21, అక్టోబర్ 2017, శనివారం

సిపాయిల తిరుగుబాటులో వీరనారీలు లక్ష్మీబాయి, ఝల్కారీబాయి (స్ఫూర్తి మాసపత్రిక నవంబర్‌ 2017)

సిపాయిల తిరుగుబాటులో వీరనారీలు
లక్ష్మీబాయి, ఝల్కారీబాయి
--------------------------------------------

                            - సప్తగిరి M.Phil (Journalistm)
                            సీనియర్‌ జర్నలిస్టు
                            శిశుమందిర్‌ పూర్వ విద్యార్థి

    భారతమాత స్వేచ్ఛావాయువుల కోసం పరితపించిన చరితార్థుల గురించి స్ఫూర్తిలో చెప్పుకుంటున్నాం. ఆ దారిలో ఇది మూడో అడుగు. నవంబర్‌ నెల రాగానే.. చాచా నెహ్రూ గుర్తొస్తారు. బాలల దినోత్సవం ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటాం. దేశానికి దాస్యశృంఖలాలు తొలగిపోయిన తర్వాత తొలి ప్రధానిగా పనిచేసిన జవహర్‌లాల్‌నెహ్రూ గురించి ప్రతియేటా చెప్పుకుంటున్నాం. అయితే.. అందుకు భిన్నంగా ఈసారి ఇద్దరు మహిళా మణిమకుటాల గురించి తెలుసుకుందాం. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, ఆమె సైన్యంలోని 'దుర్గావాహిని' మహిళా సాయుధ దళానికి నేతృత్వం వహించిన ఝల్కారీ బాయి గురించి తెలుసుకుందాం. ఎందుకంటే.. ఈ ఇద్దరు పుణ్య మాతలు జన్మించింది నవంబర్‌ నెలలోనే...

ఝాన్సీ రాణి లక్ష్మీబాయి :
-------------------------
    మరాఠా యోధుల పరిపాలన కింద ఉన్న ఉత్తర భారతదేశంలోని ఝాన్సీ అనే రాజ్యానికి రాణి లక్ష్మీబాయి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామం తొట్టతొలిగా వినిపించే పేరు లక్ష్మీబాయి.

    ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఆమె 1828వ సంవత్సరములో మహారాష్ట్ర కు చెందిన ఒక కర్హాడీ బ్రాహ్మణుల వంశంలో వారణాసిలో జన్మించింది. పరాస్నిస్ అనే చరిత్రకారుడు రాణీ నవంబర్ 19, 1835వ సంవత్సరంలో జన్మించినట్లు ఆమె జీవిత చరిత్రలో పేర్కొన్నాడు. ఈమె తల్లిదండ్రులు మోరోపంత్ తాంబే, భాగీరథీబాయి. వీళ్ళది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం.  మణికర్ణిక నాలుగేళ్ళ ప్రాయంలో ఉండగానే తల్లి కన్ను మూసింది. తండ్రి సంరక్షణలో కత్తిసాము, గుర్రపుస్వారీ, తుపాకీ పేల్చడం వంటి విద్యల్లో ఆరితేరింది.

    లక్ష్మీబాయికి 13 ఏళ్ళ వయసులోనే 1842లో ఝాన్సీ పట్టణానికి రాజైన గంగాధరరావు నెవల్కార్‌తో వివాహం జరిగింది. దీంతో ఆమె ఝాన్సీ పట్టణానికి మహారాణి అయింది. 1857లో లక్ష్మీబాయి స్వచ్చంద సైన్యాన్ని సమీకరించడం ద్వారా ఆత్మరక్షణ బలోపేతం చేసింది. మహిళలను కూడా సైన్యంలో చేర్చుకుని వారికి ఆయుధ శిక్షణను ఇచ్చింది. బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా పోరాటం మొదలెట్టింది.  ఆమె దగ్గర సైన్యాధ్యక్షులుగా ఉన్న వారంతా ఆమె యుద్ధం చేస్తున్న కారణానికి మద్దతుగా స్వచ్చందంగా ముందుకు వచ్చిన వారే. జనవరి 1858లో బ్రిటిష్ సైన్యం ఝాన్సీని ముట్టడించడం ప్రారంభించింది. రెండు వారాల పోరాటం తర్వాత ఆంగ్లేయులు నగరాన్ని చేజిక్కించుకోగలిగారు. రాణి లక్ష్మీబాయి 1858, జూన్ 17వ తేదీన గ్వాలియర్ యుద్ధంలో మరణించింది. ఈమె మరణానికి కారణమైన పరిస్థితుల గురించి చాలా వాదనలున్నాయి. ఇప్పటి బ్రిటీష్ రిపోర్టులను బట్టి ఆమె బుల్లెట్ గాయాలు తగిలి మరణించిందని తెలుస్తోంది. టి.ఎ మార్టిన్ రాసిన లేఖ ఆధారంగా ఈ విషయం తెలుస్తోంది.

ఝల్కారీబాయి :
------------------
    ఇక..  ఇప్పటిదాకా మనం వినని ఝల్కారీబాయి గురించి తెలుసుకుందాం... ఝల్కారీబాయి భారతీయ మహిళా సైనికురాలు. 1857 సిపాయి తిరుగుబాటు సందర్భంగా జరిగిన ఝాన్సీ యుద్ధంలో ప్రముఖపాత్ర పోషించింది. ఈమె ఝాన్సీ లక్ష్మీబాయికి అత్యంత ప్రీతిపాత్రమైన 'దుర్గావాహిని' మహిళాసాయుధ దళ నాయకురాలు.

    భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో సిపాయి తిరుగుబాటుగా, 'ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం'గా ప్రసిద్ధిగాంచిన 1857-58 నాటి వీరోచిత పోరాట ఘట్టంలో ఝాన్సీరాణి లక్ష్మీబాయికి ప్రతిరూపంగా కీలక భూమికను పోషించిన ఘనత దళిత బహుజన భూమిపుత్రిక ఝల్కారిబాయికే దక్కుతుంది. బుందేల్‌ఖండ్ ప్రాం తంలో ప్రజలు పాడుకునే జానపద బాణీల్లో ఝాన్సీలక్ష్మీబాయి సరసన ఝల్కారిబాయి సాహసాలను పాటల రూపంలో ఇప్పటికీ గుర్తుచేసుకోవడం విశేషం.

    ఝాన్సీ సమీపంలోని భోజ్‌లా గ్రామంలో కోరీ కులానికి చెందిన నిరుపేద వ్యవసాయ కూలీలైన సదోవర్ సింగ్, జమునాదేవి దంపతులకు 1830 నవంబర్ 22న జన్మించింది ఝల్కారిబాయి. వీరనారిగా ఎదిగి, నేడు ఆ ప్రాంతంలో దళిత బహుజనుల ఆత్మగౌరవ పతాకగా మారింది. చిన్న వయసులోనే తల్లి మరణించడంతో తండ్రి పెంపకంలో గుర్రపుస్వారీ, కత్తిసాము వంటి యుద్ధ విద్యలు నేర్చుకుంది. అడవిలో పశువులను మేపుతున్న ఝల్కారిపై దాడి చేసిన చిరుత పులిని కేవలం చేతికర్రతో చాకచక్యంగా హతమార్చిన ఘటన సంచలనం రేపింది. ఝాన్సీలక్ష్మీబాయి సైన్యంలో ఆయుధ విభాగంలో పనిచేస్తున్న పూరణ్‌సింగ్‌ను వివాహం చేసుకుంది ఝల్కారిబాయి.

    1858 ఏప్రిల్ 3న బ్రిటిష్ జనరల్ హగ్‌రోజ్ నాయకత్వంలో బ్రిటిష్ సేనలు ఝాన్నీ రాజ్యాన్ని చుట్టుముట్టాయి. ఆ దాడి నుంచి లక్ష్మీబాయి సురక్షితంగా తప్పించుకుని కల్పి ప్రాంతంలో పోరాడుతున్న తిరుగుబాటు నాయకులను కలుసుకోవడానికి అనువుగా, ఝల్కారీబాయి తానే ఝాన్సీలక్ష్మీబాయినంటూ కోట ముందు ప్రత్యక్షమై బ్రిటిష్ సేనలను ముప్పుతిప్పలు పెట్టింది. ఆ దాడిలో ఝాన్సీలక్ష్మీబాయి రూపంలో బందీగా పట్టుబడ్డ ఝల్కారిబాయిని గుర్తుపట్టిన బ్రిటిష్ సేనలు, తదనంతర కాలంలో ఆమెను విడిచిపెట్టారా లేదా చంపేశారా అన్నది చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. భారత ప్రభుత్వం, ఆమె జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేసింది.

                            - సప్తగిరి M.Phil (Journalistm)
                            సీనియర్‌ జర్నలిస్టు
                            శిశుమందిర్‌ పూర్వ విద్యార్థి
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి