన్న పదాన్ని ప్రయోగించాడు. ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించడంలోనూ, మలచడంలోనూ మీడియా నిర్వహించే పాత్ర కీలకమైంది. మీడియా శక్తిమంతమైందనడానికి దాని మీద జరిగే దాడులే నిదర్శనం. అనేకదేశాలలో మీడియా మీద ఇంకా ఆంక్షలున్నాయి. ప్రభుత్వాలు పెట్టే ఆంక్షలు ఒకెత్తయితే మాఫియా ముఠాలు పెంచే ఒత్తిడి ఇంకొకెత్తు. విధినిర్వహణలో బలైన జర్నలిస్టులెందరో ఉన్నారు. వారంతా పత్రికాస్వేచ్ఛకు పట్టిన దివిటీలు. యూనివర్సల్‌ డిక్లరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌లోని 19వ అధికరణం భావప్రకటన స్వేచ్ఛని గురించి చెబుతుంది. పత్రికాస్వేచ్ఛకు అదే ఆధారభూమిక.

ప్రపంచ పత్రికాస్వేచ్ఛ దినోత్సవం :

1991లో ఆఫ్రికన్‌జర్నలిస్టులు ఏప్రిల్‌నుండి మే 3 వరకూ నమీబియాలోని విండ్‌హాక్‌లో ఒక సమావేశం నిర్వహించారు. అనంతరం పత్రికాస్వేచ్ఛపై కీలకమైన ప్రకటన చేశారు. దీనినే విండ్‌ హక్‌ డిక్లరేషన్‌ అంటారు. ఆఫ్రికాలోని అనేక దేశాలలో సెన్సార్‌షిప్‌వుండేది. పత్రికాస్వేచ్చ మీద ఆంక్షలుండేవి. వాటికి నిరసనగా ఆఫ్రికన్‌జర్నలిస్టులు ప్రకటన చేసిన మే 3 నాడే ప్రపంచ పత్రికాస్వేచ్ఛ దినోత్సవం జరపాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. ఆ నిర్ణయం మేరకు 1993 నుండి ఏటా మే 3న వరల్డ్‌ప్రెస్‌ఫ్రీడమ్‌డేను జరుపుకుంటున్నాము. పత్రికా స్వేఛ్చ పట్ల ప్రజలలో అవగాహన కల్పించడానికి ఇది దోహదపడుతుంది.

ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం ఉద్దేశ్యాలు :

-    పత్రికా స్వేఛ్చ, విలువల పట్ల అవగాహనా కల్పించడం
-     ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేఛ్చ యొక్క స్థితిగతులను పర్యవేక్షించడం
-     స్వేచ్ఛ కలిగిన మీడియాను దాడుల నుంచి రక్షించడం
-     విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పాత్రికేయులకు నివాళి ఘటించడం

వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడం అవార్డ్‌ :

1997 నుండి యునెస్కో ఏటా మే 3వ తేదీ నాడు గుల్లెర్మోకేనో వరల్డ్‌ప్రెస్‌ఫ్రీడమ్‌అవార్డును ప్రదానం చేస్తూ వస్తోంది. ప్రమాదం అంచుల్లో సైతం నిర్భయంగా వ్యవహరించి పత్రికాస్వేచ్ఛకు ప్రతీకగా నిలచిన జర్నలిస్టులకు, ఈ అవార్డు ప్రదానం చేస్తారు. అవార్డు కింద 25,000 అమెరికన్‌డాలర్ల నగదు బహుమతి ఉంటుంది. గుల్లెర్మోకేనో ఒక కొలంబియన్‌న్యూస్‌పేపర్‌కు ఎడిటర్‌గా ఉండేవారు. కేనో తన రాతలతో డ్రగ్‌మాఫియా కన్నెర్రకు గురయ్యారు. 1986 డిసెంబర్‌న ఆయన దారుణంగా తన న్యూస్‌పేపర్‌ఆఫీసు ఎదుటే హత్య చేయబడ్డాడు. ఆయన బలిదానం పత్రికాస్వేచ్ఛకు స్ఫూర్తి. ఆయన పేరిటనే ప్రెస్‌ ఫ్రీడమ్‌ డే నాడు అవార్డు అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఒక గుల్లెర్మోకేనో మాత్రమే కాదు.. జర్నలిస్టు విధినిర్వహణలో చంపబడ్డాడంటే, అది వ్యక్తిగతమైన దాడి కానే కాదు, అది భావప్రకటన స్వేచ్ఛ మీద జరిగిన దాడే! పత్రికా స్వేచ్ఛను పత్రికలు కాదు, ప్రజలే కాపాడుకోవాలి.


డిజిటల్‌కమ్యూనికేషన్‌ – సాంకేతిక విప్లవం :

డిజిటల్‌ కమ్యూనికేషన్‌ ఆగమనంతో రిపోర్టింగ్‌ విధానం మారింది. జవాబుదారీతనంతో కూడిన లక్ష్యాలు, సమతుల రిపోర్టింగ్‌ తక్షణావసరంగా గుర్తించాల్సిన అవసరం ఉంది. హింసాత్మక ఘటనల్లాంటివి కవర్‌ చేసేందుకు జర్నలిస్టులు వారి ప్రాణాలనే పణంగా పెడుతు సాహసోపేతంగా పనిచేస్తున్నారు. మానవతా విలువలు అణచివేసే పరిస్థితులు ఎదురైనపుడు వాటికి వ్యతిరేకంగా ప్రపంచం దృష్టిని ఆకర్షించే సత్తా మీడియాకు ఉంది. సంప్రదాయ మీడియాకు తోడు.. సోషల్ మీడియా.. చరిత్రలో ఓ సంచలనం. ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసిన మాధ్యమం. సమాచార మార్పిడిలో విప్లవాత్మక మార్పులకు దారి తీసిన మాధ్యమం. ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియాదే రోజువారి జీవితంలో కీలక సాధనంగా మారింది. సమాచార మార్పిడి మొదలై భావ ప్రకటన స్వేచ్ఛకు ఆయుధంగా మారుతోంది. సమాచార మార్పిడికి ఉత్తరాలపై ఆధారపడిన కాలం నుంచి టెలిగ్రామ్, టెలిఫోన్, సెల్‌ఫోన్ ఇలా ఎన్నో మార్పులు వచ్చాయి. అలాగే సమాచార మాధ్యమాల్లో రేడియో, టీవీ, పత్రికల స్థానాన్ని ఇంటర్నెట్ ఆక్రమించింది. ఇది ప్రపంచాన్ని డిజిటల్ యుగంగా మార్చిన దశ. ఇంటర్నెట్‌తో పాటు పలు సామాజిక మాధ్యమాలు పుట్టుకొచ్చాయి. ఉత్తర ప్రత్యుత్తరాల స్థానంలో మొయిల్స్ వచ్చాయి. టెలిగ్రామ్‌ల స్థానంలో మెసేజ్‌లు వచ్చాయి. క్రమంగా అది ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్, లింక్ట్‌ఇన్, వాట్సప్ వంటి సామాజిక మాధ్యమాల వరకు విస్తరించింది. ఇవే ఇప్పుడు సమాచార మార్పిడిలో కీలకంగా మారాయి.

దుష్ప్రభావాలు :

సామాజిక మాధ్యమాల వల్ల ఎంత ఉపయోగముందో అంతే స్థాయిలో దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. సమాచార మార్పి డి, భావజాల ప్రచారం కోసం వినియోగించేవారు కొందరైతే.. కొందరు దుర్వినియోగం చేస్తుండడం కూడా గమనించవచ్చు. వ్యక్తిగత దుష్ప్రచారం, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడడం వంటివి ఇందులో భాగమే. సోషల్ మీడియా వినియోగంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల పిల్లలు సెక్సువల్ అబ్యూజ్‌కి గురైన సందర్భాలు లేకపోలేదు. సోషల్ మీడియా ద్వారా అపరిచితులతో సైతం సంబంధాలు ఏర్పడడుతుండ డంతో వాళ్లని నమ్మి మోసపోతున్న వాళ్లు వేల సంఖ్యలో ఉంటా రు. ఇలా సైబర్ క్రైం శాతం పెరిగింది కూడా కాదనలేని నిజం. ప్రభుత్వం, ఇంటర్నెట్ ప్రొవెడైర్స్, సామాజిక మాధ్యమ సంస్థలు ఉమ్మడిగా... ఆన్‌లైన్ మీడియాపై విశ్వాసం పెరిగేలా చర్యలు తీసుకోవాలి. అప్పుడు మాత్రమే.. సాంకేతిక ప్రగతికి అర్థం ఉంటుంది.

విస్తృతార్థంలో ప్రెస్‌ ఫ్రీడమ్‌ డే :

ఎలక్ట్రానిక్ మీడియా ఉనికిలోకి రాకముందే పత్రికా స్వేచ్ఛను కాపాడే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి ప్రకటించిన ఈ దినోత్సవం ఇప్పటికీ పత్రికా స్వేచ్ఛా దినోత్సవంగానే పరిగణింపబడుతోంది. రేడియో, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియా ఉధృతరూపం దాల్చిన నేటి పరిస్థితుల్లో పత్రికా రంగాన్ని విస్తృతార్థంలో మీడియాగా పరిగణిస్తున్నారు. అంటే.. దీనిని మనం పత్రికా స్వేచ్ఛా దినోత్సవంగా కాక.. మీడియా స్వేచ్ఛా దినోత్సవంగా అనువదించుకోవాల్సిన అవసరం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో స్వేచ్ఛ :

     మన తెలుగు రాష్ట్రాల విషయానికే వస్తే.. ఇటు.. తెలంగాణలో అటు.. ఆంధ్రప్రదేశ్‌లోనూ రాష్ట్ర విభజన తర్వాత కొంతకాలం పాటు మీడియాపై ఆంక్షలు, బెదిరింపులు అనేవి బహిరంగంగానే వెలుగు చూశాయి. ఏపీలో ప్రతిపక్ష నేతకు చెందిన ఓ చానెల్‌, పత్రిక పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది. సాక్షి టివి, సాక్షి దినపత్రిక పట్ల ఒకవిధంగా అప్రకటిత ఆంక్షలు కొనసాగాయి. జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నిరసనల మూలంగా క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఇక.. తెలంగాణలోనైతే సాక్షాత్తూ ముఖ్యమంత్రే మీడియాపై ఆంక్షలు విధించడం, ఫలితంగా రెండు మీడియాలపై అప్రకటిత నిషేధం విధించడం కూడా జరిగింది. టీవీ-9, ఏబీఎన్‌వార్తా చానెళ్ల పట్ల సాక్షాత్తూ చట్టసభ అయిన అసెంబ్లీలోనే తన ఆక్రోశాన్ని వెల్లగక్కారు కేసీఆర్. అంతేకాదు.. వరంగల్‌లో జరిగిన ఓ సభలో తెలంగాణకు అనుకూలంగా లేని ‘’మీడియాను పది అడుగుల లోతున పాతిపెడతామంటూ’’ బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం జాతీయ స్థాయిలో కలకలం రేపింది. జాతీయ మీడియా కూడా కేసీఆర్‌వైఖరిని చీల్చి చెండాడింది. చివరకు ఏబీఎన్‌మీడియా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కి.. పత్రికా స్వాతంత్ర్యాన్ని న్యాయస్థానం ద్వారా సంపాదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేయడంతో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలోని ఎంఎస్‌వోలు దిగిరాక తప్పలేదు.

(సప్తగిరి గోపగోని – 98850 86126)