21, అక్టోబర్ 2017, శనివారం

వయోవృద్ధులు కాదు.. మన బతుకు నిర్దేశకులు (జాగృతి అక్టోబర్‌ 2016 సంచిక)

వయోవృద్ధులు కాదు.. మన బతుకు నిర్దేశకులు
                        - గోపగోని సప్తగిరి

    వాళ్లు సంపూర్ణ జీవితానికి నిలువెత్తు నిదర్శనాలు. కుటుంబ వ్యవస్థకు ఆయువు పట్లు. నేటి తరానికి మార్గదర్శకులు. కానీ నేటి ఆధునిక సమాజంలో వాళ్ల కేరాఫ్‌ అనాధాశ్రమాలు. వృద్ధాశ్రమాలు. మరీ కిందిస్థాయి వాళ్లయితే ఫుట్‌పాత్‌లు.

నాగరిక సమాజంలో అనాగరికం :
    నాగరికమని చెప్పుకుంటున్న ఈ రోజుల్లో పెద్దల పట్ల అనాగరిక చర్యలకు నిలువెత్తు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి పరిస్థితులు. అందరూ కాకున్నా.. మెజార్టీ పెద్దోళ్లు.. ఒంటరి జీవితాలు అనుభవిస్తున్నారు. తమ ఇళ్లల్లోనే పరాయి వాళ్లలాగా బతుకులు వెల్లదీస్తున్నారు. కొడుకులు, కోడండ్లు, కూతుళ్లు, అల్లుళ్లు ఎవరైతేనేమి.. మనుమలు, మనుమరాళ్ల ముందు చీత్కారాలకు గురవుతున్నారు. నూటికి తొంభైమంది పరిస్థితి ఇదే అంటే కాదనేవాళ్లెవరూ ఉండరు. ఎందుకంటే ఇది సత్యం. మనకళ్లముందు కనిపిస్తున్న వాస్తవం. ఎవరూ కాదనలేని పెద్దల జీవితం. ఈ రోజుల్లో వృద్ధులకు ఎవ్వరూ అంత ప్రాధాన్యం ఇవ్వట్లేదు. అది కోడలైనా, అల్లుడైనా, ఏం సొంత కూతురైనా, కొడుకైనా.. తాము ఓ స్థాయికి ఎదిగాక ఎక్కివచ్చిన నిచ్చెనను కాలితో తోసేస్తున్నారు. వృద్ధావ్యంలో కుటుంబ సభ్యులే వృద్ధుల పాలిట శత్రువులుగా మారుతున్నారు. దూషణలకు పాల్పడటమే కాకుండా కొందరు శారీరక హింసకూ పాల్పడుతుండటం పతనమవుతున్న మానవతా విలువలకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. డబ్బు సంపాదనపై పడి కడుపున పుట్టిన బిడ్డలనే క్రీచ్‌ల్లో చేర్చే ఈ రోజుల్లో వృద్ధులను సైతం ఓల్డేజ్‌ హోమ్‌ల్లో చేర్చేస్తున్నారు. ఆప్యాయతగా మాట్లాడే వారు లేకుండా పోవడంతో వృద్ధుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారవుతోంది. దినసరి కూలీలు, వ్యవసాయ కూలీలు, చేతివృత్తులవారు 60 సంవత్సరాల తర్వాత శరీర సత్తువ తగ్గి సంపాదించుకోలేక పోతున్నారు. వీళ్లకు మరే విధమైన ఆర్థిక వనరులు లేకపోవడం వలన ఆకలితో అలమటిస్తున్నారు. ఎంతో కష్టపడి కాయకష్టం చేసి రెక్కలు ముక్కలు చేసుకొని పైసా పైసా కూడబెట్టి తమలాగా తమ పిల్లలు కష్టపడకూడదని ముందుచూపుతో పిల్లలకు చదువు చె ప్పించి ప్రయోజకుల్ని చేస్తే వాళ్ల చేతనే ఈ వృద్ధులు నిరాదరణకు గురవుతున్నారు. ఉద్యోగ రీత్యా మరో ప్రాంతంలలో, ఇతర దేశాలలో స్థిరపడి తమ తమ తల్లిదండ్రులను ఆదుకోనివారు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు సంపాదించుకోవడం, భార్యాపిల్లలను పోషించుకోవడంలో ఉన్న శ్రద్ధ తల్లిదండ్రులపై ఉండటం లేదు. సాధారణంగా 60 ఏళ్ళ పైబడిన వాళ్లకు రోగాలు మొదలవుతుంటాయి. దీర్ఘకాల రోగాల బారినపడి ఖరీదైన వైద్యం చేయించలేక ఎంతోమంది శేష జీవితాన్ని దుర్భరంగా గడుపుతున్నారు. 

    పల్లె పట్నం తేడా లేదు, ధనిక, బీద భేదం లేదు. అందరివీ ఇవే బాధలు, కన్నీటి కథలు! నైతిక విలువలు కనుమరుగయ్యాయి. మానవ సంబంధాలు అవసరానికి మాత్రమే పరిమితమవుతున్నాయి. ఉమ్మడి కుటుంబం కనుమ రుగయ్యింది. చిన్న కుటుంబాలు విస్తరించాయి. కంటికి రెప్పలా కాపాడి, పెంచి ప్రయోజకున్ని చేసిన తల్లిదండ్రుల్ని విడిచి రెక్కలొచ్చాక పిల్లలు ఎగిరిపోతున్నారు. కంప్యూటర్‌ చదువులు, సుదూర ప్రాంతాల్లో, విదేశాల్లో ఉద్యోగాలు, ప్రేమ పెళ్ళిళ్ళు ఉపిరాడని బిజీ జీవితాలు. తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో వదిలేవారు కొందరు, అదీ చేయలేనివారు ఇంకొందరు. కడదాకా తోడుండి కాటికి పంపాల్సిన సంతానం కనుమరుగవుతున్నారు. సమాజంలో అనాదిగా ఎంతో ఆదరణ పొంది తమ మాటే మంత్రంగా, కుంటుబంలో వెలుగు వెలిగిన వెలుగులిచ్చిన వృద్ధులు జీవిత చరమాంకంలో విపరీత హింసను ఎదుర్కొంటున్నారు.

దినోత్సవం ఆవశ్యకత :
    వృద్ధులకోసం ఓ దినోత్సవాన్ని నిర్వహించడమంటేనే.. మనం ఎంతటి పాతాళానికి దిగజారిపోయామో అర్థం చేసుకోవచ్చు. పెద్దల పట్ల నేటి తరం వ్యవహారశైలి ఏంటో మననం చేసుకోవచ్చు. మన మూలాలను మనం ఎంతగా పరిగణనలోకి తీసుకుంటున్నామో లెక్కేసుకోవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో ఈ సమస్యను చర్చించి మరీ.. ఓ దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించారు. 1984లో వియన్నాలో మొట్టమొదటి సారిగా వృద్ధుల గురించి అంతర్జాతీయ సదస్సు జరిగింది. అక్కడే సీనియర్‌ సిటిజన్‌ అనే పదం పుట్టింది. ఈ సదస్సు జరిగిన తర్వాత ఎటువంటి అభివృద్ధి జరగలేదు. 1990 డిసెంబర్‌ 14న ఐక్యరాజ్య సమితి చొరవతో వృద్ధుల కోసం ఒక ప్రణాళికను రూపొందించి ప్రపంచ దేశాలన్నీ తప్పనిసరిగా అమలు చేయాలని కోరింది. 2004లో స్పెయిన్‌ దేశంలో జరిగిన 86 దేశాల సమీక్షా సమావేశాలలో వృద్ధుల సంక్షేమం కోసం 46 తీర్మానాలను ఆమోదించారు. మొదటిసాగారి 1 అక్టోబర్ 1991 న ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు.

ఆనాటి అనుభవం :
    చిన్నప్పుడు ఆరుబయట పడుకొని చుక్కలు చూస్తూ తాతయ్య, బామ్మ, మామ్మలు చెప్పే కథలు వినేవాళ్లు. ఇప్పుడు అసలు తాతయ్య, బామ్మ అనేవాళ్లే పిల్లలకు కనిపించడం లేదు. ఆ బంధాలు కూడా పిల్లలకు దూరమవుతున్నాయి. వరుసలు, బంధుత్వాలు కూడా తెలియకుండా పోతున్నాయి. కానీ.. గత చరిత్ర ను, మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకోవడం వల్ల విజ్ఞానం పెరుగుతుంది. వాళ్లతో చర్చించడం వల్ల సంస్కారం అలవడుతుంది. మన సంస్కృతి ఏంటో ద్యోతకమవుతుంది.

ఇతర రాష్ట్రాల్లో చర్యలు :
    ఒడిశాలో అరవై యేళ్లు దాటిన వృద్ధుల కోసం అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. రోజూ ఉదయాన్నే వృద్ధులు అక్కడికి చేరుకుంటారు. పప్పు భోజనం చేసి తిరిగెళ్తారు. వయోవృద్ధుల ఆకలి బాధ తీర్చడానికి ఒక్కో వృద్ధుడికి 200 గ్రాముల అన్నం, 50 గ్రాముల వవ్పు నిత్యం అందజేస్తున్నారు. హర్యానా, తమిళనాడు రాష్ట్రాల్లో 60 ఏళ్లు దాటిన మహిళలకు రోడ్డు రవాణాసంస్థ బస్సుల్లో 50శాతం రాయితీ ఇస్తున్నారు. వ్రతీ డివిజన్‌లో ఆశ్రమం, సీనియర్‌ సిటిజన్‌ క్లబ్బుల ఏర్పాటు, ఉచిత పైద్యసేవలు అందుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో వృద్ధుల సంక్షేమంకోసం వ్రత్యేక శాఖలు వనిచేస్తున్నాయి. మనరాష్ట్రంలో స్త్రీశిశు సంక్షేమశాఖలో ఇదో భాగంగా ఉంది.  2003లో రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన కార్యాచరణ పథకం బస్సుల్లో సీనియర్‌ సిటిజన్లకు చార్జీలు రాయితీ ఇస్తామని ప్రకటించింది. మహారాష్ట్రలో 75 శాతం, రాజస్థాన్‌లో 25 శాతం, పంజాబ్‌, ఢిల్లీ, చండీగఢ్‌, గోవాలలో 50 శాతం కర్ణాటకలో 25 శాతం తమిళనాడు, కేరళలో 30 శాతం రాయితీ ఇస్తున్నారు.

    మన దేశంలో 60 ఏళ్ళకు మించిన వృద్ధులు దాదాపు 11 కోట్ల మంది ఉన్నట్టు 2011 జనాభా లెక్కలు చెబుతున్నాయి. మరో 20 ఏళ్ళలో ఈ సంఖ్య రెట్టింపు కాగలదని అంచనా. అనగా మనిషి జీవన పరిమాణం పెరుగుతుంది. ఇది మంచి పరిణామమే. నీ.. దేశంలో నెలకొన్న వరిస్థితులవల్ల సామాన్యులకు నానాటికీ బతుకుభారమవుతోంది. అదేక్రమము లో వృద్ధులవట్ల నిరాదరణ కూడా అంతకంతకు ఎక్కువైపోతోంది. దేశాన్ని పాలిస్తోంది వ్రధానంగా వృద్ధనేతలే అయినవ్పటికీ వయోవృద్ధుల సమస్యలకు వరిష్కారం కనబడకపోవడం అసలైన విషాదం.

వయోజనులకు అండ :
    వృద్ధుల శ్రేయస్సు దిశగా అనేక దేశాలు చట్టాలు చేసిన యాభై ఏళ్ల తరువాతగానీ భారతదేశం మేలుకోలేదు. ఎట్టకేలకు 2007లో 'తల్లిదండ్రులు-పెద్దల పోషణ, సంక్షేమ చట్టం' అమలులోకి వచ్చింది. అయినా, చట్ట నిబంధనలు కాగితాలకే వరిమితం కావడంతో వృద్ధుల సమస్యలు తీరనేలేదు. అనేక రాష్ట్రాల్లో కనీస మాత్రంగానైనా చట్టం అమలవుతున్న దాఖలాలు కనబడటం లేదు. తల్లిదండ్రుల్ని వట్టించుకోనివారికి మూడు నెలల వరకు జైలు, అయిదు పేల రూపాయల జరిమానా లేదా రెండూ విధించే అధికారాన్ని ట్రిబ్యునళ్లకు ఈ చట్టం కల్పించింది. భరణాన్ని ఎగ్గొట్టినవారికి నెలరోజుల వరకు జైలుశిక్ష వడుతుంది. వృద్ధులకు అండగా నిలిచే ఇలాంటి నిబంధనలు ఎన్నో చట్టంలో ఉన్నాయి. చట్ట వ్రకారం వృద్ధులు తమ సమస్యలను నేరుగా ఆర్డీవో స్థాయి అధికారులకు పిర్యాదు చేసుకోవచ్చు. కానీ, సరైన అవగాహన లేకపోవడంతో అధికశాతం వృద్ధులైన తల్లిదండ్రులు నేరుగా పోలీసులు, న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. వృద్ధులకు రైలు వ్రయాణంలో రాయితీ సౌలభ్యం ఉన్నా, అందుకు అనుగుణంగా సీట్లు ఉండవు. ఒంటరిగా జీవించే వృద్ధులకు ఇళ్లవద్ద భద్రత కొరవడుతోంది. వ్రభుత్వ కార్యాలయాలకు పెళ్లినా, వారికి ప్రాధాన్యం దక్కడం లేదు. బ్యాంకులు, పింఛను కార్యాలయాల వద్ద నిత్యం చాంతాడంత వరసల్లో ఈసురోమంటూ నిలబడక తవ్పడం లేదు.

    మెయింటైనెన్స్‌ అండ్‌ వెల్ఫేర్‌ అఫ్‌ పేరెంట్స్‌ ఎండ్‌ సీనియర్‌ సిటిజెన్‌ యాక్ట్‌- 2007 చట్టం, నేషనల్‌ పాలసీ ఫర్‌ ఓల్డర్‌ పర్సన్స్‌ -1999, నేషనల్‌ ఓల్డ్‌ ఏజ్‌ పెన్షన్‌ స్కీము -1994, అంత్యోదయ పథకం, బీమా కంపెనీలనుంచి వివిధ సీనియర్‌ సిటిజన్‌ పథకాలు, నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఓల్డర్‌ పర్సన్స్‌, ఇంటిగ్రెటేడ్‌ ప్రొగ్రాం ఫర్‌ ఓల్డర్‌ పర్సన్స్‌, రైల్వే, రవాణా, విమానయానాలలో వృద్ధులకు రాయితీలు జాతీయ స్థాయిలో ఉండగా, అంతర్జాతీయ స్థాయిలోకూడా వివిధ సంస్థలు వృద్ధులకు చేయూతనిస్తున్నాయి. సీడా ఒప్పందం, డిక్లరేషన్‌ ఆన్‌ సొషల్‌ ప్రోగ్రెస్‌ అండ్‌ డెవెలప్‌ మెంట్‌ -1969 ( సెక్షన్‌ 11)  మొదలైనవి వీరి హక్కులకు బాసటగా నిలుస్తు న్నాయి.

    పాశ్చాత్య దేశాలు వృద్ధుల సంరక్షణకు పలు చట్టాలు రూపొందించాయి. బతికినంతకాలం వృద్ధులను కుటుంబ సభ్యులు ఆదరణతో చూసుకునేవిధంగా పటిష్ఠ నిబంధనలు చట్టంలో పొందుపరచారు. ఆర్థిక భద్రత సైతం వారికి లభిస్తుంది. ఎవరూ లేనివారికోసం వ్రత్యేక సంరక్షణ కేంద్రాలనూ అనేక దేశాలు ఏర్పాటు చేశాయి. మరీ ముఖ్యంగా వృద్ధుల్లో వయసురీత్యా వచ్చే ఆత్మన్యూనత భావనలను పోగొట్టడానికి కౌన్సెలింగ్‌ కేంద్రాలూ సేవలందజేస్తున్నాయి. వృద్ధుల భద్రతకోసం కొన్ని దేశాల్లో వ్రత్యేక పోలీసుల సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.

    ప్రత్యేకంగా వృద్ధులకోసమే పలు చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఉన్నాయి. ఆర్టీసీ బస్సులలో రాయితీ, రైల్వేలలో ఇస్తున్న 40 శాతం రాయితీకి తోడు ఇంకో 20 శాతం పెంచాలి. అంతేకాకుండా రిజర్వేషన్‌లో కూడా ప్రాముఖ్యం కల్పించాలి. ప్రతి బ్యాంకులో క్యూ తో నిమిత్తం లేకుండా సీనియర్‌ సిటిజన్లకు లావాదేవీలు జరిపే సదుపాయం కల్పించాలి. కార్పొరేట్‌ ఆస్పత్రులలో 25 శాతం రాయితీ కల్పించి ఆ విషయాన్ని ఆసుపత్రి బోర్డులపై ప్రచురించాలి. రాష్ట్ర ప్రభుత్వంలో సీనియర్‌ సిటిజన్లకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి ఒక మంత్రిని నియమించాలి. సీనియర్‌ సిటిజన్లు ఎదర్కొంటున్న సామాజిక బాధలు పరిష్కరించడానికి ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయాలి. అనారోగ్యంతో బాధపడే వృద్ధులకు ఉచిత వైద్య సహాయం అందచేయాలి. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో, పోలీస్‌ స్టేషన్‌లో వృద్ధులను గౌరవించడం మన బాధ్యత అనే బోర్డులను ఏర్పాటు చేయాలి. మన తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత వృద్ధులకు వెయ్యి రూపాయల పెన్షన్‌ మంజూరు చేస్తున్నారు. ఈ విషయంలో వృద్ధులు కొంతవరకు సంతోషపడాలి. తిరుపతి, శ్రీశైలం, యాదగిరిగుట్ట మొదలగు రద్దీ ఉండే పుణ్య క్షేత్రాలలో వృద్ధులకు క్యూ నిమిత్తం లేకుండా డైరెక్టుగా దర్శన ఏర్పాట్లు కల్పించాలి.  వృద్ధులు కూడా అవస్థలు పడకుండా అలమటించి పోకుండా చూసే బాధ్యత యువతకు, ప్రభుత్వానికి వుంది.

పెద్దల మాట చద్దిమూట :
    బాల్యం- 20 ఏళ్ళయితే, కౌమార, యువన దశలు 40సంవత్సరాలు. ఇలా మనిషి జీవిత ప్రయాణంలో 3దశలు పూర్తిచేసి 60ఏళ్ళుచేరుకుంటే షష్టిపూర్తి. కాలచక్రంలో 60ఏళ్ళు పూర్తయిన వ్యక్తికి షష్టిపూర్తి చేస్తారు. వ్యక్తి దీన్నే సంప్రదాయ బాషలో ఉగ్రరథ శాంతి అంటారు. డెబ్బై వసంతాల వ్యక్తికీ భీమరధి శాంతి చేస్తారు. 83 సంవత్సరాలు దాటితే సహస్ర చంద్రదర్శనం..  వెయ్యిపున్నములు సందర్శనోత్సవములు జరుపుతారు. వృద్దులు రెట్టించిన ఉత్సాహంతో జీవించేటట్టు చేసేందుకు ఈ ఉత్సవాలు. మన పెద్దలు దీవించే టప్పుడు శతాయుష్మాన్‌భవం అని దీవిస్తారు.అ నూరు సంవత్సరాల జీవితాన్ని నాలుగు దశలుగా 25ఏళ్ళు బ్రహ్మచర్యం, 25 ఏళ్ళు గార్హస్థ్యం, 25ఏళ్ళు వానప్రస్థం. 25ఏళ్ళు సన్యాసం అని మనపెద్దలు నిర్ణయించారు. ఇవి మానవుని సర్వతోముఖాభివృద్ధికి, ఆధ్యాత్మికతోన్నతికి, తద్వారా సమాజ వికాసానికి, దేశ కళ్యాణానికి తోడ్పడతాయని వారి విశ్వాసం. వీటినే ఆశ్రయ ధర్మాలు అంటారు. ఈ కాలంలో ఆశ్రయ ధర్మాల సంగతటుంచి వృద్ధాశ్రమాల్లో చేర్పించి ఏ శ్రమాలేకుండా చేతులు దులుపుకుంటున్నారు.

మన కర్తవ్యం :
    మనం బతకబోయే బతుకు వాళ్లు. మనం నడవబోయే దారి వాళ్లు. ఇప్పటి సమాజాన్ని మనకంటే ముందు స్వప్నించినవాళ్లు. దీని నిర్మాణానికి మనకంటే ముందు రాళ్లెత్తిన వాళ్లు. చరిత్రకు ప్రత్యక్ష సాక్షులు వాళ్లు. వాళ్లు... మనవాళ్లు. మన పెద్దలు. వయోవృద్ధులు. ప్రతి అంశంలోనూ వాళ్లకు ఒక అనుభవం ఉంటుంది. ఆలోచన ఉంటుంది. తమదైన దృష్టికోణం ఉంటుంది. గతాన్ని భవిష్యత్తుతో ముడివేస్తూ వర్తమానంతో జరిపే సంభాషణ వాళ్ల జీవితసారం.

    ఇంట్లో పరిస్థితులన్నీ పెద్దలతో చర్చించాలి. వాళ్లూ మనలో ఒకరిగా గుర్తించి ప్రతి విషయాన్ని పంచుకోవాలి. పిల్లలముందు కించపరచకుండా వాళ్ల ప్రాధాన్యతను పిల్లలు తెలుసుకునేలా చేయాలి. లేకుంటే రేపు.. మన పిల్లలు కూడా.. మనల్ని ఇంకా ఘోరాతిఘోరంగా చూడాల్సి రావొచ్చు. జీవిత చరమారకంలో కుటుంబంలోని వృద్ధులు వ్రశాంతం గా కాలం గడవడానికి అవసరమైన  చేయూత అందజేయడం కుటుంబసభ్యులందరి కనీస బాధ్యత. వృద్ధాప్యంలో ఉన్న వారితో ప్రతిరోజూ కాసేపైనా గడపాలి. వారి అభిప్రాయాలను గౌరవించి కుటుంబంలో ఓ గుర్తింపు ఉన్నదన్న విశ్వాసాన్ని కలిగించాలి. కుటుంబమే బాల్యానికి నాంది. సమాజ నిర్మాణానికి అదే పునాది, ఉమ్మడి కుటంబ వ్యవస్థ క్రమంగా తెరమరుగై చిన్న చిన్న కుటుంబాలు తెరమీదకు వచ్చాయి. ఏకసంతానంతో కుటుంబం ఇంకా చిన్నదైపోయింది.

    ఈ యేడాది అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం థీమ్‌.. 'Take a Stand Against Ageism' అందుకే వృద్ధులకు అండగా ఉందాం.. వాళ్లతో ఆలోచనలు పంచుకుందాం... ఎందుకంటే మనం కూడా ఎప్పుడో ఒకప్పుడు తప్పక వృద్ధులవుతాం కదా...

- గోపగోని సప్తగిరి
===============

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి