11, ఏప్రిల్ 2017, మంగళవారం

గిల్గిత్‌లో గిల్లికజ్జాలు (లోకహితం ఏప్రిల్‌-2017 సంచిక)

- ఆర్థిక కారిడార్‌ పేరిట పాక్‌, చైనా కుట్రలు

మొదటి నుంచీ గిల్లికజ్జాలు పెట్టుకునే దాయాది దేశం పాకిస్తాన్కు ఇప్పుడు పొరుగుదేశం చైనా జత కలిసింది. భారత్‌ను ఎప్పుడూ దొంగదెబ్బ తీసేందుకు సిద్ధంగా ఉండే పాకిస్తాన్‌కు చైనా స్నేహం తోడయ్యింది. నేరుగా భారత్‌ను ఎదుర్కొనే సాహసం చేయలేని చైనా.. ఈ క్రమంలోనే అటునుంచి నరుక్కువస్తోంది. ఫలితంగా రెండు దేశాలు కలిసి కొత్త కుట్రకు తెర తీశాయి. 

పాక్‌ ఆక్రమిత కాశ్మీర్లోని గిల్గిత్‌కు ఇప్పటిదాకా ఉన్న స్వతంత్ర ప్రతిపత్తిని కాదని, రాష్ట్ర హోదా కల్పిస్తూ పూర్తిగా పాకిస్తాన్‌ ఆధిపత్యంలోకి వెళ్లేలా.. ఈ తర్వాత క్రమంగా చైనా పెత్తనం సాగించేలా దుర్మార్గమైన ఆలోచన చేశాయి.
పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌
భారతదేశానికి స్వాతంత్య్రం లభించడం, దేశ విభజన తర్వాత.. 1947 అక్టోబరు 22న పాకిస్తానీ మూకలు కాశ్మీర్‌ ఆక్రమణకు కుట్ర చేశాయి. కాశ్మీర్‌ మహారాజు తమ రాజ్యాన్ని భారత్‌లో విలీనం చేస్తున్నట్లు భారత ప్రభుత్వానికి లేఖ పంపగానే.. అక్టోబర్‌ 27వ తేదీ భారత వైమానిక దళాలు కాశ్మీర్‌ చేరుకున్నాయి. భారత సైన్యం శత్రు సైన్యాలను తరిమికొట్టాయి. అప్పటికే జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రంలో మూడవ వంతు భూ భాగం పాకిస్తాన్‌ వశమైంది. 35 వేల చదరపు మైళ్ళు వున్న ఈ భూభాగంలో విలువైన అడవులు, ఖనిజ సంపద వున్నది. బాల్టిస్టాన్‌, గిల్గిత్‌, ముజఫరా బాద్‌ జిల్లాలలో పాకిస్తాన్‌ మూకలు వచ్చి చేరాయి. దీనికి పాకిస్తాన్‌ ఆజాద్‌ కాశ్మీర్‌ అని పేరు పెట్టింది.
సీపీఈసీ - చాపకింద నీరులా చైనా కుట్ర
భారత్‌ను దెబ్బతీసే కుట్రలో భాగంగా.. చైనా, పాకిస్తాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌ (సీపీఈసీ)కు ఇరు దేశాలు కలిసి ప్లాన్‌ చేశాయి. ప్రధానంగా చైనా.. ఈ విషయంలో దూకుడుగా వెళ్తోంది. రూ.2.85 లక్షల కోట్ల వ్యయంతో చేపడుతున్న సీపీఈసీ.. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ గుండా వెళ్తుండటంతో.. భవిష్యత్‌లో భారత్‌తో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు, తన చేతికి మట్టి అంటకుండా పాకిస్తాన్‌తో పావులు కదిపిస్తోంది చైనా. అందులో భాగంగానే.. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ పూర్తిగా పాకిస్తాన్‌ అధీనంలోకి తెచ్చుకునేందుకు వీలుగా.. గిల్గిత్‌కు రాష్ట్ర హోదా కల్పించేందుకు నిర్ణయిం చింది. ఇప్పటికే పాకిస్తాన్‌లో నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ఐదో రాష్ట్రంగా గిల్గిత్‌కు రాష్ట్ర హోదా కల్పిస్తామని పేర్కొంటోంది. గిల్గిత్‌- బాల్టిస్తాన్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని ప్రధానికి విదేశీ వ్యవహారాల సలహాదారైన సర్తార్‌ అజీజ్‌ నేతత్వంలోని కమిటీ సిఫార్సు చేసినట్లు పాక్‌ మంత్రి రియాజ్‌ హుస్సేన్‌ పీర్జాదా మీడియాకు చెప్పారు. ఇందుకోసం రాజ్యాంగ సవరణ కూడా చేయనున్నట్లు ఆయన చెప్పారు. అదే జరిగితే.. ఇక ఆ ప్రాంతాన్ని పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ అని కాకుండా పాకిస్తాన్‌తో అంతర్భాగంగా పేర్కొనాల్సి ఉంటుంది. అప్పడు చైనా పని కూడా సులువవుతుంది. అంతేకాదు.. భారత్‌ గుట్టుమట్లు తెలుసుకునేందుకు కూడా చైనాకు వీలవుతుంది. ఈ క్రమంలోనే 2014లో పాకిస్తాన్‌ పర్యటనకు వెళ్లిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పాకిస్తాన్‌ వెళితే సొంత తమ్ముడి ఇంటికి వెళ్లినట్లు ఉంటుందంటూ పాక్‌ నేతలను ఆకర్షించే ప్రయత్నం చేశారు.
గిల్గిత్‌-బాల్టిస్తాన్‌ భారత్‌లో అంతర్బాగమన్న బ్రిటన్‌
1947లో పాకిస్తాన్‌ కుట్రపూరితంగా ఆక్రమించుకున్న గిల్గిత్‌, బాల్టిస్తాన్‌ ప్రాంతాలు భారత్‌లో అంతర్బాగమని బ్రిటన్‌ పార్లమెంట్‌ చారిత్రక తీర్మానం చేసింది. 200యేళ్ల పాలన తర్వాత భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చిన ఆంగ్లేయులే ఈ తీర్మానం చేయడం భారత్‌కు అత్యంత పదునైన ఆయుధమని చెప్పవచ్చు. ఈ తీర్మానాన్ని కన్జర్వేటివ్‌ పార్టీ నేత బాబ్‌ బ్లాక్‌ మాన్‌ మార్చి 23న సభలో ప్రవేశపెట్టారు. ఈ వివాదాస్పద ప్రాంతాన్ని పాక్‌ తమ భూభాగంగా ప్రకటించుకోవడం సరికాదని ఈ తీర్మానం స్పష్టం చేసింది.

- హంసిని సహస్ర సాత్విక