21, అక్టోబర్ 2017, శనివారం

ఇటు జల తరంగ వైభోగం.. అటు ఆధ్యాత్మిక వైభవం (జాగృతి కృష్ణా పుష్కర సంచిక)

ఇటు జల తరంగ వైభోగం.. అటు ఆధ్యాత్మిక వైభవం
                        - గోపగోని సప్తగిరి, 98850 86126.

    భారత దేశంలోని ఇతర నదుల మాదిరిగానే.. దక్షిణాదిన అతిపెద్ద రెండో జీవనది అయిన కృష్ణా నదికి కూడా మహోన్నత పౌరాణిక ప్రశస్తి ఉన్నది. నది ప్రవాహం సాగిన పొడవునా ఎన్నో పుణ్యక్షేత్రాలు వెలిసాయి. మన ఆధ్యాత్మిక వైభవానికి నిదర్శనంగా నిలుస‌్తున్నాయి. హిందువుల పవిత్ర నదిగా గర్వంగా చెప్పుకునే.. కృష్ణా నది తీరాన ఉన్న పవిత్ర పుణ్య క్షేత్రాలలో ప్రధానమైనది శ్రీశైలం. ఆ తర్వాతే మిగతా క్షేత్రాల గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. కృష్ణా నది కి ప్రధాన ఆకర్షణ ప్రతి పన్నెండు సంవత్సరాలకోసారి జరిగే పుష్కరాలు. ఆ సమయంలో కృష్ణా నది తీరం అంతా భక్తులతో జనసంద్రాన్ని తలపిస్తుంది.

మహారాష్ట్రలోని ప్రముఖ క్షేత్రాలు :

మహబలేశ్వర్ :
    మహారాష్ట్ర లోని సతారా జిల్లాలో ఉన్న మహాబలేశ్వర్ ఒక హిల్‌ స్టేషన్‌. పశ్చిమ కనుమలు ఇక్కడి ప్రధాన ఆకర్షణ. ఈ కనుమలే.. కృష్ణానది తో పాటు మరో నాలుగు నదులకు జన్మస్థలం. ఈ ప్రదేశంలో చూడటానికి ముప్పై కి పైగా ఆకర్షణలు ఉన్నాయి. అందమైన లోయలు, అడవులు, నదులు, జలపాతాలు ఇక్కడి పశ్చిమ కనుమల అందాల్ని మరింతగా పెంచుతుంటాయి.

సాంగ్లీ  :
     సాంగ్లీ మహారాష్ట్రలోని ప్రసిద్ధ పట్టణం. ఈ పట్టణాన్ని డ్రామాల పుట్టినిల్లు అనేవారు. ఇక్కడ తప్పక చూడవలసినవి ఆలయాలు, జంతు ప్రదర్శనశాలలు. ఇక్కడి ఆలయాల్లో గణపతి ఆలయం, సంగమేశ్వరుని ఆలయం బాగా ప్రశస్తి చెందినవి. అంతేకాక ఈ ప్రాంతంలోనే రామలింగ, దత్తదేవ ఆలయాలు కూడా ఉన్నాయి.

కర్నాటకలోని ప్రముఖ క్షేత్రాలు :

బెల్గాం :
     కర్నాటక రాష్ట్రంలోని బెల్గాం పురాతనమైన పట్టణం. అందమైన సాహ్యాద్రి కొండలు, అరేబియా సముద్రం, జలపాతాలు, పచ్చిక బయళ్లతో పాటు.. ఆలయాలు ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. ఇక్కడ చెప్పుకోదగ్గ రెండు ఆలయాలు చిక్క బాసడి, కమల్ బాసడి.

కుదల సంగమ :
    కర్నాటకలో ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రాలలో కుదలసంగమ ఒకటి. ఇది పవిత్ర కృష్ణా నది ఒడ్డున వెలసినది. ఇక్కడి  ఆలయాలలో సంగమనాథ ఆలయం, బాసవేశ్వరుని ఐక్య లింగ ఆలయం ప్రధానమైనవి. సంగమనాథ ఆలయం చాళుక్యుల నిర్మాణ శైలిని పోలి ఉంటుంది.

జలదుర్గ  :
    జలదుర్గ కర్నాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లాలో ఉన్నది. ఇక్కడ కృష్ణా నది పరవళ్ళు తొక్కుతూ పై నుండి జలపాతంలా కిందకు పడుతుంది. దీనికి గల మరో పేరు జలదుర్గ జలపాతం. ఇక్కడ చూడవలసినది జలదుర్గ కోట. ఇది సముద్రమట్టానికి కొన్ని వందల అడుగుల ఎత్తులో నిర్మించారు. ఈ కొండ మీద నుండి లోయలో ప్రవహించే కృష్ణా నదిని తనివితీరా చూడవచ్చు.

తెలంగాణలోని ప్రముఖ క్షేత్రాలు :

తంగడి, మహబూబ్ నగర్ :
    తంగడి.. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లాలో గల ఒక గ్రామం. ఇక్కడే కృష్ణా నది తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. దక్షిణ భారత దేశంలో రాక్షస తంగడి యుద్ధం ఇక్కడే జరిగిందని కొందరి అభిప్రాయం.

కురుపురం, మహబూబ్ నగర్ :
    మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణా నది తీరాన ఉన్న కురుపురం ప్రసిద్ధ పుణ్య క్షేత్రం. ఇక్కడ శ్రీపాద శ్రీ వల్లభ స్వామి ఆలయం ఉన్నది. ఇక్కడికి భక్తులు వారాంతంలో తరచూ వస్తుంటారు. శని, ఆది వారాల సమయంలో, పండుగ సమయాల్లో యాత్రికులు ఇక్కడికి వచ్చి వనభోజనాలు సైతం చేస్తుంటారు. ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటూ యాత్రికులను ఆకర్షిస్తున్నది.

గద్వాల, మహబూబ్ నగర్:
    మహబూబ్ నగర్ జిల్లాలో గల గద్వాల ఒక ప్రముఖ పట్టణం. ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది గద్వాల కోట మరియు అందులోని చెన్నకేశ్వర స్వామి వారి ఆలయం. గద్వాల కోట పూర్తిగా మట్టితో నిర్మించినారు. దీనితో పాటు ఇక్కడ చూడవలసిన మరో ఆకర్షణ ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్.

బీచ్ పల్లి, మహబూబ్ నగర్ :
    బీచ్ పల్లి మహబూబ్ జిల్లా కు చెందిన గ్రామం. ఇది బెంగళూరు- హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే ఉన్నది.  కృష్ణా నది ఒడ్డున ఉన్న ఈ గ్రామంలో సీతారామాలయం, ప్రాచీన ఆంజనేయస్వామి ఆలయం ఉన్నాయి. 

ఆలంపూర్, మహబూబ్ నగర్ :
    అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన ఆలయం ఆలంపూర్‌లో ఉంది. ఈ క్షేత్రంలో నవ బ్రహ్మలు కొలువై ఉన్నారు. ఇక్కడ జోగులాంబ, బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాలు చరిత్ర ప్రసిద్ధికెక్కినాయి. ఆలంపూర్ ఆలయాలు చాళుక్యుల ఆలయ శిల్ప నిర్మాణానికి అద్దం పడతాయి. జాతీయ రహదారికి సమీపంలో ఉండే ఆలంపూర్.. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఓ మండలమైనప్పటికీ.. దక్షిణాన ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుతో గట్టి సంబంధం కలిగి ఉన్నది.  కృష్ణా నది యొక్క ఉపనదుల్లో కెల్లా పెద్దదైన తుంగభద్ర నది ఈ ప్రదేశంలోనే కలుస్తుంది.

సోమశిల, మహబూబ్‌నగర్:
    మహబూబ్‌నగర్ జిల్లా లోని కొల్లాపూర్ కి 8 కి. మీ. దూరంలో కొండల మధ్యలో నుంచి ప్రవహిస్తున్న కృష్ణా నది, చుట్టూ పచ్చని ప్రకృతి, నదీ తీరంలో నిర్మించిన 14 ఆలయాల సముదాయం సోమశిల. ఇక్కడి ప్రధాన దైవం సోమేశ్వర స్వామి . ఇక్కడ ఉన్న ఆలయాలు అన్నింటికీ కలిపి ఒకే గోడ ఉంది. ఇక్కడున్న సుందర దృశ్యాలు, కృష్ణా నది సందర్శకులకు కనులవిందు చేస్తుంది.

ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రముఖ క్షేత్రాలు :

సంగమేశ్వరం, కర్నూలు జిల్లా :
    సంగమేశ్వరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉన్న పుణ్య క్షేత్రం. ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రదేశం ఈ సంగమేశ్వరం. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఏడు నదులు కలిసే ప్రదేశంలో ఉన్న ఈ క్షేత్రం ఏడెనిమిది మాసాలు నదిలో మునిగి కేవలం మూడు నాలుగు నెలలు మాత్రమే బయటపడుతుంది. ఇక్కడి ప్రధాన దైవం శివలింగం.

శ్రీశైలం, కర్నూలు జిల్లా :
    శ్రీశైలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో విస్తరించిన నల్లమల అడవుల్లో ఉన్నది. ఇది ప్రముఖ శైవ క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఆలయం. ఇక్కడ దక్షిణ భారత దేశంలో ప్రసిద్ధి చెందిన భ్రమరాంబ, మల్లికార్జున స్వామి కొలువై ఉన్నారు. కృష్ణా నది ఒడ్డున ఉన్న పుణ్య క్షేత్రాలలో ప్రధానమైనది ఇదే...

కేతవరం, కర్నూలు జిల్లా :
    కేతవరం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లో ప్రవహించే కృష్ణా నది ఒడ్డున ఉన్నది. ఇక్కడి ప్రధాన దైవం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి. ఆలయ దర్శనం చేసుకోవడానికి భక్తులు కష్టపడక తప్పదు. ఇక్కడి కొండమీద ఉన్న ఆలయ దర్శనానికి వెళ్ళాలంటే 650 మెట్లు ఎక్కి, ఉదయాన్నే 9 గంటలకల్లా కొండమీదికి చేరుకోవాలి.

అమరావతి, గుంటూరు జిల్లా :
    ఆంధ్ర ప్రదేశ్ శాశ్వత రాజధానిగా ఎంపిక చేయబడిన అమరావతి.. కృష్ణా నది ఒడ్డున ఉన్నది. ఇక్కడ పంచరామాలలో ఒకటైన ఈ క్షేత్రాన్ని అమరారామంగా కూడా పిలుస్తారు. ఇక్కడ శివుడు అమరలింగేశ్వర స్వామి గా పూజలందుకుంటాడు. బౌద్ధుల ఆరామాలకు కూడా ఇది ప్రసిద్ధి.

కనక దుర్గ ఆలయం, శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి క్షేత్రం, కృష్ణా జిల్లా :
    ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత తాత్కాలిక రాజధాని విజయవాడ లో ఉన్న కనకదుర్గ ఆలయం దేశంలో ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయం ఇంద్రకీలాద్రి కొండ మీద వెలసింది. కృష్ణా నది ఒడ్డున ఉండే ఈ ఆలయం గురించి క్షేత్ర పురాణంలో పేర్కొనటం జరిగింది.

అవనిగడ్డ, కృష్ణా జిల్లా :
    అవని గడ్డ  ప్రాంతాన్నే దీవిసీమ అని అంటారు. ఇక్కడి ప్రధాన ఆకర్షణలు లంకమ్మ అమ్మవారి దేవాలయం, కోదండరాముని ఆలయం.

నాగాయలంక, కృష్ణా జిల్లా :
    నాగాయలంకలో గంగానమ్మ తల్లి దేవాలయం, గణపతి దేవాలయం, పోతురాజుస్వామి దేవాలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం, రాముని ఆలయం, దుర్గామాత ఆలయం ఉన్నాయి.

కోడూరు, కృష్ణా జిల్లా :
    కోడూరులో ప్రధాన ఆకర్షణలు భూదేవి సమేతుడైన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం, పార్వతీ సమేత స్వామి వారి ఆలయం, గంగా భవానీ ఆలయాలు ప్రముఖమైనవి.

మోపిదేవి, కృష్ణా జిల్లా :
    మోపిదేవి క్షేత్రం నాగ పూజలకు ప్రసిద్ధి.

                            - గోపగోని సప్తగిరి, 98850 86126.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి