17, నవంబర్ 2017, శుక్రవారం

నేటి చదువుల లక్ష్యమేమిటి ? మన చిన్నారుల పయనమెటు ?



పోటీ ప్రపంచాన్ని ధైర్యంగా ఎదుర్కోలేక పోతున్నారా..? ఉన్నత చదువులను తట్టుకోలేక పోతున్నారా..? ఒత్తిళ్లను జయించలేకపోతున్నారా..? విద్యార్థుల అదశ్యాలు, ఆత్యహత్యలు ఏం చెబుతున్నాయి..? ఈ పరిస్థితులు ఎలాంటి పరిణామాలకు కారణమవుతున్నాయి..? తప్పు విద్యార్థులదా..? చదువు చెప్పే ఉపాధ్యాయులదా..? లేదంటే.. ఓరకమైన వాతావరణం ఆవరించిన కార్పొరేట్‌ కాలేజీలదా..? కొన్నేళ్లుగా ఈ చర్చ సాగుతున్నా.. గడిచిన నెలరోజులుగా మాత్రం తీవ్రమైంది. ఆందోళనకరస్థాయిలో విద్యార్థుల ఆత్మహత్యలు, అద శ్యాలు కొనసాగు తున్నాయి. అటు.. పేరెంట్స్‌ను మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి. 

ఏం జరుగుతోంది ?
గడిచిన నెలరోజుల్లోనే చదువు ఒత్తిడి భరించలేక ఏడెనిమిది మంది విద్యార్థులు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. అమ్మాయిలే కాదు.. అబ్బాయిలు కూడా చదువు చట్రంలో నుంచి బయటపడేందుకు ఇళ్ల నుంచి పలాయనం చిత్తగిస్తున్నారు. అందరూ కార్పొరేట్‌ కాలేజీల్లో చదువుతున్న వాళ్లే. లక్షలు పోసి చదివిస్తున్న తల్లి దండ్రులు.. పిల్లలు ఇలా ప్రవర్తిస్తుంటే తట్టుకోలేక పోతున్నారు. వాళ్ల భవిష్యత్తు ఏమైపోతోందన్న భయంలో పడిపోతున్నారు. 
అదశ్యమే కాదు.. ఆత్మహత్యలు కూడా...
ఇళ్లలోనుంచి అదశ్యమవడం ఒక్కటే కాదు.. లోకంపోకడ కూడా తెలియని వయసులోనే బలవన్మరణాలకూ పాల్పడుతున్నారు విద్యార్థులు. కొందరు ఇళ్లల్లోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొందరైతే కాలేజీల్లో, కాలేజీ హాస్టళ్లలోనే బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. కన్న వాళ్లకు కడుపుకోత మిగిలిస్తున్నారు. అప్పటికప్పుడు అలజడి చెలరేగడం, పేరెంట్స్‌, బంధువులు నిలదీయడం, దేనికైనా రెడీ అనుకునే కాలేజీలు సెటిల్‌మెంట్స్‌ చేసుకోవడం గుట్టుగా జరిగిపోతు న్నాయి. పేరున్న, పెద్ద కార్పొరేట్‌ విద్యాసంస్థల్లోనే ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగు తుండటంతో.. ఈవార్తలు మీడియాలోకూడా రావడం లేదు. ఎందుకంటే లక్షల రూపాయల వ్యాపార ప్రకటనలు ఈ వాస్తవాలను కమ్మేస్తున్నా యన్నది ఎవరూ కాదనలేని వాస్తవం.

ఏది చదువు..? 
చదువంటే సమాజాన్ని అర్థం చేసుకోవాలి. చదువంటే భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలి. చదువంటే.. ఆ మనిషి వ్యక్తిత్వానికి పరిపూర్ణతను తీసుకురావాలి. మొత్తానికి వాళ్ల జీవితానికి ఓ అర్థంగా మారాల్సింది చదువు. కానీ.. ఇప్పుడు ఈ పరిస్థితులు లేవు. వీటికి అర్థమేంటో కూడా ఇప్పటి విద్యార్థులకు తెలియదంటే అతిశయోక్తి కాదు. 
ఇప్పుడెలా ఉన్నాయి..? 
ఇప్పుడు.. చదువంటే పాఠ్యపుస్తకాలు, చదువంటే పరీక్షల్లో వస్తాయనుకున్న ప్రశ్నలకు జవాబులను మాత్రమే బట్టీ పట్టడం, చదువంటే రోజులో 18 గంటలు కేవలం పుస్తకాలతో కుస్తీ పట్టడం, చదువంటే పరీక్షలయ్యేదాకా ఓ భవనంలో బందీగా మారడం, చదువంటే బయటి ప్రపంచాన్నే కాదు.. కనీసం సూర్యుడి వెలుగు కూడా చూడకపోవడం, చదువంటే విద్యార్థి చదివే విద్యాసంస్థ కబంధ హస్తాల్లో నలిగిపోవడం, మొత్తానికి చదువంటే పరమార్థం ర్యాంకులు... ఇదీ ఇప్పుడున్న విద్యావిధానం. 
బాధ్యులెవరు..?
పోటీ ప్రపంచమే లోకంగా వ్యాపార సామ్రాజ్యంలో మనుగడ సాగిస్తున్న కార్పొరేట్‌ సంస్థలు ర్యాంకులు మినహా ఏమీ పట్టించుకోవడం లేదు. విద్యార్థులను కనీసం కంటినిండా నిద్ర కూడా పోనివ్వడం లేదు. హాస్టళ్లలో నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం కూడా ఇవ్వడం లేదు. నిద్ర లేచింది మొదలు తిరిగి రాత్రి పడుకునే దాకా.. చదువు.. చదువు.. చదువు.. తప్ప ఇంకే అంశానికీ చోటివ్వడం లేదు. మార్కులు, ర్యాంకులు అంటూ చిన్నారులపై తమ లక్ష్యాలను రుద్దుతున్నారు. విద్యార్థుల పరిస్థితి, పరిజ్ఞానం గుర్తించకుండా ర్యాంకులకోసం వేధింపులవల్లే.. ఇలాంటి సంఘట నలు జరుగుతున్నాయన్నది కాదనలేని నిజం. 
తిలాపాపం.. తలా పిడికెడు..!
ఇదే సమయంలో తల్లిదండ్రుల బాధ్యత కూడా చర్చనీయాంశంగా మారుతోంది. కేవలం సంస్థల పేరు ప్రఖ్యాతులు చూడటం, ఎంత ఎక్కువ ఫీజు వసూలు చేస్తే.. అక్కడ అంత బాగా చదువు చెబుతారన్న ఓ తప్పుడు ఆలోచనల్లో మునిగిపోవడం చిన్నారులకు గండంగా మారుతోంది. మొత్తానికి ఇలాంటి సంఘటనలు తీవ్ర కలకలం                సష్టిస్తున్నాయి. కళాశాలల్లో వ్యవహారశైలి, ఇళ్లల్లో పేరెంట్స్‌ బాధ్యతపై చర్చను లేవనెత్తుతున్నాయి. 
- హంసిని సహస్ర సాత్విక
లోకహితం నవంబర్‌ నెల సంచికలో ప్రచురితం 
http://www.lokahitham.net/2017/11/blog-post_35.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి