19, ఆగస్టు 2014, మంగళవారం

తెలంగాణలో సమగ్ర సర్వే సక్సెస్‌... సూపర్‌ హిట్‌! హైదరాబాద్‌లో లెక్క తప్పిన అంచనాలు










    తెలంగాణ సమగ్ర సర్వే విజయవంతమైంది..! జిల్లాల్లో ప్రజలు 95శాతానికి పైగా వివరాలు నమోదు చేసుకున్నారు.. ఎన్యుమరేటర్లకు సమాచారం ఇచ్చేందుకు ప్రజలందరూ ఆసక్తి చూపించారు. చిన్న చిన్న సమస్యలు ఎదురైనా జిల్లాల్లో ఎన్ రోల్ మెంట్  భారీగా నమోదైంది. ఉదయం నుంచి రాత్రి వరకూ సర్వే కొనసాగింది. దేశ విదేశాల నుంచి సొంత పల్లెలకు తరలివచ్చిన జనం తమ వివరాలు నమోదు చేసుకున్నారు. మంగళవారం తెలంగాణ మొత్తం సర్వేమయమైంది. అందరి సహకారంతో గొప్ప అద్భుతం ఆవిష్కృతమైందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. సర్వేలో పాల్గొనని వారికి మరోసారి అవకాశం కల్పిస్తామని చెప్పారు. సర్వే వివరాల ఆధారంగానే భవిష్యత్ పథకాలు రూపొందిస్తామని తెలిపారు. మరోవైపు.. ఇవాళ కూడా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

    సర్వే ద్వారా  ఇటు హైదరాబాద్‌లో, మొత్తం తెలంగాణలో జనాభా భారీగా పెరిగిందన్న విషయం వెల్లడైంది. ఇప్పటిదాకా 70  నుంచి 80లక్షల జనాభా ఉంటుందనుకుంటున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ జనాభా కోటి 20 లక్షల దాకా ఉండొచ్చని సమగ్ర సర్వే ద్వారా వెల్లడవుతోంది. అలాగే.. మొత్తం తెలంగాణ రాష్ట్రం జనాభా నాలుగున్నర కోట్లుగా నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.

    రాష్ట్రంలోని దాదాపు కోటి కుటుంబాల వివరాలు ఒక్కరోజే నమోదు చేశారు. సర్వే సమాచారాన్ని వారం రోజుల్లో కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తారు. ఆ తర్వాత ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించే వెబ్‌సైట్లో వివరాలు ఉంచుతారు. సెప్టెంబర్‌ ఆరోతేదీ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

    అయితే.. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మాత్రం అర్థరాత్రి దాటాక కూడా వివరాల నమోదు కొనసాగింది. ఉదయం నుంచి ఎన్యూమరేటర్లకోసం ఎదురుచూసిన జనం.. వాళ్లు కనిపించగానే ఆయా ప్రాంతాల్లో తమ వివరాలన్నీ నమోదు చేసుకునేదాకా ఎన్యూమరేటర్లను కదలనీయలేదు. దీంతో.. అర్థరాత్రి అయినా ఎన్యుమరేటర్లు అందరి వివరాలు నమోదు చేసుకోక తప్పలేదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి