21, అక్టోబర్ 2017, శనివారం

కృష్ణవేణి తరంగాలు.. జీవ జల వాహకాలు (జాగృతి కృష్ణా పుష్కర సంచిక 2016)

కృష్ణవేణి తరంగాలు.. జీవ జల వాహకాలు

                        - గోపగోని సప్తగిరి, 98850 86126.

    కృష్ణానది. తెలుగు రాష్ట్రాల పాలిట జీవజల వారధి. 'కృష్ణవేణీ పావనోదక.. ధార పరితృప్తాంధ్రభూతల సస్యశ్యామల సార సంయుత.. సకలక్షామ నివారిణీ...' అని గొప్పగా పాడుకునే చరిత్ర ఈ నదీమ తల్లిది. భారత దేశంలో మూడో అతిపెద్ద నదిగా భాసిల్లుతోన్న కృష్ణానది.. దక్షిణ భారత దేశంలో రెండో అతిపెద్ద జీవనది. వీటిలో ఒకటి గోదావరి నది కాగా.. రెండోది కృష్ణానది. జీవనది అంటే ఎల్లప్పుడూ నీటితో కళకళలాడుతూ ప్రవహించే నది అని అర్థం. అయితే.. ఈరెండు అతిపెద్ద జీవనదులూ తెలుగు రాష్ట్రాల గుండా ఉరుకులు, పరుగులు పెట్టడం ఓ రకంగా మన అదృష్టంగా చెప్పాలి. ఓవైపు.. గోదావరి నది, మరోవైపు.. కృష్ణానది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను సస్యశ్యామలం చేస‌్తున్నాయి. అందుకే గోదావరి నదిని ఇక్కడ అందరూ ముద్దుగా దక్షిణ గంగ అని పిలుచుకుంటారు అలాగే.. కృష్ణా నదిని గర్వంగా కృష్ణవేణి అని చెప్పుకుంటారు.

    తెలుగు రాష్ట్రాల ఎనగర్రల్లో ఒకటైన కృష్ణానది.. పడమటి కనుమలలో పుట్టింది. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌కు ఉత్తరంగా మహాదేవ పర్వత శ్రేణిలో సముద్రమట్టానికి 1337 మీటర్ల ఎత్తున చిన్న ధారగా జన్మించి మెల్లమెల్లగా ముందుకు కదులుతుంది. అలా ముందుకు సాగుతున్న క్రమంలో అనేక ఉపనదులను తనలో కలుపుకుంటుంది. తన ప్రయాణంలో ఎన్నో నగరాలను, పట్టణాలను, ఆధ్యాత్మిక ప్రదేశాలను, పుణ్య స్థలాలను తాకూతూ వెళుతుంది. మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని పరీవాహక ప్రాంతాన్నంతా సస్యశ్యామలం చేస్తూ మొత్తం 1400 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అలా వెయ్యి కిలోమీటర్లకు పైగా సాగే ప్రస్థానం.. దివిసీమలోని హంసలదీవి దగ్గర ముగుస్తుంది. అక్కడ బంగాళాఖాతంలో కలిసే సమయంలో కృష్ణానది ఉగ్రరూపాన్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవు.

    భారత ద్వీపకల్పం పడమర చివరి నుండి తూర్పు చివరికి సాగే తన ప్రస్థానంలో కృష్ణానది.. 29 ఉపనదులను తనలో ఇముడ్చుకుంటుంది. మహాబలేశ్వర్ నుండి 135 కి.మీ.ల దూరంలో మొదటగా కొయినా నదిని తనలో కలుపుకుంటుంది. తరువాత వర్ణ, పంచగంగ, దూధ్‌గంగ ఉపనదులు కృష్ణవేణిలో కలుస్తాయి. మహారాష్ట్రలో 306 కిలోమీటర్ల దూరం ప్రవహించిన తర్వాత కృష్ణానది.. బెల్గాం జిల్లా ఐనాపూర్ గ్రామం వద్ద కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. జన్మస్థానం నుండి దాదాపు 500 కి.మీ. ప్రయాణించాక కర్ణాటకలో ఘటప్రభ, మాలప్రభ నదులు కృష్ణానదిలో కలుస్తాయి. తెలంగాణ లోకి ప్రవేశించే ముందు, భీమ నది కృష్ణలో ఇమిడిపోతుంది. కర్ణాటకలో 482 కిలోమీటర్ల దూరం ప్రవహించి రాయచూర్ జిల్లా దేవర్‌సుగుర్ గ్రామం వద్ద ఆ రాష్ట్రానికి వీడ్కోలు పలుకుతుంది. మహబూబ్‌నగర్ జిల్లా తంగడి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఇదే జిల్లాలోని ఆలంపూర్ ప్రదేశంలో ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది కృష్ణవేణి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించడమే తరువాయి.. దట్టమైన నల్లమల అడవుల్లోని లోయల్లోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిన కృష్ణా శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల గుండా ప్రవహించి విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి చేరుకుంటుంది.  తెలుగు రాష్ట్రాల్లో ప్రవాహం కొనసాగినంత దూరం.. దిండి, మూసి, పాలేరు, మున్నేరు మొదలైన ఉపనదులు  కృష్ణలో కలుస్తాయి. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు సమీపంలో తుంగభద్ర కలుస్తుంది. ఇదే కృష్ణానది యొక్క అతిపెద్ద ఉపనది. విజయవాడ వద్ద ఈ నది 1188 మీటర్ల వెడల్పుతో విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. ఆ తరువాత దివిసీమ లోని హంసల దీవి వద్ద బంగాళాఖాతం లో కలుస్తుంది. ఉపనదులు అన్నిటితో కలిపి కృష్ణా నదీ మొత్తం పరీవాహక ప్రాంతం 2,56,000 చ.కి.మీటర్లు ఉంటుంది.

    జీవనది అయిన కృష్ణపై బహుళార్థ సాధక ప్రాజెక్టులతో పాటు పలు ప్రాంతాల్లో చిన్న చిన్న ప్రాజెక్టులు కూడా నిర్మించబడ్డాయి. మహారాష్ట్ర మొదలు కొని ఆంధ్రప్రదేశ్‌ దాకా నాలుగు రాష్ట్రాల్లోనూ పలు ప్రాజెక్టులు ఇప్పటికే నిర్మించారు. మరికొన్ని నిర్మాణదశలో, ఇంకొన్ని ప్రతిపాదన దశలోనూ ఉన్నాయి. కర్ణాటకలో ప్రధానంగా చెప్పుకోదగినవి అలమట్టి ప్రాజెక్టు, నారాయణపూర్ ప్రాజెక్టు.. ఈ రెండింటినీ కలిపి అప్పర్ కృష్ణా ప్రాజెక్టు అని పిలుస్తారు. కృష్ణానదిపై తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జున సాగర్‌, ప్రకాశం బ్యారేజీ. తెలంగాణ నుంచి కృష్ణానది ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించగానే.. నల్లమల కొండల శ్రేణి లోని లోతైన లోయల లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడే శ్రీశైలం, నాగార్జున సాగర్ ల వద్ద పెద్ద ఆనకట్టలు నిర్మించబడ్డాయి. విజయవాడ వద్ద బ్రిటిషు వారి కాలంలో నిర్మించబడ్డ ప్రకాశం బ్యారేజిని దాటి కృష్ణానది డెల్టా ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది. ఇవి కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా నదిపై ప్రియదర్శిని జూరాల, పోతిరెడ్డిపాడు, తెలుగుగంగ, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, పులిచింతల తదితర ప్రాజెక్టులు నదీ పరీవాహక ప్రాంతంలోని సాగుభూమిని సస్యశ్యామలం చేస్తున్నాయి.

    సహజంగానే మన జీవితంలో భాగమైన, మన ఎదుగుదలకు దోహదపడే, నిత్యజీవితంలో సాయపడే ప్రకృతిని ఆరాధించడం హిందువుల సంస్కృతి. అందులో భాగంగానే జీవనదులనూ ఇలవేల్పులుగా కొలవడం మొదటినుంచీ ఉంది. ఆ క‌్రమంలోనే నదీమతల్లి కృష్ణవేణిని కొలవడం కూడా జరుగుతున్నది. అందుకే కృష్ణా నది తీరప్రాంతంలో నది ఒడ్డున వెలసిన, కొలువై ఉన్న ఆలయాలకు లెక్కేలేదు. ఇక.. పన్నెండేళ్లకోసారి కృష్ణమ్మకు పుష్కరాలు నిర్వహించడం సనాతనంగా వస్తోన్న సంస్కృతి.

                        - గోపగోని సప్తగిరి, 98850 86126.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి