15, మార్చి 2014, శనివారం

భారతదేశంలో మతద్వేష రాజకీయాలు చెల్లవ్ - మరోసారి నిరూపణ

కాంగ్రెస్ పార్టీ హడావిడిగా దొడ్డి దారిన పని పూర్తి చేయాలనుకున్న వ్యూహం బెడిసికొట్టింది. మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హిందువులను మైనార్టీలకంటే అధ్వాన్నంగా చూపే కుయుక్తులకు గండి పడింది. అడ్డగోలుగా రూపొందించిన మతహింస నిరోధక బిల్లు అటకెక్కింది. 
ఫిబ్రవరి 5వ తేదీన రాజ్యసభ మొదలైన రోజే మతహింస నిరోధక బిల్లును సభలో ప్రవేశపెట్టాలనుకున్న యుపిఎ ప్రభత్వ ప్రయత్నాలకు విపక్షాలు అడ్డుకట్ట వేశాయి. నిరసనలు, ఆందోళనల మధ్య కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే మతహింస నిరోధక బిల్లును ఎగువ సభలో ప్రవేశపెట్టారు. అయితే సభలో రాద్ధాంతం చెలరేగింది. ఏకపక్షంగా బిల్లును ఎలా ప్రవేశపెడతారంటూ బిజెపి సహా విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. 
ఆంధ్రపదేశ్ విభజన ప్రక్రియ పార్లమెంటును కుదిపేస్తున్న సంకేతాలు, సమాచారం ఉండటంతో మతహింస నిరోధక బిల్లును మమ అనిపించాలని యుపిఎ సర్కారు భావించింది. ఈ బిల్లును వ్యతిరేకించిన బిజెపి సభ్యుడు అరుణ్ జైట్లీ పలు అభ్యంతరాలు లేవనెత్తారు. శాంతి భద్రతల అంశం రాష్ట్రాల పరిధిలో ఉంటుందని, కేంద్రం పరిధిలోకి రాదని చెప్పారు. ఇది రాష్ట్రాల హక్కులను ఉల్లంఘించడమేనన్నారు. సభకు ఇలాంటి బిల్లు తెచ్చే అర్హత లేదన్నారు. మతహింస నిరోధక బిల్లును రాజ్యసభలో బిజెపితో సహా ఏ.ఐ.ఏ.డి.ఎం.కె., తృణమూల్ కాంగ్రెస్, సి.పి.ఐ., సి.పి.ఎం. తదితర పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. 
మతహింస నిరోధక బిల్లుపై ఇటు ప్రజల్లోనూ, అటు రాజకీయ నాయకులలోనూ భయాందోళనలు ఎందుకు నెలకొన్నాయో ఓసారి చూద్దాం ! 
2011లో రూపొందించిన ఈ బిల్లు హిందువులపై అకారణంగా ప్రయోగించేందుకు ముస్లింలకు ఒక అస్త్రంలా పరిణమించే ప్రమాదం ఉంది. 2011లోనే ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు యుపిఎ ప్రభుత్వం విపలయత్నం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు, హిందూ సమాజం తీవ్రంగా వ్యతిరేకించడంతో వెనక్కు తగ్గింది. మైనార్టీలపై దాడులు జరిగితే మాత్రమే వర్తించే ఈ చట్టం హిందువులపై దాడులు జరిగితే మాత్రం వర్తించదు.  
హిందువులు అల్పసంఖ్యాకులుగా ఉన్న కాశ్మీరు, ఈశాన్య రాష్ట్రాల్లోనూ హిందువులు మైనార్టీలే అయినా ఈ బిల్లు వర్తించదు.  
ఈ బిల్లు అమల్లోకి వస్తే హిందువులు అసత్య ఆరోపణలకు, చేయని తప్పులకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఏ కారణం లేకుండా హిందూ మతానికి చెందిన ఓ వ్యాపారిపై ముస్లిం వ్యాపారి కేసు పెట్టవచ్చు. ఒక్కసారి కేసు పెట్టారంటే విచారణ లేకుండానే అరెస్టు చేసే అవకాశముంది. బెయిల్ కూడా లభించని కఠిన సెక్షన్ల కింద కేసు పెట్టొచ్చు.  
మైనార్టీలను మానసికంగా వేధిస్తున్నారన్న చిన్నా చితకా కారణాలతోనూ హిందువులపై కేసులు పెట్టడానికి ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది. ఎవరైనా ఓ కార్యకర్త తప్పు చేస్తే ఆ సంస్థ అధినాయకులపై వాళ్లకు తెలియకుండానే కేసులు పెట్టొచ్చు. ఆ సంస్థలను నిషేధించవచ్చు కూడా. మతహింస నిరోధక బిల్లు వెనుక దాగి ఉన్న అంశాల్లో ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇలాంటి చాలా వివాదాస్పద అంశాలను హిందువులను ఇబ్బందులకు గురి చేయడమే లక్ష్యంగా ఈ బిల్లులో పొందుపరిచారు.
- హంసినీ సహస్ర 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి