21, ఏప్రిల్ 2018, శనివారం

తెలంగాణలో కొత్త పార్టీ (16-22 April 2018)

తెలంగాణలో కొత్త పార్టీ

తెలంగాణలో కొత్త పార్టీ
తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టిజెఏసి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోందండరాం ‘తెలంగాణ జన సమితి’ పేరుతో నూతన రాజకీయ పార్టీని స్థాపించారు.
తెలంగాణ ఏర్పడ్డాక కెసిఆర్‌ ప్రభుత్వంలో కోదండరాం భాగస్వాములవుతారని అందరూ అనుకున్నారు. కాని ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూనే వచ్చారు. అయితే కొంతకాలం నిశ్శబ్ధంగా ఉన్న కోదండరాం గత సంవత్సరం నుంచి టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై పత్యక్ష విమర్శలకు దిగారు. కెసిఆర్‌ పాలనలో తెలంగాణ అభివృద్ధికి నోచు కోవడం లేదని తీవ్రంగా మండిపడ్డారు. ఈ క్రమంలో ఓ రకంగా ప్రభుత్వానికి, పొలిటికల్‌ జెఏసికి మధ్య పెద్ద యుద్ధమే కొనసాగింది. మొదట విపక్ష పార్టీలతో కలిసి గళం వినిపించిన ప్రొఫెసర్‌ ఇప్పుడు ఏకంగా కొత్తపార్టీనే ఏర్పాటు చేశారు.
ఏప్రిల్‌ రెండో తేదీన ‘తెలంగాణ జన సమితి’ పార్టీ ఆవిర్భవించింది. ఇదే నెల 29వ తేదీన పార్టీ ఆవిర్భావ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కొన్ని నెలలుగా రాజకీయ పార్టీ గురించి సీరియస్‌గా కసరత్తు చేసిన కోదండరాం చివరకు తన సన్నిహితులు, ప్రముఖుల సమక్షంలో పార్టీ పేరు, లక్ష్యాలు, ఆశయాలు, కార్యాచరణను ప్రకటించారు. తెలంగాణలో ఏకవ్యక్తి నిరంకుశ పాలన సాగు తోందని, ఆ పాలనను కూకటివేళ్లతో తొలగించేందుకే కొత్తపార్టీని స్థాపించామన్నారు. తెలంగాణ అభివద్ధి, సామాజిక న్యాయ సాధనే ‘తెలంగాణ జన సమితి’ లక్ష్యమని కోదండరాం చెప్పారు. తాను కొత్త పార్టీని స్థాపించినప్పటికీ టిజెఎసి మాత్రం యథాతథంగా కొనసాగుతుందని కోదండరాం వెల్లడించారు.
హైదరాబాద్‌లో ప్రగతిభవన్‌ గడీ బద్దలు కొడతామని, తమ శక్తితో రాజకీయ మార్పును తీసుకొస్తామని కోదండరాం అన్నారు. ఏప్రిల్‌ నాలుగో తేదీన పార్టీ జెండా, గుర్తు వివరాలను ప్రకటించి అనంతరం ఆయన మాట్లాడుతూ సైకిల్‌పై ఊరూరా తిరిగి దళిత వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన కాన్షీరాం దేశ రాజకీయాల్లో పెను విప్లవాన్ని తీసుకొచ్చారని తెలిపారు. చీపురుతో బయల్దేరిన ఆమ్‌ఆద్మీ పార్టీ సామాన్యులను ఎన్నికల్లో నిలబెట్టి బలవంతులైన రాజకీయ నాయకులను ఓడించిందన్నారు. తాము కూడా బలమైన శక్తిగా మారతామని సమ్మక్క, సారలమ్మ, చాకలి ఐలమ్మ, సర్వాయి పాపన్న, ఇతర అమరవీరుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ముందుకు సాగుతామని తెలియజేశారు. అనంతరం ఆవిర్భావ సభ నిర్వహణకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో సన్నాహక కమిటీలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర స్థాయి సన్నాహక కమిటీలోని సభ్యులు, 11 సబ్‌ కమిటీలు సభ నిర్వహణ కోసం కార్యాచరణను ప్రారంభిం చాయి. జిల్లా స్థాయిల్లో ఏప్రిల్‌ ఐదో తేదీ నుంచి సదస్సులు, సమావేశాలు, ర్యాలీలు చేపడతామని కోదండరాం తెలిపారు.
పాలపిట్ట, ఆకుపచ్చ రంగులతో తెలంగాణ జన సమితి పార్టీ జెండాను రూపొందించారు. మధ్యలో నీలివర్ణపు తెలంగాణ పటం, ఆ మధ్యలో అమరుల స్థూపాన్ని ఉంచారు. స్థూపం చుట్టూ జనం తిరుగు తున్నట్లుగా జెండాను రూపొందించారు. జెండాలోని అంశాలను కోదండరాం ఒక్కొక్కటీ వివరించారు. విజయానికి సంకేతంగా పాలపిట్ట రంగు, అభివద్ధి, వ్యవసాయానికి చిహ్నంగా ఆకుపచ్చ రంగును తమ పార్టీ జెండాలో ఉపయోగించామన్నారు. దళిత వాదానికి ప్రతీకగా నీలివర్ణంలో తెలంగాణ పటాన్ని ముద్రించామన్నారు. అమరవీరుల స్థూపంపై ఉండే మల్లెపువ్వును పతాకం మధ్యలో పొందుపర్చా మన్నారు. దాని చుట్టూ తిరుగుతున్నది సంఘటితమైన తెలంగాణ ప్రజలని, మధ్యలో ఉన్న ఎరుపురంగు అమరుల ఆకాంక్షలకు ప్రతిరూపమని కోదండరాం వర్ణించారు.
స్థానిక సంస్థల్లో పోటీ చేస్తుందా ?
అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘తెలంగాణ జన సమితి’ పోటీ చేసే ఆలోచనలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజక వర్గాల్లో ఒంటరిగానే తమ పార్టీ పోటీ చేస్తుందని కోదండరాం ప్రకటించిన నేపథ్యంలో దానికి ముందు పంచాయతీ ఎన్నికల్లో బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఏప్రిల్‌ 29న జరిగే బహిరంగ సభలో చాలా మంది ప్రముఖులు, ఇతర పార్టీల నేతలు తమ పార్టీలో చేరతారని కోదండరాం స్వయంగా తెలిపారు. దీంతో ఇప్పటికే కెసిఆర్‌కు కొరకరాని కొయ్యగా మారిన కోదండరాం ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టడంతో ఇద్దరి మధ్య ప్రత్యక్ష పోరు మొదలైందంటున్నారు విశ్లేషకులు.
కత్తి మీద సామేనా ?
టిజెఏసి ఛైర్మన్‌గా ఉద్యమానికి అన్ని వర్గాల్నీ కోదండరాం ఏకం చేయగలిగినా అప్పటి పరిస్థితులు వేరు. రాజకీయంగా ఓ కొత్తపార్టీ ప్రజల్లో నిలదొక్కు కోవడం, అందరి మనసులూ గెలుచుకుని మనుగడ సాగించడం అంత తేలికేమీ కాదన్నది విశ్లేషకుల మాట. ప్రజల్లోకి పార్టీ అజెండా తీసుకెళ్లటం, ఎన్నికల్లో ఓట్లుగా మలుచుకోవటం మామూలు విషయం కాదు. మిగిలిన రాజకీయ పక్షాలన్నింటినీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏకం చేయడం కూడా అంత సులువేం కాదు. ఈ సవాళ్లన్నిటినీ కోదండరాం అధిగమిస్తారా? లేదా ? అన్న ప్రశ్న కూడా విశ్లేషకుల్లో తలెత్తుతోంది. పైగా రాజకీయంగా కాకలుదీరిన కెసిఆర్‌ రాజకీయ వ్యూహం ముందు కోదండరాం పాచికలు పారతాయా? అన్న ప్రశ్న కూడా అప్పుడే మొదలైంది. అయితే కోదండరాంతో అధికార పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు కూడా టచ్‌లో ఉన్నారని తెలంగాణ జన సమితి వైపు నుంచి ప్రచారం మొదలైంది. అయినా కెసిఆర్‌కి వ్యతిరేకంగా మంత్రులు ఆయనతో విభేదించి బయటికొచ్చే పరిస్థితులు ఉన్నాయా ? అన్న చర్చ కూడా జరుగుతోంది. అటు ప్రధాన ప్రతిపక్షంతో తెలంగాణ జన సమితి కలిసి పనిచేస్తేనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉంటుంది. లేదంటే టిఆర్‌ఎస్‌ నెత్తినే పాలు పోసినట్లవుతుందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.
కాంగ్రెస్‌ రెండో విడత బస్సు యాత్ర
ఇదిలా ఉంటే అటు కాంగ్రెస్‌ ఈ నెల ఒకటో తేదీ నుంచి రెండో విడత బస్సుయాత్ర మొదలెట్టింది. మొదటి విడతలో ఫిబ్రవరి 26న చేవెళ్లలో చేపట్టిన బస్సుయాత్ర మార్చి 3న హుజూరాబాద్‌లో ముగిసింది. మధ్యలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరగడంతో ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి రెండో విడత యాత్ర చేపట్టారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మొదలైన ఈ బస్సుయాత్ర ఈ నెల పదో తేదీ వరకు సాగింది. వరంగల్‌లో యాత్ర ముగింపు సభ నిర్వహించారు. ఈ యాత్రలో సిఎం కెసిఆర్‌ టార్గెట్‌గా కాంగ్రెస్‌ నేతలు విమర్శలకు పదును పెట్టారు. 2, 3 రోజుల విరామం తర్వాత మరో విడత బస్సుయాత్రను చేపట్టనున్నట్లు కాంగ్రెస్‌ నాయకులు తెలిపారు.
– సప్తగిరి

Link : http://www.jagritiweekly.com/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b2%e0%b1%87%e0%b0%b7%e0%b0%a3/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a3%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%95%e0%b1%8a%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4-%e0%b0%aa%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9f%e0%b1%80/ ()

బాలారిష్టాల్లో కోదండరాం పార్టీ (23rd April)


మూడో ఫ్రంట్‌ మూన్నాళ్ల ముచ్చటేనా ? (2nd April)


14, ఏప్రిల్ 2018, శనివారం

తెలంగాణలో మరో కొత్త పార్టీ


గుట్టువిప్పిన కాగ్‌

గుట్టువిప్పిన కాగ్‌

గుట్టువిప్పిన కాగ్‌
తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని కాగ్‌ పేర్కొంది. రెవెన్యూలోటు ఉంటే మిగులు చూపారని, ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిని దాటారని ఎత్తిచూపింది. రాష్ట్ర పురోభివృద్ధిలో ఆర్థిక నిర్వహణ అత్యంత కీలకం. ఈ అంశంలో ఉదాసీనత, నిబంధనలు ఉల్లంఘించడం, జవాబు దారీగా వ్యవహరించక పోవడం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపడమే కాకుండా అవినీతికి, నిధుల దుర్వినియోగానికి దారి తీస్తుందని కాగ్‌ హెచ్చ రించింది. రాష్ట్రంలో రూ.5392 కోట్ల రెవెన్యూ లోటు ఉండగా రూ.1386 కోట్ల రెవెన్యూ మిగులును చూపారంది. అప్పు తెచ్చుకున్న నిధులను రెవెన్యూ రాబడులుగా జమచేసి ద్రవ్యలోటును రూ.2500 కోట్లు తక్కువ చేశారంది. ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితి 3.5 శాతమైతే, వాస్తవంగా 4.3 శాతంగా ఉందని పేర్కొంది. రాష్ట్రంలో ఖర్చును పర్యవేక్షించడంలో, నియంత్రించడంలో బలహీనతలు స్పష్టంగా ఉన్నాయని కాగ్‌ తెలిపింది.
తెలంగాణ ధనిక రాష్ట్రమని ఊదరగొడుతున్న టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి కాగ్‌ నివేదిక చెంపపెట్టు లాంటిదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్‌ అన్నారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతోందని తాము చెప్పిన మాటలను అపహాస్యం చేశారని తమ ఆరోపణలన్నీ కాగ్‌ నివేదికతో బహిర్గతమయ్యాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ మిగులు ఉన్న రాష్ట్ర మంటూ ఇన్నాళ్లూ ప్రజలను మోసం చేశారని ఆయన విమర్శించారు.
ఏజి రాజీనామా
అజీబ్ సింగ్ (ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్)
గతవారం తెలంగాణ అసెంబ్లీలో జరిగిన పరిణామాలతో నెలకొన్న ప్రకంపనలు మరుసటి వారం కూడా కొనసాగాయి. రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్‌ జనరల్‌ ప్రకాష్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామా ప్రభుత్వ పరంగా, రాజ కీయంగా తీవ్ర చర్చను లేవనెత్తింది. ప్రభుత్వానికి, ఏజికి మధ్య సమన్వయం కొరవడిందన్న సంకేతాలు వెలువడ్డాయి. తన మాటకు ప్రభుత్వం పెద్దగా విలువ ఇవ్వడం లేదన్న అభిప్రాయంతో అడ్వకేట్‌ జనరల్‌ ప్రభుత్వ వైఖరికి భిన్నంగా వ్యవహరిస్తున్నారన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందన్న చర్చ న్యాయవర్గాల్లో సాగుతోంది.
అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల మొదటిరోజున సభలో కాంగ్రెస్‌ సభ్యులు వ్యవహరించిన తీరును తప్పుబడుతూ ఎంఎల్‌ఎలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ కుమార్‌ శాసన సభ్యత్వాలను స్పీకర్‌ రద్దు చేశారు. ఈ ఘటన మార్చి 12న జరగగా వారి సభ్యత్వాల రద్దుకు సంబంధించిన బులెటిన్‌ను అసెంబ్లీ 13వ తేదీన విడుదల చేసింది. అయితే ఆ రెండు సీట్లు ఖాళీ అయినట్లు ఇచ్చిన నోటిఫికేషన్‌ గవర్నర్‌ ఆమోద ముద్రతో జారీ చేయాల్సి ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాని సభ్యత్వ రద్దు నుంచి నోటిఫికేషన్‌ వరకూ సచివాల యమే నిర్ణయం తీసుకుంది. ఇందులోని లోపాలనే ప్రధానంగా ప్రస్తావిస్తూ ఎంఎల్‌ఎలు కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. దీంతో ఆరు వారాల వరకూ షెడ్యూలు విడుదల చేయవద్దని ఎన్నికల కమిషన్‌కు హైకోర్టు మార్చి 19న ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీలో జరిగిన గందరగోళానికి సంబంధించిన సిసి ఫుటేజీని మార్చి 27వ తేదీలోగా తమకు సీల్డ్‌ కవర్లో అందజేయాలని అదేరోజు అడ్వకేట్‌ జనరల్‌ను ఆదేశించింది. ఆయన అంగీక రించారు. అయితే తమ అనుమతి తీసుకోకుండానే సిసి ఫుటేజీలు కోర్టుకు ఇస్తామని ఏజి హామీ ఇవ్వడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు తనకు తెలియకుండానే ఈ కేసును వాదించే బాధ్యతలు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వేకు ప్రభుత్వం అప్పగిం చిందన్న నిర్ణయం ఏజిని మనస్తాపానికి గురిచేసిందం టున్నారు.
కొత్త పంచాయతీరాజ్‌ బిల్లు
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పంచాయతీరాజ్‌ కొత్త బిల్లు, మున్సిపల్‌ సవరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో కాలం చెల్లిన పాత చట్టం స్థానంలో కొత్త అంశాలు వచ్చి చేరాయి. సభ ఆమోదించటానికి ముందు పంచాయతీరాజ్‌ బిల్లులోని కొన్ని అంశాలపై బిజెపి, తెలుగుదేశం, సిపిఎం సభ్యులు కొన్ని సందేహాలను వ్యక్తం చేయగా వాటికి ముఖ్యమంత్రి కెసిఆర్‌ సమాధానమిచ్చారు. బిల్లును సెలక్టు కమిటీకి పంపాలని బిజెపి, తెలుగు దేశం, సిపిఎంలు కోరాయి. ఈ బిల్లు ఆదరా బాదరాగా తెచ్చిందేమీ కాదని, రెండేళ్లుగా వందల సంఖ్యలో సమావేశాలను నిర్వహించి అనేక మంది నిపుణుల నుంచి అభిప్రాయాలను తెలుసుకొన్న తర్వాతే వివిధ అంశాలను పొందుపర్చామని సిఎం వెల్లడించారు. త్వరలో మున్సిపాలిటీల సమగ్రచట్టం కూడా తీసుకొస్తామని ప్రకటించారు.
ఈ భేటీ వెనక మర్మమేంటి ?
కేంద్రంలో థర్డ్‌ ఫ్రంట్‌ ఏర్పాటు ప్రకటన నేపథ్యంలో సిఎం కెసిఆర్‌ను సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌ కలిశారు. దాదాపు నాలుగు గంటల పాటు పలు దఫాలుగా ప్రకాష్‌రాజ్‌ కెసిఆర్‌తో చర్చించారు. గతంలోనే సిఎంను కలిసేందుకు ప్రకాష్‌రాజ్‌ సమయం కోరగా మార్చి 29వ తేదీన ప్రగతిభవన్‌కు రావాల్సిందిగా సిఎం కార్యాలయం నుంచి వచ్చిన సమాచారంతో ప్రకాష్‌రాజ్‌ వెళ్లారు. మొదట రెండు గంటలపాటు ప్రకాష్‌రాజ్‌తో భేటీ అయిన కెసిఆర్‌ అసెంబ్లీకి తనతో పాటు ఆయనను కూడా తీసుకెళ్లారు. తిరిగి అసెంబ్లీ నుంచి ప్రగతి భవన్‌కు వెళ్లే సమయంలోనూ వెంట తీసుకెళ్లారు. ఆ తర్వాత మరో రెండు గంటల పాటు ప్రకాష్‌రాజ్‌తో చర్చలు జరిపారు. ఈ పరిణామం రాజకీయంగా చర్చను లేవనెత్తింది. దేశంలో కొత్త జాతీయ కూటమి ఏర్పాటుకు సిఎం కెసిఆర్‌ తీసుకున్న చొరవను ప్రకాశ్‌రాజ్‌ ప్రశంసించినట్లు తెలిసింది.
– సప్తగిరి
( jagrithi
http://www.jagritiweekly.com/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b2%e0%b1%87%e0%b0%b7%e0%b0%a3/%e0%b0%97%e0%b1%81%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81%e0%b0%b5%e0%b0%bf%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%95%e0%b0%be%e0%b0%97%e0%b1%8d%e2%80%8c/

3, ఏప్రిల్ 2018, మంగళవారం

స్పీకర్‌ సంచలన నిర్ణయం

స్పీకర్‌ సంచలన నిర్ణయం

స్పీకర్‌ సంచలన నిర్ణయం

తెలంగాణలో గడిచిన వారం అనూహ్య పరిణా మాలు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల మొదటిరోజు గవర్నర్‌ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్‌పార్టీ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి టేబుల్‌ ఎక్కి హెడ్‌ఫోన్‌ విసరడంతో ఆ హెడ్‌ఫోన్‌ తగిలి శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ కుడికంటికి గాయమైంది. దీంతో ఆయనకు సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో చికిత్స అందించారు. మొదట 24 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచిన వైద్యులు ఆపరేషన్‌ అవసరం లేదని ప్రకటించి డిశ్చార్జ్‌ చేశారు.
స్పీకర్‌ సంచలన నిర్ణయం
ఈ పరిణామం తర్వాత అసెంబ్లీ స్పీకర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ కుమార్‌ల అసెంబ్లీ సభ్యత్వం రద్దు చేస్తూ గెజిట్‌ జారీచేశారు. దాన్ని ఎలక్షన్‌ కమిషన్‌కూ పంపించారు. అంతేకాదు, గవర్నర్‌ ప్రసంగానికి ఆటకం కలిగిస్తూ నినాదాలు చేశారంటూ అసెంబ్లీలో విపక్షనేత జానారెడ్డితో సహా 11 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బడ్జెట్‌ సమావేశాలు ముగిసేదాకా సస్పెండ్‌ చేశారు. వారిలో జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, చిన్నారెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, మాధవరెడ్డి, డీకే అరుణ, భట్టి విక్రమార్క, రామ్మోహన్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి, పద్మావతిరెడ్డి ఉన్నారు.
అటు శాసన మండలిలోనూ విపక్ష నేత షబ్బీర్‌ అలీతో పాటు మరో ఐదుగురు సభ్యులు పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, సంతోష్‌, దామోదర్‌ రెడ్డి, ఆకుల లలిత, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిలను ఈ సెషన్‌ ముగిసే వరకు సస్పెండ్‌ చేశారు.
ఇదే ప్రథమం
అయితే ఎమ్మెల్యేల సభ్యత్వాలను స్పీకర్‌ రద్దు చేయడం దక్షిణాది రాష్ట్రాల్లో ఇదే ప్రథమమని చెబుతున్నారు. గతంలో ఇలాంటి పరిణామం ఎక్కడా చోటు చేసుకోలేదని అంటున్నారు. ఈ చర్యను అసెంబ్లీలో అన్ని ప్రతిపక్షాలు తప్పుబట్టాయి.
అలా ఎందుకు చేయలేదు ?
తెలంగాణ ప్రభుత్వం ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ సభ్యత్వం రద్దయిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లు గాంధీభవన్‌లో 48 గంటల పాటు ప్రజాస్వామ్య పరిరక్షణ నిరాహార దీక్ష చేపట్టారు. కాంగ్రెస్‌ సీనియర్లు, ముఖ్యనేతలంతా ఈ దీక్షకు సంఘీభావం తెలిపారు. తెలంగాణ జెఎసి చైర్మన్‌ కోదండరాం కూడా దీక్షా శిబిరానికి వచ్చి తన మద్దతు ప్రకటించారు. ప్రజాస్వామ్యం దెబ్బతినే విధంగా ప్రభుత్వం వ్యవహరించొద్దని టిజెఎసి చైర్మన్‌ కోదండరామ్‌ సూచించారు. ఒకవేళ శాసన సభ్యులు సభా సంప్రదాయాలకు విరుద్దంగా ప్రవర్తిస్తే ఎథిక్స్‌ కమిటికి ఎందుకు సిఫారస్‌ చేయలేదని, ఏకపక్షంగా సభ్యుల సభ్యత్వాలను రద్దు చేయడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు.
దీక్ష అనంతరం ఢిల్లీలో జరిగిన ఎఐసిసి ప్లీనరీకి తెలంగాణ నుంచి ముఖ్యనేతలంతా తరలివెళ్లారు. అయితే.. అసెంబ్లీ సభ్యత్వం రద్దయిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ కుమార్‌లకు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యేల కోటాలో గదులు కేటాయించొ ద్దంటూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లడం ఈ వివాదాన్ని మరింత పెంచింది. వాళ్లను మాజీ ఎమ్మెల్యేలుగా పరిగణించాలని అప్పటికప్పుడు ఆదేశాలు జారీచేయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.
హైకోర్టులో పిటిషన్‌
ఇదే పరిణామంపై కాంగ్రెస్‌ నేతలు ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో హైకోర్టును ఆశ్రయించారు. స్పీకర్‌ తన పరిధిని దాటి నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్‌ నేతల తరపు న్యాయవాది హైకోర్టులో వాదించారు. సభలో గవర్నర్‌ ఉన్న సమయంలో గవర్నర్‌ నేతత్వంలో సభ నడుస్తుందని, సమావేశాలు మొదలయ్యాక సభ స్పీకర్‌ అధీనంలోకి వస్తుందని, కానీ ఈ వ్యవహారంలో సభ్యత్వాలు రద్దు చేసే నిర్ణయం స్పీకర్‌ తీసుకున్నారని పాయింట్‌ లేవనెత్తారు. పైగా ముందస్తు హెచ్చరిక లేకుండా, నోటీసులు ఇవ్వకుండా, వివరణ కోరకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని న్యాయస్థానం దష్టికి తీసుకెళ్లారు. గవర్నర్‌ ప్రసంగం సమయంలో ఆయనను సాగనంపిన సమయంలో బాగానే ఉన్న మండలి చైర్మన్‌ ఆ తర్వాత ఆస్పత్రిలో ప్రత్యక్షమయ్యారని తెలిపారు. ఎమ్మెల్యే సంపత్‌ వీడియోలో లేకున్నా అతనిపై కూడా చర్యలు తీసుకున్నారని వాదించారు. మొత్తానికి సభ్యత్వాల రద్దు వెనుక రాజకీయ దురుద్దేశ్యం కనిపిస్తోందని కోర్టు దష్టికి తీసుకెళ్లారు. వీరి వాదనలు విన్న హైకోర్టు మరో 6 వారాల వరకు నల్గొండ, ఆలంపూర్‌ నియోజకవర్గాల ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇవ్వొద్దని స్పష్టం చేసింది. గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా జరిగిన సంఘటనల సిడిని 22వ తేదీ లోగా కోర్టుకు సీల్డ్‌ కవర్‌లో పెట్టి ఇవ్వాలని ఆదేశిస్తూ, కేసు తదుపరి విచారణను 26కు వాయిదా వేసింది.
ఎవరి వ్యూహాల్లో వారు..
ఈ పరిణామాలు ఇప్పుడు తెలంగాణలో హాట్‌ టాపిక్‌గా మారాయి. ప్రధాన ప్రతిపక్ష సభ్యులు లేకుండానే బడ్జెట్‌ సమావేశాలు కొనసాగించింది టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం. ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే గడువుండటంతో కాంగ్రెస్‌ పార్టీని ఆత్మరక్షణలో పడేయడంలో భాగంగానే అదను చూసి టిఆర్‌ఎస్‌ సర్కారు గతంలో ఎప్పుడూ లేని నిర్ణయం తీసుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ నేతలు ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకొని ప్రజల్లోకి వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇటు భారతీయ జనతాపార్టీ తన వ్యూహాల్లో నిమగ్నమైంది.
ఈ నేపథ్యంలోనే బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటించారు. బిజెపి రాష్ట్ర పదాధికారులు, ఒబిసి మోర్చా, సోషల్‌మీడియా సమావేశాల్లో ప్రసంగించారు. 2014 తర్వాత దేశంలో 14 రాష్ట్రాల్లో బిజెపి అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. త్రిపురలో సంస్థాగతంగా ఎలాంటి బలం లేకపోయినా అధికారంలోకి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. కర్నాటక ఎన్నికల తర్వాత దక్షిణాది రాష్ట్రాల రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటా యని, తెలంగాణలోనూ సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తామని ప్రకటించారు. దీంతో అప్పుడే తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
– సప్తగిరి 
http://www.jagritiweekly.com/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87%E0%B0%B7%E0%B0%A3/%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AA%E0%B1%80%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D%E2%80%8C-%E0%B0%B8%E0%B0%82%E0%B0%9A%E0%B0%B2%E0%B0%A8-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A3%E0%B0%AF%E0%B0%82/

మూడోఫ్రంట్‌ మూన్నాళ్ల ముచ్చటేనా ?


మూడోఫ్రంట్‌ మూన్నాళ్ల ముచ్చటేనా ?


మూడోఫ్రంట్‌ మూన్నాళ్ల ముచ్చటేనా ?

- పవార్‌ అవరోధం.. కారత్‌ విశ్లేషణం..
తెలంగాణ సిఎం కెసిఆర్‌ థర్డ్‌ఫ్రంట్‌ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దాదాపు మూడు వారాలుగా నిపుణులు, రాజకీయ విశ్లేషకులు, అనుభవజ్ఞులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న కెసిఆర్‌ జాతీయ రాజకీయాలకు అవసరమైన వ్యూహాలు, నెలకొన్న సమస్యలు, వివిధ రాష్ట్రాలను అనుసంధానం చేసుకోవడానికి కావాల్సిన పరిస్థితుల గురించి ముమ్మరంగా హోమ్‌వర్క్‌ చేశారు. ఈ క్రమంలోనే కోల్‌కతా వెళ్లి పశ్చిమబెంగాల్‌ సిఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. కెసిఆర్‌ థర్డ్‌ ఫ్రంట్‌ ప్రకటన చేశాక వేసిన తొలి అడుగు ఇదే. దాదాపు మూడు గంటల పాటు ఇద్దరు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. థర్డ్‌ఫ్రంట్‌ ఏర్పాటులో చేపట్టాల్సిన చర్యలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఇద్దరూ కలిసి సమష్టిగా మీడియాతో మాట్లాడారు.
కోల్‌కతా వేదికగా తొలి కూటమి పురుడు పోసుకోవడం ఆనందంగా ఉందని కెసిఆర్‌ చెప్పారు. మమతతో భేటీకి చాలా ప్రాధాన్యముందని, చర్చలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగాయని, కొన్ని అంశాలపై అంగీకారం కూడా కుదిరిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ కూటమి ఒకటి, రెండు పార్టీలకు మాత్రమే పరిమితం కాదన్న కెసిఆర్‌ ఇది ప్రజాకూటమిగా ఉంటుందన్నారు. మమతా బెనర్జీ మాట్లాడుతూ ‘ఇది మంచి ఆరంభం. దేశం మార్పు కోరుకుంటోంది. దేశాభివృద్ధి లక్ష్యంగా బలమైన సమాఖ్య కూటమిపై కెసిఆర్‌తో చర్చించాం. రాష్ట్రాలు బలంగా ఉంటేనే కేంద్రం బలోపేతమవుతుంది. మాకు బలమైన దార్శనికత ఉంది. ఈ కూటమికి నాయకత్వం సమస్య రానేరాదు. భావసారూప్యమున్న అన్ని పార్టీలను కలుపుకొని పోతాం’ అని చెప్పారు.
థర్డ్‌ ఫ్రంట్‌ను నడిపించేది తానేనని కెసిఆర్‌ మొదటి నుంచి చెప్పుకొస్తున్నారు. అంతేకాదు తాము ఏ పార్టీ దగ్గరికి వెళ్లబోమని కెసిఆరే ఓ ఫ్రంట్‌ అని ఆయన కుమారుడు తెలంగాణ మంత్రి కెటిఆర్‌ కూడా ఓ సందర్భంలో చెప్పారు. కానీ దానికి భిన్నంగా కెసిఆరే మొదటగా కోల్‌కతా వెళ్లడం చర్చనీయాంశమైంది. ఫ్రంట్లో ఎవరికి అవకాశం ఇచ్చినా ఫ్రంట్‌ నాయకుడిగా మాత్రం కెసిఆరే ఉండాలన్న నిర్ణయానికి వచ్చారు. పలు సందర్భాల్లో కెసిఆర్‌ ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టారు కూడా. ఫ్రంట్‌ ప్రయత్నం సక్సెస్‌ అయితే ప్రధాని పీఠంపై కూర్చుంటానని, లేదంటే తెలంగాణకే పరిమితమవుతానని అంతర్గత సమావేశాల్లో కెసిఆర్‌ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సన్నిహితులు చెబుతు న్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌, బిజెపికి వ్యతిరేకంగా ఎవరు ముందుకొస్తారా అని ఎదురుచూస్తున్న మమతా బెనర్జీ యాక్టివ్‌ కాకముందే తానే వెళ్లి ఆమెను కలిస్తే నాయకత్వం విషయంలో తర్వాత పేచీ ఉండబోదన్నది కెసిఆర్‌ ఆలోచనగా చెబుతున్నారు.
అయితే ఇలాంటి కలల్లో ఉన్న కెసిఆర్‌కు కేంద్ర మాజీ మంత్రి, రాజకీయ విశ్లేషకుడు, ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ షాకిచ్చారు. మధ్యప్రదేశ్‌ లోని ఇండోర్‌లో ఎన్‌డి టివితో మాట్లాడిన జెఠ్మలానీ కెసిఆర్‌ నెలకొల్పబోయే ఫెడరల్‌ ఫ్రంట్‌కు పశ్చిమబెంగాల్‌ సిఎం మమతా బెనర్జీ నాయకత్వం వహించాలని ఆకాంక్షించారు. ఆమె నాయకత్వంలోనే ఫెడరల్‌ ఫ్రంట్‌ బలోపేతం కాగలదని స్పష్టం చేశారు. దేశంలో థర్డ్‌ ఫ్రంట్‌ నడపగలిగే శక్తి, సామర్థ్యాలు మమతా బెనర్జీకి మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. అయితే రాం జెఠ్మలాని కెసిఆర్‌ గురించి ఎలాంటి ప్రస్తావన చేయకపోవడం గమనార్హం.
మరోవైపు కెసిఆర్‌ ఫ్రంట్‌కు ఎన్‌సిపి అధినేత శరద్‌ పవార్‌ అవరోధంగా తయారయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బిజెపియేతర పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారాయన.
2019 సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్‌సిపి కాంగ్రెస్‌ పార్టీకి చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో జాతీయ రాజకీయాల్లో శరద్‌పవార్‌కున్న పలుకుబడిని ఉపయోగించుకోవాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. పరస్పర అవగాహనలో భాగంగానే బిజెపిని వ్యతిరేకించే పార్టీలన్నిటినీ తన చిరకాల మిత్రుడు కాంగ్రెస్‌ వెనక మోహరింపజేసే కృషిని శరద్‌ పవార్‌ తన భుజాలపై వేసుకుని యుద్ధప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారం గురించి తెలిసిన మమతా బెనర్జీ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో కోల్‌కతాలో తన భేటీని ఫలవంతం అని మాత్రమే పేర్కొన్నారని విశ్లేషకులు అంటున్నారు. బిజెపియేతర కూటమికి కాంగ్రెస్‌ను దూరంగా ఉంచే ప్రతిపాదనపై తొందర వద్దని, భావసారూప్య పార్టీలన్నిటితో చర్చలు జరగనివ్వాలని కెసిఆర్‌కు మమతా సూచించారని సమాచారం.
ఇదే సమయంలో సిపిఎం సీనియర్‌ నేత ప్రకాష్‌ కారత్‌ వ్యాఖ్యలు కూడా థర్డ్‌ఫ్రంట్‌ అంశంపై కీలకంగా నిలుస్తున్నాయి. కెసిఆర్‌ మూడో కూటమి నిర్మించడానికి చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించబోవని ప్రకాశ్‌ కారత్‌ అభిప్రాయపడ్డారు. ‘ఒక్క కెసిఆరే కాదు ఆ ప్రయత్నం ఎవరు చేసినా అంతే. బిజెపియేతర, కాంగ్రెసేతర కూటమి నిర్మించడం అంత సులువు కాదు. ఎందుకంటే ప్రాంతీయ ఆకాంక్షలు వేరు. విధి విధానాల్లో, ప్రాంతీయ ప్రయోజనాల్లో ఎన్నో వైరుధ్యాలుంటాయి. ఇవన్నీ వాటి వాటి నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. ఆ ప్రాంతీయ పార్టీలు ఒక గొడుగు కిందకి రావడం అసాధ్యం. ఒకవేళ కూడగట్టినా అవి నిలబడవు. డిఎంకె, ఆర్‌జెడి లాంటి పక్షాలు ఎప్పటికీ కాంగ్రెస్‌తోనే ఉంటాయి. బిజెపిని ఓడించాలంటే ఒక్కటే మార్గం. రాష్ట్రాల వారీగా బిజెపి-వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకోవాలి. ఉత్తరప్రదేశ్‌ ఉప ఎన్నికల్లో జరిగింది ఇదే’ అని ప్రకాశ్‌ కారత్‌ పేర్కొన్నారు. గతంలో యుపిఏ తరహాలో ఓ కూటమి ఏర్పాటుచేయాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని అయితే కాంగ్రెస్‌ పట్ల విశ్వసనీయత లేనందున దాని సారథ్యానికి మిగిలిన పార్టీలు సమ్మతించవని, అందుచేత కాంగ్రెస్‌ నేతృత్వ ఫ్రంట్‌ కూడా విఫలమవుతుందని కారత్‌ తేల్చేశారు.
– సప్తగిరి, 9885086126

link :   ()
http://www.jagritiweekly.com/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87%E0%B0%B7%E0%B0%A3/%E0%B0%AE%E0%B1%82%E0%B0%A1%E0%B1%8B%E0%B0%AB%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82%E0%B0%9F%E0%B1%8D%E2%80%8C-%E0%B0%AE%E0%B1%82%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%AE%E0%B1%81/